ప్రపంచాన్ని జయించాలంటే ముందుగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగే తాత్విక భావనను ఇచ్చేది విద్య మాత్రమే అనే విధంగా తెలంగాణ విద్యా విధానం భాసిల్లుతున్నది. విద్య అంటే ఒక చైతన్యం, ఒక మార్పు. విద్య నైపుణ్యాన్ని, మానసిక, శారీరక సామర్థ్యాన్ని పెంచే సాధనం. విద్య స్త్రీ, పురుషుల మధ్య అంతరాలను దూరం చేస్తుంది. ఆ ప్రయత్నం నేడు రాష్ట్రంలో జరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం.
రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు విద్యను అందుబాటులోకి తేవడమే కాకుండా గురుకుల విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్యనందిస్తున్నది. ‘అమ్మాయిలకు చదువు ఎందుకు?’ అనే భావనలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్పు వచ్చింది. అమ్మాయిలు భారం కాదు సంపదగా భావించే రోజులు వచ్చాయి. ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వచ్చిన విద్యార్థులు అద్దెకు ఇళ్లు దొరకక అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. అలాంటి గడ్డు పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం 1,102 గురుకుల పాఠశాలలు, కళాశాలలను మంజూరు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 53 గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. అందులో 46 మహిళా డిగ్రీ కాలేజీలు ఉండటం గొప్ప విషయం. మహిళల కోసం రెండు న్యాయశాస్త్ర, ఏడు పీజీ గురుకుల కళాశాలలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రాష్ట్రంలో పీజీ కళాశాలల్లో అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల ద్వారా దాదాపు ఐదున్నర లక్షల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నది. దీంతో వారికి దేశ విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక వర్సిటీల్లో ప్రవేశం పొందడానికి కావాల్సిన నైపుణ్యాలు అబ్బుతున్నాయి.
గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు వైద్య విద్యలో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇస్తున్నది. మెడికల్ ఎంట్రెన్స్ కోసం శిక్షణ తీసుకున్న ఎంతోమంది విద్యార్థులు ఎంబీబీఎస్లో సీట్లు సాధించారు. అలాగే ఐఐటీ, ఐఐఎం, జాతీయ వర్సిటీల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. గురుకుల బాలికలు చదువుకోడానికి విదేశాలకు వెళ్తున్నారు. సైన్స్, సమాచార సాంకేతిక విద్యను అందుకున్న తెలంగాణ విద్యార్థినులు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలకు వెళ్లి మెరుగైన జీవనోపాధి పొందుతున్నారు. పలు రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గురుకులాల్లో చదువుకున్న అమ్మాయిలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు పోటీగా నిలుస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెమిస్టర్ సిస్టం, సీబీసీఎస్తో పాటు బకెట్ సిస్టంను ప్రవేశపెట్టడంతో విద్యార్థుల ఆసక్తి మేరకు, వారి ఉద్యోగ అవకాశాల ప్రకారం కోర్సును, సబ్జెక్టును ఎంచుకునే అవకాశం లభించింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) పద్ధతిలో అడ్మిషన్ ప్రక్రియ సాగుతున్నది. విద్యార్థులు రూ.200 చెల్లించి వారి మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకొని రాష్ట్రంలో ఎక్కడున్నా వారికి నచ్చిన కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చు. ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల బేగంపేట్ గాని, సిటీ కళాశాల గాని, యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ (కోఠి)లో కాని, నిజాం కాలేజీలో గాని తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించిన వారు అడ్మిషన్ పొందడం శుభ పరిణామం. తెలంగాణ విద్య విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.