కంపతారు సెట్లు కొట్టి అమ్ముకోని
కడుపు నింపుకునే ..కాలమొచ్చినాది.
సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బీడాయెరా !
ఆరు అరకలు గట్టె పెద్ద రైతులు గూడ
అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము
గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే
ఒక్కటన్నా మడి చిక్కగా తడవదు
ఎంత సక్కని దానివే కృష్ణమ్మా
ఎటు దిక్కు వోతున్నవే కృష్ణమ్మా
మునిగింది ఏ ఊరు
మురిసింది ఏ ఊరు
ఉత్తర, దక్షిణ జీవనదులుండగా
కుత్తుకెండి నేల కుంగిపోయినాది
పట్నాలు పరదేశమెళ్లి బతుకవోయి
ఇంట్ల దీపం పెట్టె కనతలిదండ్రికి
కంట్రోలు బియ్యమూ కర్సుకు పంపేరు
కంటె కాన్పు కొరకు
సస్తె బొంద కొరకు
వలసబోయిన జనం వచ్చిపోతుంటారు”
ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ఈ పాట రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ రైతాంగ దుస్థితికి, తెలంగాణ వ్యవసాయ దీనస్థితికి, తెలంగాణ ప్రజలు ఉపాధి కోసం వలసపోయిన అవస్థలకు అద్దం పడుతున్నది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం” అనేది అనాదిగా మన నానుడి. విశ్వాసం కూడా. అటువంటి అన్నాన్ని ముద్దగా మన నోటి వద్దకు తెచ్చేది మట్టిని పిసికి ఆరుగాలం తమ స్వేదాన్ని చిందించి వ్యవసాయం చేసే రైతన్నలు. అనాదిగా వ్యవసాయం వృత్తిగానే కాకుండా నాగరికతగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పటికీ ఈ దేశంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగం మీద ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో వ్యవసాయం కీలకరంగం. వ్యవసాయం విష్ణుకుండినుల కాలం నాలుగవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం నాటికే కొత్తపుంతలు తొక్కింది. ఇక్కడుండే సమశీతోష్ణ మండల వాతావరణం. ఎత్తుపల్లాలతో కూడిన భూములు. వాగులు, వంకలు, నదీనదాలు ఉండేటువంటి పారువాటు ఈ ప్రాంతం ప్రత్యేకతలు. ఈ వనరులు పాలకులకు కొత్త ఆలోచనలను కలిగించాయి. అవే నీళ్లను ఒడిసిపట్టి వర్షాధారమే కాకుండా వర్షం లేనప్పుడు కూడా పంటలకు నీళ్లను ఇచ్చే విధానాన్ని కనుక్కున్న తొలి ప్రాంతం. అక్కడి నుండి మొదలై శాతవాహనులు, కాకతీయ రెడ్డిరాజుల కాలం వచ్చే నాటికి వ్యవసాయం విస్తరించి, నిలకడ సాధించింది. ఎక్కడో ఉన్న నీటి వనరుల నుండి ఊరికి నీటిని మళ్లించారు. ఊరికి ఒకటి నుండి పదుల సంఖ్యలో చెరువులు, కుంటలను నిర్మాణం చేసిన అపురూపమైన ఘనచరిత్ర కాకతీయ, రెడ్డిరాజులది. మానవాళికి ఉపయోగపడే ఒక గొప్ప కార్యం. దానిని విజయవంతంగా కొనసాగించిన ఆధునిక రాజులు కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు (నిజాం రాజులు). దానిని అంతే విజయవంతంగా విధ్వంసం చేసినవాళ్లు సమైక్యవాద పాలకులు.
