వేధింపులనేవి సర్వ సాధారణంగా మారిపోయాయా? జీవితంలో కొన్ని సమస్యలకు చావే పరిష్కారమా? ఇటీవల దిన పత్రికల్లో ప్రచురితమైన వార్తలను చూస్తే ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. చిన్న అవమానాలకు, కష్టాలకే ఆత్మహత్య చేసుకొనేంత సున్నిత మనస్కులున్నారా అనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. సమస్యలకు పరిష్కారం చావు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది.
గతంతో పోల్చితే ఆత్మహత్మలకు పాల్పడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, మానవ సంబంధాలు తగ్గడం, వ్యక్తుల్లో జీవన నైపుణ్యాలు కొరవడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఆధునిక జీవన విధానంలో కొందరు చిన్న సమస్యను పరిష్కరించకోలేక చావే పరిష్కారమని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. నల్లగొండలో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు వాట్సాప్లో డిస్ప్లే పిక్చర్(డీపీ)గా పెట్టుకున్న ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతులిద్దరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ బాత్రూమ్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, ఆత్మహత్యలకు పురిగొల్పుతాయని అర్థమవుతుంది. జీవితంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు తమ సమస్యలకు పరిష్కారం ఉండదని భావిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలు వారి మదిని తొలిచేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్ల ముందు కనిపిస్తుంది.
కాలానుగుణంగా మారలేకపోవడం, తమపై తమకు నమ్మకం సన్నగిల్లడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ఎదుర్కోవాలనే ఆలోచనలు తక్కువ కావడం, ఇతరులతో పోల్చుకొని బాధ పడటం, గతం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడడం, ఏవేవో సంఘటనలు జరుగుతాయని ఊహించుకుని భయపడటం, సామాజిక అంశాలు ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటాయి. ఆర్థిక నష్టాలు, ఉద్యోగం సాధించటంలో వైఫల్యం, భౌతిక, లైంగిక వేధింపులకు గురి కావడం, కుటుంబ, సామాజిక సంబంధాల లోపం, సమాజంలో స్థాయి కోసం శక్తికి మించి పనులు చేయడం, వృద్ధాప్యంలో నిరాదరణకు గురి కావడం, ప్రేమలో వైఫల్యం, దీర్ఘకాలిక రోగాలు, మానసిక వేదన, పరువు పోతుందనే భయం, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేకపోతున్నామనే బాధ, మత్తు మందుల అలవాటు, వివాహేతర సంబంధాలు, చదువులో వెనుకబాటు.. ఇలా పలు కారణాల వల్ల కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఆత్మహత్యకు పాల్పడేవారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అతిగా మద్యం తాగడం, ప్రతీకారం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శించడం, అతిగా నిద్రపోవడం, రాత్రి వేళల్లో నిద్ర పోకుండా అతిగా ఆలోచించడం, అనవసర (ప్రాధాన్యత లేని) విషయాల పట్ల అతిగా స్పందించటం, అస లు స్పందించక పోవటం, చనిపోతున్నామని ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారు గమనిస్తే వెంటనే వారికి కాస్త ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ ఇప్పించాలి.
ఆత్మహత్యలను అడ్డుకోవడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలి. విద్యావేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, వైద్య నిపుణులు, కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా కృషి చేయాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకొనేవారిలో కొందరు స్వయంగా సహాయం కోరరు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, సహోద్యోగులు వంటివారు తమకు తెలిసినవారిలో ఎవరైనా ముభావంగా ఉన్నా, ఆత్మహత్య చేసుకొనే లక్షణాలు కలిగి ఉన్నా వెంటనే గ్రహించి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జీవితం విలువను గుర్తించేలా వారిలో ప్రేరణ కలిగించాలి. వారి కావాల్సిన ధైర్యాన్ని, ఓదార్పును అందించాలి. మనం సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో తెలియని వ్యక్తులను కూడా సహాయం అడుగుతాం. అలాంటిది జీవితంలోని కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇతరుల సహాయం అడగడంలో ఇబ్బందేముంది? ఎవరూ జీవితంలో అన్ని బాధ్యతలనూ ఒంటరిగా తలకెత్తుకోలేరు. అందువల్ల జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగుల నుంచి మనకు అవసరమైన సహాయం తీసుకోవడం తప్పు కాదు. చావు ద్వారానే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అనుకోవడం పొరపాటు.
(వ్యాసకర్త: రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్)
(నేడు ప్రపంచ ఆత్మహత్యా నిరోధక దినం)
డాక్టర్ అట్ల శ్రీనివాస్రెడ్డి
97039 35321