ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు పాటించడంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు ఆదర్శవంతమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అగాధంలోకి నెట్టివేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ ఎన్నికల సంఘం ప్రధాన పాత్ర పోషిస్తున్నది.
స్వయం ప్రతిపత్తి కలిగిన భారతదేశ ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం 1950 జనవరి 25న ఏర్పడింది. ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఉన్న సెక్షన్లకు లో బడి ఎన్నికల సంఘం తమ బాధ్యతలను నిర్వర్తిస్తుం ది. ఎన్నికల సంఘానికి అనుబంధంగా ఆర్టికల్ 327 లోని 43 సెక్షన్ ద్వారా ప్రజా ప్రాతినిధ్యం చట్టం 19 51 జూలై 17న రూపొందించబడింది. ఏడు దశాబ్దాల క్రితం ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని బలహీన నియమాలను ఆసరా చేసుకుని అధికారంకోసం దేశంలోని రాజకీయ పార్టీ లు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడం దురదృష్టకరం. ఈ నియమాలను తొలగించి, వాటి స్థానంలో కఠిన నియమాలు తీసుకు రావాలని ప్రజాస్వామిక వాదులు దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నారు.
ఓటర్కార్డుకు ఆధార్ను లింక్ చేసే ఎన్నికల నియమావళి అమెండ్మెంట్ బిల్ 2021 డిసెంబర్ నెలలో ఆమోదించారు. ఈ బిల్ ద్వారా బోగస్ ఓటర్లను తొలగించి ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను పెంచామని అప్పట్లో ప్రధాని మోదీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నది. కానీ అదేం జరగలేదు.
భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించే త్రిసభ్య కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగి స్తూ ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రత్యేక బిల్లు ఆమోదించింది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వాదులను షాక్కు గురిచేసింది. ఆ బిల్లు ప్రకా రం తొలగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధాని సూచించిన కేంద్ర కేబినెట్ మంత్రిని త్రిసభ్య కమిటీలో నియమించాల్సి ఉన్నది.
ప్రస్తుత త్రిసభ్య కమిటీలో ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నాయకు డు, ప్రధాని సూచించిన కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు. ఈ కమిటీ లో ఉన్న ముగ్గురూ రాజకీయనేత లే. వీరిలో ఇద్దరు అధికార పార్టీకి చెందినవారు కాగా ఒక్కరు ప్రతిపక్ష నేత కావడం గమనార్హం. కనుక స హజంగానే ప్రధాని, కేబినెట్ మం త్రి సూచించిన వ్యక్తులే ఎన్నికల కమిషనర్లుగా రాష్ట్రపతి నియమిస్తా రు. దీనిద్వారా ఎన్నికల వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి తీవ్ర అగాధమని కచ్చితంగా చెప్పవచ్చు. ఓటర్కార్డుకు ఆధార్కార్డ్ లింకు చేసి మొత్తం ఎన్నికల వ్యవస్థ ను ప్రక్షాళన చేసినట్టు గొప్పలు చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం అప్రజాస్వామికమని గుర్తుకు రాకపోవడం శోచనీయం. బోగస్ ఓట ర్ల విషయంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఏమాత్రం అనుమానం ఉన్నా సంబంధిత ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసే పరిస్థితి ఉంటుంది. ఫిర్యాదు ఆధారంగా చర్యలూ ఉంటాయి.
ప్రస్తుతం ఎన్నికల్లో పరిమితికి మించి జరుగుతున్న ధన ప్రవాహాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉన్నది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రాష్ర్టాల వారీ గా రూ.54 నుంచి రూ.70 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ.70 నుంచి రూ. 95 లక్షలు ఎన్నికల కోడ్ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నికల రోజు వరకు ఖర్చు చేయవచ్చు. కానీ ఎన్నికల ఖర్చు ఈ మొత్తానికంటే ఎక్కువ ఉంటుందనేది నిర్వివాదాంశం. ఎన్నికల ముందు నాయకులు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అలా డబ్బులు ఖర్చు పెట్టి నెగ్గిన వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే గెలిచిన రాజకీయ పార్టీలను వీడి అధికార పార్టీలోకి ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. వీటిపై చర్యలు ఉండాల్సిందే.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మెరుగ్గానే ఉన్నది. పట్టణ, నగర ప్రాం తాల్లో ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ముఖ్యంగా విద్యావంతులు ఓటే యటానికి ఆసక్తి చూపటం లేదు. కనుక ఓటింగ్శాతం పెరిగేలా చర్యలు చేపట్టే బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఇటువం టి అనేక విషయాలపై కఠిన నియమా లు రూపొందించి ఎన్నికల సంఘం, ప్రజాప్రాతినిధ్య చట్టాలను పటిష్ట పరచవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నది.
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్,్టకాలమిస్ట్)