ఆ విధంగా ప్రపంచానికి వాటర్షెడ్ పరిజ్ఞానం అందించిన ఈ బంగారు నేలను విస్మరించి, విధ్వంసం చేసి చెరువులు, కుంటల వ్యవస్థను దారుణంగా నిర్లక్ష్యం చేసి చివరకు మనుషులకు, జీవజాతికి మంచినీళ్లులేని దుర్గతిని కలిగించారు. దాని పర్యవసానమే తెలంగాణలో అనేక ఉద్యమాలు, పోరాటాలు. ఇతర సాంఘిక అసమానతలకు తోడుగా ప్రకృతిపరమైన వనరుల సమతుల్యం లోపించి పాలకుల దూరదృష్టిలేమి కారణంగా, సంకుచితబుద్ధి కారణంగా మంచినీళ్లు, సాగునీళ్లు లేకుండా పోయి సమైక్య పాలనలో మనుషులు, జీవాలు వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. తాగునీటి, సాగునీటి ఆర్తి నుంచి, రైతుల, అన్నార్తుల హాహాకారాల నుంచి కేసీఆర్ రూపంలో పుట్టుకువచ్చిందే తెలంగాణ మలిదశ ఉద్యమం. ఈ ఉద్యమానికి ఇరుసులాంటిది తెలంగాణ రైతాంగ అంశాలు, అవస్థలు. అందుకే మలిదశ ఉద్యమంలో స్థిరంగా, నిలకడగా ప్రజాచైతన్యం వెల్లివిరిసింది. అన్ని వర్గాలను కదిలించింది. ఎందుకంటే రైతుకు, రైతుకూలీలకు కులం లేదు. మతం లేదు. రైతులోకం కదిలితే ఈ సమాజం కదిలినట్టే. మిగతా వర్గాలన్నీ రైతు మీద ఆధారపడి బతికేవర్గాలే. వ్యవసాయంతో సంబంధం ఉన్న వర్గాలే. ఉద్యమంలో సకలజనుల కదలికకు మూలం రైతాంగ కదలిక. మలిదశ ఉద్యమంతో విజయవంతంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. నూతన రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ. దీర్ఘకాలిక ప్రణాళిక.
రాష్ట్ర ప్రగతిలో వ్యవసాయరంగానిది కీలకపాత్ర. జీఎస్డీపీలో దీనివాటా 18 శాతం. వ్యవసాయరంగం బలపడితే దాని చుట్టూ అల్లుకున్న రంగాలన్నీ బలపడతాయని ప్రగాఢంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసి సాగునీళ్లను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్ అవసరాలు, ఆవశ్యకతలను గుర్తించి అసాధారణం అని సమైక్య పాలకులు మభ్యపెట్టి తొక్కిపట్టిన గోదావరి, కృష్ణానదుల మీద ఎత్తిపోతల పథకాలకు రీడిజైన్ చేసి కేవలం మూడేండ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. కృష్ణా నదిమీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తయి అందుబాటులోకి రానున్నది. తెలంగాణ వచ్చిన వెంటనే సాగునీటి శిస్తును ఎత్తివేసి అప్పటివరకు ఉన్న బకాయిలను రద్దుచేయడం జరిగింది. సాగునీళ్లతో పాటు వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకం, రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఏడాదికి ఎకరాకు రూ.10 వేల రైతుబంధు, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతు కుటుంబాలలో భరోసా నింపేందుకు రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు అందించే రైతుభీమా పథకాన్ని ప్రారంభించారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల పంటలను వందశాతం మద్దతుధరకు కొనుగోలు చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఇప్పటివరకు 11 విడతలలో రైతుబంధు పథకం కింద రూ.72,815.09 కోట్లు రైతుల ఖాతాలలో నేరుగా జమచేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. రైతుబీమా పథకం కింద ఇప్పటివరకు 1,08,685 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం కింద రూ.5,434.25 కోట్లు అందించడం జరిగింది.
తెలంగాణ ఏర్పడే నాటికి వ్యవసాయ సంక్షోభం మూలంగా ఏ రైతుదీ రుణాలు కట్టలేని పరిస్థితి. రైతులు రుణాలు ఆశించినా బ్యాంకులది ఇవ్వలేని పరిస్థితి. సమాజంలో అత్యంత ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి రైతు. తనకు ఇవ్వడమే తప్ప చేయిచాచే పరిస్థితి ఉండదు. ఆ స్థితి నుండి రైతులను బయటపడేయాలన్న తాపత్రయం రాష్ట్ర ప్రభుత్వానిది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్ష రుణమాఫీ చేస్తాం అని ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలో 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మరొక్కసారి రుణమాఫీ జరిగితే భవిష్యత్తులో దాని కోసం ఎదురుచూసే రైతులు ఉండరని భావించి 2018 ఎన్నికలలో మరో లక్ష రుణమాఫీకి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినమాట ప్రకారం 36 వేల వరకు రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఆ వెంటనే ప్రపంచాన్ని వణికించిన కరోనా విపత్తు మూలంగా రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోయింది.
