CM Breakfast | నేటి బాలలే రేపటి పౌరులు అని తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వాలు బాల్యదశకు పెద్దగా చేసిందేమి లేదు. గత ప్రభుత్వాలు బాలల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు చేపట్టింది లేదు. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు చెప్పాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రెండు మాటలను ఆచరణలో చేసి చూపిస్తున్నారు పిల్లల సంరక్షణ తెలిసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
కడుపు ఖాళీగా ఉంటే చదువు ఒంటబట్టదంటారు. మని షి ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా, మానసికంగా చురుకుగా పనిచేస్తారు. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నాణ్యమైన విద్య అందించడ మే కాదు ఆరోగ్యాన్ని బాల్య దశ నుంచే సంరక్షించాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం. తల్లి గర్భం నుంచే పౌష్టికాహారం అందించాలని గర్భిణీలకు నెలవారి చెకప్తో పాటు పౌష్టికాహారం అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటివెన్నో అందిస్తున్నా రు. ఇప్పటికే మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం నేడు మరో అడుగు ముందుకేసి బడికి వచ్చే ముందు ఏం తినకుండా వస్తున్న పిల్లలకోసం ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకా’నికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రజలకు మంచి జరుగుతుందంటే అది ఎక్కడి నుంచయినా తీసుకోవచ్చని నమ్మిన వ్యక్తి కేసీఆర్. అందుకే తమిళనాడులో అమలు చేస్తున్న ఈ పథకం పని తీరును పరిశీలించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందాన్ని ఆ రాష్ర్టానికి పంపించారు. అక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, రాష్ట్రంలో 10వ తరగతి వరకు అమలుచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు సెప్టెంబర్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా అక్టోబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.
పేద కుటుంబాల్లోని పిల్లలు పాఠశాలకు వెళ్లే ముందు ఇంట్లో అల్పాహారం తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. సరైన అల్పాహారం చేయకుండానే పిల్లలు పాఠశాలకు వెళ్తుంటారు. ఫలితంగా ఆ ప్రభావం విద్యపై పడుతుంది. పోషకాహార లో పం నుంచి పిల్లలను రక్షించడానికి ముఖ్యమంత్రి చేపట్టిన అల్పాహారం పథకం ప్రశంసనీయమైన చర్య అని చెప్పవచ్చు. ప్రభుత్వం బాధ్యత వహి ంచి పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంతో పాటు అల్పాహారం కూడా అం దించడం పట్ల తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కన్నది తామయినా ప్రభుత్వం తమ స్వంత పిల్లల్లా సంరక్షిస్తున్న తీరుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్నారు. నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకు ప్రభుత్వం దాదాపు రూ.500 కోట్లు వెచ్చించనున్నది. తమిళనాడు తర్వా త దేశంలోనే పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న రెండవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుంది.
విద్యార్థులకు వారంలో ఆరురోజులు వేర్వేరు అల్పాహారం అందించనున్నారు. అందులో ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ(సోమవారం), పూరి, ఆలు కుర్మా లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ(మంగళవారం),ఉప్మా, సాంబార్ లేదా గోధుమ రవ్వ కిచిడి, చట్నీ(బుధవారం),చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్(గురువారం), ఉగ్గాని/ పోహా/చిరుధాన్యాలతో ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ(శుక్రవారం) పొంగల్/సాంబార్ లేదా కూరగాయలతో చేసిన పొలావ్, రైతా/ఆలు కుర్మా (శనివారం) ఉన్నాయి.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకొంటుందని నమ్మే మన సీఎం కేసీఆర్ ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. దానికోసం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో మూడేండ్లలో 3 దశల్లో రూ.7,289 కోట్లతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 9,123 పాఠశాలలను రూ.3497 కోట్లతో 12 అంశాలతో చేసిన అభివృద్ధి ద్వారా 14,71,684 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. విద్యారంగంపై 2014 -15 ఆర్థ్ధిక సంవత్సరంలో రూ.9,518 కోట్లు ఖర్చు చేయగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.29,611 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.672 కోట్లు ఖర్చు చేస్తున్నది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో భోజనం, వారానికి మూడు గుడ్లను అందజేస్తున్నది. విద్యార్థులకు ఐరన్ , సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడంలో భాగం గా రూ.32 కోట్లు వెచ్చించి రాగి జావను అందజేస్తున్నారు. తద్వారా ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత స్పష్టమవుతున్నది. తరగతి గదుల్లో విద్యతో పాటు ఆరోగ్యానికి బాటలు వేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఎం. కిరణ్మయి
(వ్యాసకర్త : పౌరసంబంధాల అధికారి, సమాచార పౌరసంబంధాలశాఖ)