దేశవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్జామ్, పెట్రోల్ బంకుల్లో పెద్దపెద్ద లైన్ల మధ్య కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఈ పరిస్థితే కనిపించింది. ట్రాఫిక్జామ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్లు నడిరోడ్డుపై నిలిచిపోయాయి. సంబంధిత దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. లారీ, ట్రక్కులు, ప్రైవేటు బస్సుల డ్రైవర్లు చేస్తున్న నిరసనే దీనికి ప్రధాన కారణం.
దేశవ్యాప్తంగా రవాణా రంగం స్తంభించిపోయింది. సరుకు రవాణా చేసే లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా నిరసన బాట పట్టడంతో ఇంధన కొరత తలెత్తుతుందనే భయంతో ప్రజలు బంకుల వద్ద బారులుతీరారు. ఒక్కసారిగా వందల మంది పోటెత్తడంతో అనేకచోట్ల నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. అయితే పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు చివరకు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించడంతో కొంత ఊరట లభించింది. కానీ, రవాణా వాహనాల డ్రైవర్ల నిరసనలు కొనసాగుతుండటం గమనార్హం. వారి నిరసనలు ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు కొండెక్కే ప్రమాదం ఉన్నది.
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహితను ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన విషయం విదితమే. ఇక్కడే ప్రస్తుత సమస్యకు బీజం పడింది. భారతీయ న్యాయ సంహితలోని హిట్ అండ్ రన్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని మార్పుచేర్పులు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్లో సమూల మార్పులు చేయాలని భావించిన మోదీ సర్కార్.. హిట్ అండ్ రన్ చట్టాన్ని సైతం మార్చింది. అనుకోని పరిస్థితుల్లో జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా ఎవరైనా మరణిస్తే వాహనచోదకుడికి పదేండ్ల వరకు కారాగార శిక్ష విధించాలని ఆ చట్టాన్ని సవరించింది. దీంతో పాటు పరిస్థితులను బట్టి జరిమానా కూడా విధించాలనే నిబంధన పెట్టింది. గతంలో ఈ శిక్షా కాలం రెండేండ్లు మాత్రమే.
హిట్ అండ్ రన్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని భావిస్తున్న ట్రక్ డ్రైవర్లు నిరసనకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31న పశ్చిమబెంగాల్లో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. సుమారు రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై టైర్లను కాల్చి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. రెండో రోజైన సోమవారం నిరసనలు దేశమంతా వ్యాపించాయి. లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సుల డ్రైవర్లు తమ వాహనాలను రోడ్లపై అడ్డంగా నిలిపేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు కూడా మొదట ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ దొరకదనే ప్రచారం నేపథ్యంలో బంకులకు జనాలు పోటెత్తారు.
ఈ విషయంలో పునరాలోచించాలని ట్రక్ డ్రైవర్లు కేంద్రాన్ని మొదట అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో డ్రైవర్లు అకస్మాత్తుగా రోడ్లెక్కారు. కొన్నిచోట్ల ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, క్యాబ్ తదితర వాహనాల డ్రైవర్లు కూడా నిరసనల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ర్టాల్లో నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దక్షిణాదిలో డ్రైవర్లు నిరసనల్లో పాల్గొంటున్నప్పటికీ ఉత్తరాదితో పోలిస్తే తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నది.
దేశంలో అతిపెద్దదైన ట్రక్కర్ల సంస్థ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) సంయమనంతో ఉండాలని డ్రైవర్లను కోరినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. డ్రైవర్లు లేవనెత్తిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ బాల్ మల్కిత్సింగ్ విన్నవించారు. అయినప్పటికీ డ్రైవర్లు నిరసనకే మొగ్గుచూపడంతో రవాణా రంగం స్తంభించిపోయింది.
ఇప్పటికే దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. తాజాగా ట్రక్ డ్రైవర్ల మెరుపు నిరసనలతో రవాణా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీని ప్రభావం ఇప్పటికే ఇంధన లభ్యతపై పడింది. లారీలు, ట్రక్కులు అందుబాటులో లేకపోవడంతో సరుకుల రవాణా నిలిచిపోయింది. పెరిగిన ధరల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలపై తాజా పరిస్థితులు మరింతగా భారాన్ని మోపే అవకాశం లేకపోలేదు. ఇదే అదనుగా, దళారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే పన్నాగాలకు తెరలేపవచ్చు. అటువంటి పరిస్థితులు తలెత్తకముందే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యనుపరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.
ఎడిటోరియల్ డెస్క్