యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్కు వేలాది మంది భారతీయ కార్మికులు ఉపాధి కోసం వలసపోతున్నారు. మన దేశంలో ఉపాధి అవకాశాలు లేక, ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా జనవరి 16న రోహ్తక్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. అంతకుముందు 2023 డిసెంబర్లో హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఇజ్రాయెల్లో కార్పెంటర్లు, ఐరన్ బెండర్లు, సిరామిక్ టైల్స్ ఫిక్స్ చేయడం తదితర పనులు చేసే 10 వేల మంది అసంఘటిత రంగ కార్మికులు కావాలంటూ హర్యానా ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. గాజాతో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతున్న విషయాన్ని మర్చిపోవద్దు. నాలుగు నెలలుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే 25 వేల మందికిపైగా పౌరులు, సైనికులు మరణించారు. ఈ పరిస్థితుల్లో అక్కడికి భారతీయ కార్మికులు వెళ్లడం ఆందోళనకరం.
కర్మాగారాలు, నిర్మాణ స్థలాలు, దవాఖానల్లో పనిచేస్తున్న పాలస్తీనా కార్మికుల స్థానాలను భారతీయులతో భర్తీ చేయాలని ఇజ్రాయెల్ చూస్తున్నది. ఈ విధానంలో భాగంగా 2023 మేలో 42 వేల మంది భారతీయ కార్మికులను రిక్రూట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వంతో ఇజ్రాయెల్ ఒప్పందం చేసుకున్నది. అయితే యుద్ధం కారణంగా ఈ ఒప్పందం అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. రిక్రూట్ అవుతున్న కార్మికులకు వారి పని ఏమిటి? వారి భద్రత ఏమిటనే అంశాలపై ఎటువంటి సమాచారం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించడం లేదు. కానీ, నైపుణ్య శిక్షణ పేరిట నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒక్కో కార్మికుడి నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ విషయమై హర్యానా కార్మిక మంత్రి స్పందించడానికి నిరాకరించారు. రిక్రూట్మెంట్కు సంబంధించి కార్మికుల వలసలను పర్యవేక్షిస్తున్న కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖదే బాధ్యత అని చెప్తూ ఆయన చేతులెత్తేశారు. కార్మికుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారనే విషయం గురించి విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అధికారులు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు కార్మికుల భద్రతకు జవాబుదారీగా లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, ఈ నియామకాలను నిలిపివేయాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో కార్మికులను పంపడం వారి ప్రాణాలతో చెలగాటమాడటమే అవుతుంది.
ఆళవందార్ వేణుమాధవ్
86860 51752