స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఏపీ మొదలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాన్క కాంగ్రెస్ పాలనలో మన ముఖ్యమంత్రుల జాబితా పరిశీలిస్తే… ఎక్కువ శాతం మందికి పదవీకాలం ముగియకముందే అధిష్ఠానం ఉద్వాసన చెప్పడం గమనించదగిన అంశం.
అంతేకాదు, ప్రతి ముఖ్యమంత్రి ఏదో ఒక ఆరోపణతో/ అవినీతి పనులతో/ అసమ్మతి పోరుతో పదవిని కోల్పోయినట్టు కూడా తెలుస్తున్నది. అంటే కాంగీ అధిష్ఠానానికి ముఖ్యమంత్రులను మాటిమాటికి మార్చే గుణం జాతి లక్షణంగా అలవడిందని తెలుస్తున్నది.
ముఖ్యమంత్రులను మార్చడం వల్ల ప్రజా పాలన సాఫీగా సాగదు. అభివృద్ధి కుంటు పడుతుంది. ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో ముఖ్యమంత్రిని మార్చితే తప్పేమీ లేదు. సరైన కారణం ఉంటే మార్పును ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ కాంగీ వారు మాత్రం ముఖ్యమంత్రుల మార్పును ఒక క్రీడగా చేయడం బాధాకరం. ఈ విధమైన వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రతి రాష్ట్రంలోను ఉన్నట్టు చరిత్ర చెప్తున్నది.
ఉమ్మడి ఏపీలో కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మినహా ఏ ఒక్కరు ఐదేండ్లు స్థిరపాలన అందివ్వలేదు. ఉమ్మడి ఏపీకి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కర్నూలు జిల్లాలోని బస్సు రూట్లను జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. తదుపరి దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ర్టానికి తీసుకువచ్చారు. కులం/ ముఠా రాజకీయాల మధ్య ఆయనకు ఊపిరి సలపకుండా చేశారు. బలీయమైన రెడ్డి వర్గం కలిగిన ఏసీ సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను హేళన చేశాడు కూడా.
1964 నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ఏకంగా ఏడేండ్లు పాలించాడు. ఆయన వైఖరి వల్లనే 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు ఉప్పెనలా ఉద్యమించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని, ఇందిరమ్మ తెలంగాణకు చెందిన సౌమ్యుడు పీవీతో అంతగా అపాయం లేదనుకొని 1971లో ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అప్పటికే స్వాతంత్య్రం వచ్చి దాదాపు 25 ఏండ్లయింది. భూస్వామ్య వ్యవస్థ బలపడి పేదలకు గుంట భూమి కూడా లేని దీనస్థితిని చూసిన పీవీ, భూ సంస్కరణలు ప్రవేశపెట్టి సంచలనం సృష్టించడమే కాదు, భూస్వాముల గుండెల్లో ప్రకంపనాలు కలిగించారు.
పీవీ ‘వామనుడ’నుకుంటే త్రివిక్రమావతారం ఎత్తాడని తస్మదీయులకు చెమటలు పట్టాయి. మెత్తనివాడనుకొన్న పీవీ ఇందిరా కాంగ్రెస్ నాయకుల పాలిట ముల్లులా తయారయ్యారు. అది మింగుడు పడని ఇందిరమ్మ ‘జై ఆంధ్ర’ ఉద్యమాన్ని సాకుగా తీసుకున్నది. పీవీ చేత రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించింది. తర్వాత 1973లో జలగం వెంగళరావుకు పట్టం గట్టింది. 1975లో దేశంలో విధించిన ఎమర్జెన్సీ పుణ్యమాని జలగంపై ఎలాంటి వేటు పడలేదు. 1978లో మళ్లీ చెన్నారెడ్డి పగ్గాలందుకున్నాడు. కానీ, ఆయన షష్టిపూర్తి ఉత్సవం చందారెడ్డిని చేసింది. షికాయత్లు వినే సంస్కారం ఉన్న ఇందిర, అంగూఠా ఛాప్ (వేలి ముద్రలు వేసేవాడు, నిరక్షరాస్యుడు) అంజయ్యను 1980లో ముఖ్యమంత్రిగా అందలమెక్కించింది. నిజానికి ఆయన కూడా రెడ్డివర్గం వాడే. ఆయన అసలు పేరు రామకృష్ణారెడ్డి. తండ్రి పేరు పాపిరెడ్డి. ఆయన దళితుడని, బీసీనని చెప్పుకొనేవాడు. అమాయకత్వంతో అడిగినవాడి కల్ల మంత్రి పదవి ఇచ్చి అరవై పైచిలుకు సభ్యులతో మంత్రి వర్గాన్ని నిర్మించి అంజయ్య క్యాబినెట్ అనే సామెత పుట్టడానికి కారణమయ్యాడు. సరే తర్వాతేమైంది? 16 నెలలకే అంజయ్యకు ఉద్వాసన చెప్పింది. 1982లో భవనం వెంకట్రాంరెడ్డిని కుర్చీలో కూర్చుండబెట్టింది. 7 నెలలు తిరక్కుం డానే పదవీచ్యుతుడిని చేశారు. తదుపరి ఎవరైతే చెప్పు చేతల్లో ఉంటారని ఆలోచించగా కోట్ల విజయభాస్కరరెడ్డి కనిపించాడు. ఇలాంటి వారైతేనే బెటర్ అనుకొని ఆయనను కుర్చీలో కూర్చుండబెట్టింది. ఈ మ్యూజికల్ చైర్ పోటీలు చూడలేక ప్రజలే గంట కట్టి ఎన్టీఆర్కు జైకొట్టారు. కాంగ్రెస్పై విముఖతే తెలుగుదేశాన్ని గెలిపించింది.
1989లో మళ్లీ చెన్నారెడ్డికి సింహాసనం ఇచ్చిన అధిష్ఠానం 12 నెలలకే హైదరాబాద్లో చెలరేగిన మతకల్లోలాల సాకుతో ఆయనను తొలగించి నేదురుమల్లి జనార్దనరెడ్డికి పట్టంగట్టింది. నేదురుమల్లి 1992 జూన్లో సీటుకు ఐదు లక్షల చొప్పున కాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునే ప్రైవేటు యాజమాన్యంలోని 20 ఇంజినీరింగు, వైద్య కళాశాలలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విధంగా కళాశాలలను స్థాపించడానికి పర్మిట్లు పొందిన అనేక సంస్థలు సారా వ్యాపారులు, ఎక్సైజ్ కాంట్రాక్టర్లు, మంత్రులు పెట్టుబడి పెట్టినవే. వీటికి అనుమతులు మంజూరు చేయడానికి జనార్దనరెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలుచేశాడని అధిష్ఠానం ఆగ్రహించి జ(ధ)నార్జన రెడ్డిని పదవి నుంచి తొలగించి మళ్లీ కోట్ల విజయభాస్కరరెడ్డినే నియమిం చింది. 1982లో మాదిరి ఆయన ఉక్కుపాదం ఎన్టీఆర్కు గోల్డెన్ లెగ్ అయింది. కాంగీయుల తగవులాటను చూసి విసిగిన తెలుగు ఓటర్లు మళ్లీ ఎన్టీఆర్కే పట్టంగట్టారు.
1999లో సోనియమ్మ అస్మదీయుడని (ఇద్దరిదీ ఒకే మతం) భావించి మళ్లీ రెడ్డి గ్రూప్కు చెందిన వైఎస్ రాజశేఖరరెడ్డికే పగ్గాలిచ్చింది. అఫ్కోర్స్ వైఎస్ఆర్ 1470 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి మార్గం వేసింది. ఉచిత విద్యుత్తు హామీ ప్రజలను ఊరించింది. శివరాత్రి నాడు భోజనానికి పిలిచినట్టు… అసలు విద్యుత్తు ఉత్పాదనే లేనప్పుడు ఉచిత విద్యుత్తు పథకం నేతీ బీరకాయ వంటిదే కదా! తెలంగాణ రాష్ట్రం అవతరించగానే సీఎం కేసీఆర్ తొలుత ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసి తర్వాత భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లు నెలకొల్పారు. విద్యుత్తు ఉత్పాదన పెంచడమే కాదు, కార్యనిర్వహణాదక్షుడని కేసీఆర్ నిరూపించుకున్నారు.
వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలు వేయగా అప్పటి మంత్రి పి.శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్ఆర్ హయాంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. క్విడ్ ప్రో కో రూపం లో వైఎస్ జగన్కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్టు సీబీఐ చార్జిషీటులో పేర్కొన్నది.
వైఎస్ మరణం తర్వాత రోశయ్యది మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఆయన తర్వాత కిరణ్కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టా రు. ఈ విధంగా నీలం సంజీవరెడ్డి మొదలు కిరణ్కుమార్ రెడ్డి వరకు ఎక్కువ శాతం అవినీతి ఆరోపణలతోనో అసమ్మతి వర్గాల ఒత్తిడితోనో కొందరు నెలల్లో, కొందరు ఏడాదిలో పదవిని వదులుకున్నారు. ఉదాహరణకు 1978 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగేండ్ల పాలనలోనే చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్రెడ్డిలతో కలుపుకొని నలుగురు ముఖ్యమంత్రులు మారారు. 1989-92 మధ్య మూడేండ్లలో ముగ్గురు, 2009-13 మధ్య మూడేండ్లలో ముగ్గురు మారారు. దీన్నిబట్టి కాంగీయులది ఆరు సూత్రాల పథకం కాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల మార్పిడి పథకమని తెలియవస్తున్నది! ఇది వ్యంగ్య విశ్లేషణ కాదు.. చరిత్ర చెప్పిన సత్యానికి అక్షర రూపం!
-డాక్టర్ వి.వి.రామారావు
98492 37663