అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం…అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. దేశంలో హైదరాబాద్ స్థానం విశిష్టమైనది. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం..విశ్వనగరంగా రూపాంతరం చెందింది. ఎన్నో అద్భుత కట్టడాలకు నెలవైన హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్నది.
గొప్ప అందాలతో కూడిన హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు, భవిష్యత్కు మార్గదర్శకం చూపే క్రమశిక్షణ, మతసామరస్యంతో కూడిన జీవనశైలి… ఇలా అనేక అంశాల్లో మనకూ ఓ ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు, అద్భుత కట్టడాలు, ప్రాంతాలు గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి.ఒకటా, రెండా నగరం నడిబొడ్డున చార్మినార్, హుస్సేన్సాగర్, హైకోర్టు, సిటీ కాలేజీ, సాలార్జంగ్ మ్యూ జియం, గోల్కొండ, మక్కా మసీదు, పలు గడియారపు స్తంభాలు,
దిగుడుబావులు, కోనేరులు, చెరువులు, ప్రార్థనా మందిరాలు, సమాధులు, హదియా వృక్షం (ఏనుగు చెట్టు), సికింద్రాబాద్లోని సెల్యులార్ జైలు (1858), ఫైగా టూంబ్స్, పురానా హవేలీలోని వసంత మహల్, నిజాం మ్యూజియం, కుతుబ్షాహీ సమాధులు, ఉర్దూ ప్యాలెస్ (1931), గన్ ఫౌండ్రీ (1786), మహబూబియా కళాశాల, షాహీ ఖజానా, అగ్ని దేవాలయం, దారుషిఫా (1595), చర్చిల్ బంగ్లా (1875), చార్కమాన్, నిజాం కాలేజీ, జూబ్లీహాల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా యూనివర్సిటీ, ఆరట్స్ కాలేజ్, అసెంబ్లీ, విక్టోరియా మెమోరియల్ (1890), బ్రిటిష్ రెసిడెన్సీ (1803), మక్కా మసీదు, మొజంజాహి మార్కెట్, ముర్గి చౌక్, మీర్ ఆలం మండి, బన్సీలాల్ పేట్ మెట్లబావి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్పేట్ సరాయి, సికింద్రాబాద్ క్లబ్ ఇలా నగరంలో ప్రతీదీ చరిత్రే ..ఎన్నో అద్భుత నిర్మాణాలు వారసత్వ కట్టడాలుగా ఖ్యాతి పొందాయి.
వందల ఏండ్ల చరిత్ర ఉన్న తెలంగాణలో అనేకం ఉన్నాయి. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిలో కొన్నింటిని జీహెచ్ఎంసీ పునరుద్ధరించే పనులను చేపట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న దిగుడుబావులు, ఇతర నిర్మాణాల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ గోల్కొండలోని కుతుబ్షాహీ సమాధుల వద్ద పునరుద్ధరించిన మెట్లబావికి యునెస్కో అవార్డు దక్కింది.
నగరంలోని చారిత్రక కట్టడాల పునరుద్దరణ ద్వారా విదేశీ పర్యాటకులనే కాకుండా నగరవాసులను సైతం ఆకట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ సూచనలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కుడాలతో పాటు ఆగాఖాన్ ట్రస్టులతో కలిసి నగరంలో ఉన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చి న బన్సీలాల్పేట మెట్లబావి నగరంలో పర్యాటక మాడల్గా మారింది.
హైదరాబాద్ నగరానికి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. ఎంతో వారసత్వ సంపద తో పాటు భిన్న సంస్కృతులకు నెలవైన హైదరాబాద్కు యునెస్కో హెరిటెజ్ ట్యాగ్ రావాలని గతంలో ప్రయత్నాలు జరిగాయి. అహ్మదాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడంలో కీలకంగా వ్యవహరించిన వాసవాడ అనే వ్యక్తిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. యునెస్కో జాబితాలో హైదరాబాద్ చేరితే ప్రపంచంలో మెరుగైన నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది. నగరాన్ని విదేశీ పర్యాటకులు సందర్శించడానికి ఆసక్తి చూపుతారు. తెలంగాణతోపాటు యావత్ భారతదేశం ఆర్థికంగా లాభపడతాయి. ప్రపంచ నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ యునెస్కో గుర్తింపుతో విశ్వ నగరంగా ప్రత్యేకతను చాటుకునే అవకాశం ఉన్నది.
( వ్యాసకర్త : జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్)
డాక్టర్ యాదగిరిరావు
నల్లగుంట్ల