మన దేశంలో రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల్లేక రోడ్డు మీదకు రావడమే విన్నాను తప్ప, ‘రైతులకు ఆదాయం చాలా ఎక్కువైపోయింది, వారి మీద పన్నులు వేయండి’ అనే మాట ఇప్పటివరకు నేనైతే వినలేదు. తాజాగా జనవరి 21వ తేదీన ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ ‘ద నెస్సెసిటీ ఆఫ్ ట్యాక్సింగ్ ఫార్మర్స్ ఇన్కం ఇన్ ఇండియా’ (భారతదేశంలోని రైతుల ఆదాయంపై పన్ను వేయాల్సిన అవసరం) అనే వ్యాసం రాశారు.
రాజకీయ నాయకులు సాధారణంగా ‘ద నెస్సెసిటీ ఆఫ్ ఇంప్రూవింగ్ ఫార్మర్స్ ఇన్కం’, ‘ద నెస్సెసిటీ ఆఫ్ సపోర్టింగ్ ఫార్మర్స్’ అంటే.. రైతులకు పెట్టుబడి సాయం చేయండి, రైతుల ఆదాయాలు పెంచడం ఎలా అనే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. గతంలో మన ప్రధాని మోదీ ‘డబులింగ్ ఫార్మర్స్ ఇన్కం’ అనే నినాదం ఇచ్చారు. అంటే రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని. ఇప్పుడు ఆ రెట్టింపు ఆదాయాలేమో కానీ, ‘రైతుల ఆదాయంపైన పన్ను వేయండి’ అంటూ ప్రధానమంత్రికి సలహాలిచ్చే మండలి చైర్మన్ బహిరంగంగా ప్రకటించడం విడ్డూరం. ఇలాంటివాళ్లు సలహాలు ఇస్తే మన విధానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి మనసులో ఏముందో మనకు తెలియదు. ‘మన్కీ బాత్ ఇంకా బయటికి రాలే.’ ప్రధానమంత్రికి చెప్పకుండా, ఆయన అంగీకరించకుండా ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బహిరంగంగా వ్యాసం రాస్తారా?
నిజానికి ఈ వ్యాసం పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ. అసలు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ వ్యాసంలో బిబేక్ దేబ్రాయ్ ‘రైతుల ఆదాయంపై పన్ను వేసే అధికారం రాష్ర్టాల జాబితాలో ఉంటుంది’ అని తెలివిగా రాశారు. ప్రధానమంత్రి సలహాదారునికే కాదు, ప్రధానమంత్రికి కూడా నేను వేసే సూటి ప్రశ్న ఏమంటే.. రైతులపై పన్ను వేయాలని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ చెప్పారు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఊరుకుంటారా?, రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు చేయరా?.. అంటే, ఒకవైపు మీరే సలహా ఇస్తా రు, మరోవైపు మీరే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా రు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల ఆదాయంపై పన్ను వేస్తే ఊరుకుంటుం దా అక్కడి బీజేపీ?
ఎంత విచిత్రమో చూడండి.. కేంద్రంపై రాజకీయంగా సవాల్ రాకూడదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు పొలిటికల్గా సవాల్ ఎదుర్కోవాలి. ఇది ప్రధానమంత్రికి ఆయన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ఇచ్చే సలహా. అయ్యా బిబేక్ దేబ్రాయ్.. రైతుల ఆదాయంపై పన్ను విషయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటే మీరెందుకు సలహా ఇవ్వాలి. మీరు ప్రధానమంత్రికి కదా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్? చీఫ్మినిష్టర్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ కాదు గదా?
బిబేక్ దేబ్రాయ్ ఇంకో విచిత్రమైన మాటంటారు. ‘ప్రపంచంలో అత్యంత సంపన్న గ్రామాలు ఎక్కడున్నాయంటే భారతదేశంలో ఉన్నాయట! ‘వరల్డ్స్ రిచెస్ట్ విలేజెస్ ఇన్ ఇండియా’ అట. ఇది ఆశ్చర్యం కాకపోతే మరేంటి? ప్రధానమంత్రికి ఆర్థిక విధానాలపై సలహాలు ఇచ్చే చైర్మన్ ఏనాడైనా
గ్రామాలు తిరిగారా?
ఈ వ్యాసం చదువుతున్న వారెవరైనా ‘ప్రపంచంలో అత్యంత సంపన్న గ్రామాలు ఎక్కడున్నాయంటే భారతదేశంలో ఉన్నాయంటే ఒప్పుకుంటారా? బిబేక్ దేబ్రాయ్ ఏ గ్రామం సంపన్నమైందో ఈ వ్యాసంలో పేర్కొనలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే నేను కూడా ఆ గ్రామానికి పోయి దర్శనం చేసుకొని వచ్చేవాడిని. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంట. ఇండియాలో సంపన్న గ్రామం ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, నేను కాదనను. కానీ ప్రపంచంలోనే సంపన్న గ్రామాలు ఎక్కడున్నాయంటే భారతదేశంలో కనపడుతాయంట! మరి ఆయనకు ఎక్కడ కనబడ్డాయో, జీవితంలో ఆయన గ్రామాలకు వెళ్లారో, లేదో.. అసలు గ్రామాలే చూడని ఆర్థికవేత్తలను ప్రధానమంత్రి తన ఆస్థాన ఆర్థిక సలహాదారుల మండలికి చైర్మన్గా పెట్టుకోవడమే విడ్డూరం. దీనిమీద మనమందరం ఆలోచించాలె.
రైతుల ఆదాయాలు పెరిగాయి, ఇదిగో లెక్కలు చూడండి.. ఆదాయాలు పెరిగాయి గనుక, రైతులు పన్ను కట్టండంటే అర్థం ఉంటుంది. బిబేక్ దేబ్రాయ్ ఆయన వాదనను ఎట్లా సమర్థించుకుంటారంటే.. 1860లో ‘ఫార్మర్స్ ఇన్కం ట్యాక్స్ స్టార్ట్’ చేయాలని అప్పటి పాలసీ ఉండె కదా? 1860లో రైతులు ఉన్నదాని కన్నా ఇప్పటి రైతులు పేదవాళ్లా అని అడుగుతారు? ఆయనకు అర్థం కాని, తెలియని విషయమేమంటే.. 1860లో రైతులే లేరు. జమీందారులున్నారు, భూస్వాములున్నారు. భారతీయ సమాజం పట్ల, గ్రామీణ భారతం పట్ల అవగాహన లేని వ్యక్తి ప్రధానమంత్రికి ఆర్థిక విధానాలపై సలహాలిస్తే ఈ దేశం ఏం కావాలె, ఎటు పోవాలె? 1860లో కన్నా రైతులు పేదవాళ్లా? ఎందుకు పన్నులు వేయకూడదంటారు. ఇవాళ ఈ దేశ రైతాంగంలో మూడింట రెండొంతులు ఐదెకరాల్లోపు ఉన్నవాళ్లు.
1860లో భూస్వాములు, రైతులు వేల ఎకరాల్లో ఉండేవాళ్లు. రైతులు కాదు వాళ్లప్పుడు, జమీందార్లు. వాళ్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు సాగించింది మన తెలంగాణ గడ్డ. ఇక్కడి నుంచి మొదలుకొని కేరళ, మహారాష్ట్ర, బెంగాల్.. ఇలా దేశమంతా పెద్ద రైతాంగ పోరాటాలు జరిగాయి కదా? బహుశా బిబేక్ దేబ్రాయ్కి హిస్టరీ కూడా తెలియదు. ఎకనామిక్స్ ఎలాగూ తెలియదు. హిస్టరీ ఎలా తెలుస్తుంది? 1860లో బ్రిటిష్వారు పన్ను వేయమన్నారు కదా? ఇప్పుడు కూడా వేయమంటారు. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన పనిని, ఇప్పుడు స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని చేయమంటారు. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వానికి, స్వతంత్ర భారత ప్రభుత్వానికి ఉన్న తేడా కూడా తెలియటం లేదు. ఆయన ఇంకోవాదన ఏమంటే.. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కాబట్టి, రైతుల ఆదాయంపైన పన్ను వేస్తే తప్పు లేదంటారు.
ఒకవైపు ప్రధాని మోదీ కలోనియల్ లెగసీ (వలసవాద వారసత్వాన్ని) మొత్తం వదులుకోవాలని అంటున్నరు. అందులో భాగంగానే పార్లమెంట్ కోసం కొత్త భవనాన్ని కట్టారు. ఎందుకంటే పాత భవనం బ్రిటిష్వాళ్ల కాలంలో కట్టిన బిల్డింగ్ కదా అనంటారు? రోడ్లకు పేర్లు మారుస్తరు. రాజ్పథ్ను ఇప్పుడు కర్తవ్య్పథ్ అంటు న్నం. రాజ్పథ్ అంటే అది రాజుల రహదారి అని అర్థం వస్తుందట. ఒక దేశాన్ని రిపబ్లిక్ అయిన తర్వాత కూడా ‘రాజ్’ అని అంటం. కారణమేదైనా ‘రాజ్’ అని ఆ అర్థం తీసుకొని పేరు మార్చారనుకుందాం. కానీ ఆయన ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మనేమో బ్రిటిష్ కాలపు చట్టాలను ఇప్పుడు అమలుచేయడం లేదా అనడుగుతారు? మరి ఇదెందుకు ఉండకూడదని వాదిస్తారు.
బ్రిటిష్ కాలంలో బెంగాల్, హైదరాబాద్ ఇలా అనేక ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆదాయపు పన్ను ఉండె కదా, ఇప్పుడెందుకు లేదని బిబేక్ దేబ్రాయ్ ఆ వ్యాసంలో ఒక ఉదాహరణ కూడా ప్రస్తావించారు. అప్పుడు హైదరాబాద్ను పాలించిందెవరు? నిజాం రాజులు కదా? రాజులు జమీందార్లకు, జాగీర్దార్లకు వేల ఎకరాల భూమి ఇచ్చి దాన్నుంచి పన్ను వసూలు చేశారు. అంటే ఇంకా జాగీర్దారీ విధానాన్ని, జమీందారీ విధానాన్ని సమర్థిస్తారా? వ్యవసాయ రంగంపై ఆధారపడ్డవాళ్లలో ఎంతమందికి ఆదాయం ఉంది. ఆ ఆదాయం పైన పన్ను వేస్తే ఎంతొస్తది? ఈ లెక్కలేమన్న చెప్తే సంతోషించేవాళ్లం. నేనేమీ సంపన్నులపైన పన్ను వేయవద్దని అనడం లేదు. కానీ ఆయన వాస్తవంగా ఎక్కడా ఆ లెక్కలు పేర్కొనలేదు. ఆయన వాదనొక్కటే.. 1860లో బ్రిటిష్ వారు రైతుల వ్యవసాయ ఆదాయంపై పన్ను వేయమన్నారు. ఇప్పుడు అంతకన్నా పేదవాళ్లా రైతులు. రైతులు బాగా సంపాదిస్తున్నారు కదా? అని అడుగుతారాయన.
రాజుల కాలంలో, అంటే ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్న రోజుల్లో, బ్రిటిష్ పాలనలో ఉన్న రోజుల్లో రైతులపై, వ్యవసాయంపై పన్ను ఉండేది కదా ఇప్పుడెందుకు వద్దని వాదిస్తారు. ఈ వాదన ఎంత ప్రమాదకరమో దేశ ప్రధానే ఆలోచించాలి. తన ఆర్థిక సలహాదారుడికి ఆయనే చెప్పాలి. అందుకే మాలాంటివాళ్లు ఆర్థిక విధానాలపై ప్రశ్నిస్తారు? అలా ప్రశ్నిస్తే దేశద్రోహమంటారు. అయ్యా! నేనొక్కటే అడుగుతున్నా.. దేశానికి అన్నం పెడుతున్న రైతుపై పన్ను వేస్తే కదా దేశ ద్రోహమయ్యేది. అవునా, కాదా మీరే చెప్పండి? ఎవరు సంపన్న రైతులు, ఎంత మంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు.
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్’ అనే పథకాన్ని అమలు చేస్తానంటుంది. మరోవైపు ప్రధాని ఆర్థిక సలహాదారు రైతుల ఆదాయంపై పన్ను వేస్తానంటారు. ప్రభుత్వ విధానం రైతుల అణచివేతనే కదా? బిబేక్ దేబ్రాయ్ లాంటివారు సలహాదారులుగా ఉండటం దేశానికి, ప్రధానికి గౌరవం అనిపించుకుంటుందా? ప్రధాని మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆయన ‘ఆర్థిక సలహా మండలి’ చైర్మన్ బహిరంగంగా ఇలా వ్యాసం రాస్తారా? ప్రభుత్వంలో ఎక్కడోచోట ఈ ప్రస్తావన రాకుండా ఇలాంటి సలహాలు బయటికి వస్తాయా? ఈ సలహాలకు ఇలాంటి హేతుబద్ధత వస్తుందా? బ్రిటిష్ వారి చట్టాలను సమర్థించే వారి హేతుబద్ధత ఇది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రైతుల వెన్నెముక విరిచే పన్నులు రాబోతున్నాయా అనే అనుమానం మీకూ రాక మానదు.
-ప్రొఫెసర్ కే నాగేశ్వర్