ఇదే కరోనా సంక్షోభంలో రైతాంగం తాము పండించిన పంటలు అమ్ముకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామగ్రామాన ఏడు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుబంధు, రైతుబీమా పథకాలను కొనసాగిస్తూ వస్తున్నది. కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రభుత్వం మిగిలిన రుణమాఫీ హామీని అమలుచేస్తున్నది. రెండో విడతలో 30.33 లక్షల మంది రైతులకు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.20,144 కోట్లకు గాను రూ.8089.74 కోట్లను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం రూ.99,999 వరకు ఉన్న రుణాలన్నీ పూర్తిగా మాఫీ అయ్యాయి. రూ.లక్ష, ఆ పైన ఉన్న రుణాల్లో రూ.లక్ష వరకు మరికొద్దిరోజుల్లో మాఫీ కానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా 2014 నాటికి కోటి 31 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2022-23 నాటికి 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-15 నాటికి 68 లక్షల టన్నులు మాత్రమే ఉన్న ధాన్యం ఉత్పత్తి 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 3.00 కోట్ల టన్నులకు చేరుకున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రూ.లక్షా 33 వేల కోట్లతో 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ధాన్యం కాకుండా రూ.11,443.04 కోట్లతో ఇతర పంటలు కొనుగోలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు సుమారు రూ.1.59 లక్షల కోట్లు, విద్యుత్తు మౌలిక సదుపాయాల కల్పన కోసం సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ రాష్ట్రంలోని రైతులందరికి ఉచిత కరెంటు అందించడం జరుగుతున్నది. 2014-15 నాటికి రూ.1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 రూ.3,17,115 కు చేరుకున్నది. రూ. 5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పునరుద్ధరించి, 8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటుచేసి, ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించడం, రూ.572 కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందున్న రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు చేయడం జరిగింది. తెలంగాణ వచ్చేనాటికి 39.01 లక్షల మెట్రిక్ టన్నులున్న గోడౌన్ల సామర్థ్యం ప్రస్తుతం73.82 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల నూతన గోదాములు నిర్మించడం గమనార్హం.
రైతాంగ శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఆర్థికభారాన్ని మోస్తున్నది. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు ఫలితంగా తెలంగాణలోని కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. నికర ఆదాయం, నెలవారీ ఆదాయం లేని కుటుంబాల్లో కూడా ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బు మారకం జరుగుతున్నది. సగటున పౌరుల చేతుల నుండి జరుగుతున్న రూపాయి మారకం విషయంలో దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువగా ఉన్నది. ఈ ఆర్థికచక్రం ముందుకు నడిపించడం మూలంగా అందరి చేతులకు పని లభిస్తున్నది. వ్యవసాయ రంగం బలోపేతం మూలంగా ఇది సాధ్యం కాదు అన్న పిడివాదానికి సమాధానంగా తెలంగాణ పాలన, కేసీఆర్ ఆలోచనలు నిలిచాయి. ఆ దృక్కోణంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దీని మూలంగానే వ్యవసాయరంగం, తద్వారా రాష్ట్రం బలోపేతమవుతున్నది. ప్రజలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయిలో ఉండాలని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం నిలదొక్కుకునే వరకు చేయూతనందిస్తే అంతకుమించి వ్యవసాయదారులకు చేయాల్సింది ఏమీలేదన్నది కేసీఆర్ గారి ఆలోచన. అభిలాష.
తెలంగాణ భవిష్యత్తు చాలా ప్రణాళికాబద్ధంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వ చర్యల మూలంగా వ్యవసాయరంగంలో సాగు మరియు పంటల ఉత్పత్తి పెద్దఎత్తున పెరిగింది. రైతు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు కేవలం మద్దతుధర కోసం ప్రభుత్వం మీద ఆధారపడకుండా రైతు తన పంటకు తానే గిట్టుబాటుధర నిర్ణయించుకునే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నది. ఆ దిశగా ఇదివరకే చర్యలు చేపట్టింది. రాబోయేకాలంలో ఆహారశుద్ధి మండళ్ల ఏర్పాటుకోసం సుమారు 10 వేల ఎకరాలను ఆయా జిల్లాలలో ఆర్థికమండళ్లకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పండ్లు, కూరగాయలు, పసుపు, మిరప పంటల అంతర్జాతీయ ఎగుమతుల కోసం కోహెడలో రూ.350 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే నూతన మార్కెట్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. వరి ధాన్యానికి మంచి ధర తీసుకువచ్చేందుకు పౌరసరఫరాల సంస్థ ద్వారా అధునాతన మిల్లింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. మరోవైపు పంటల వైవిధ్యీకరణలో భాగంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. ఆయిల్పామ్ సాగులో మరో ఏడాదిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవనున్నాం. దీంతోపాటు సహకార పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. వ్యవసాయ యాంత్రీకరణను మరింత ముందుకు తీసుకుపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే దృష్టిపెట్టారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా భావించి భవిష్యత్తు తరాలు దానిని వృత్తిలా ఎంచుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకనాటికి తెలంగాణ రైతాంగం రుణగ్రస్థులుగా రుణమాఫీల కోసం ఎదురుచూసే రైతులుగా కాకుండా రుణాలు ఇచ్చే రైతులుగా నిలబడాలన్నది కేసీఆర్ కల. ఆకాంక్ష.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు)
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి