Online Games | ఇంట్లో పిల్లలు స్మార్ట్ఫోన్ను ఆపరేట్ చేయగానే.. అరే! మావోడు భలే టాలెంటెడ్ ఉన్నాడే అని సంబురపడుతాం. ఇంత చిన్న వయసులోనే ఫోన్ ఆపరేటింగ్ అంటే గ్రేట్ కదా! అని గొప్పలకు పోతాం. కానీ, ఆ గొప్పలు మనల్ని ఎంత తిప్పలు పెడుతున్నాయంటే.. ఫోన్ లేకపోతే అన్నం తినం, ఫోన్ కొనివ్వకపోతే స్కూల్కు పోం.. అనేంతగా. హద్దుదాటిన కొందరు ఫోన్ కోసం సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. మన చిన్నప్పుడు ఎయిటీస్, నైంటీస్ల్లో ఔట్డోర్ గేమ్స్ ఉండేవి. 2000ల్లో ఇండోర్ గేమ్స్కు అలవాటు పడ్డారు. ఇప్పుడు అంతా ఇంట్లో గేమ్స్ జమానా నడుస్తున్నది. అదేనండి.. ఆన్లైన్ గేమ్స్. ఫోన్ను కొవిడ్ మనకు మరో అవయవంగా మార్చేసింది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ జాఢ్యాన్ని మరింత పెంచేసింది.
పిల్లలు మన కండ్లముందే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవారా తిరుగుళ్లు అయితే లేవులే అనుకుంటున్నాం. ఫోన్ పట్టినా పోనీలే కాసేపే కాదా అని ఊరుకుంటున్నాం. కానీ, ఆ నిర్లక్ష్యమే జీవితాలను అంధకారం చేస్తుందని ఊహించలేకపోతున్నాం. అందుకు ఉదాహరణే ఇటీవలి సంఘటనలు. ఆన్లైన్ గేమ్స్ పిల్లలే ఆడుతున్నారని నింద వాళ్లపై నెట్టేస్తున్నాం. కానీ, ఆన్లైన్ గేమ్స్ భూతం అందరినీ ఆవహించింది. చిన్నా-పెద్ద, ఆడ-మగ, స్టూడెంట్-రైతు అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై ప్రతాపం చూపుతున్నది. వీడియో గేమ్స్ నిర్వాహకులు ఆటగాళ్లకు ముందు గెలుపు రుచి చూపుతున్నారు. కొంత మొత్తం రాగానే విజేతలు అమ్యారని సంబురపడేలా చేస్తారు. గేమ్స్కు బానిసలయ్యారు.. ఇక విడిచి ఉండలేరు అని తెలిశాక దోపిడీ మొదలుపెడతారు. అప్పటికే పీకలదాక గేమ్స్లో మునిగిన వ్యక్తులు బయటపడలేకపోతున్నారు. అప్పులు చేసి మరీ గేమ్స్ ఆడుతున్నారు. తొలుత స్నేహితుల వద్ద, తర్వాత ఇతరుల వద్ద చేయిచాస్తున్నారు. ఇంట్లో అమ్మనాన్న సంపాదించిన డబ్బులు గేమ్స్కు తగలేస్తున్నారు. డబ్బులు లేని సందర్భాల్లో దొంగతనాలకు కూడా తెగబడుతున్నారు.
కుటుంబం మొత్తం ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసి పండించిన వడ్లు అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఓ యువకుడు ఆన్లైన్ గేమ్స్కు తగలేశాడు. మనస్తాపంతో సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఆన్లైన్లో రమ్మీ ఆడి రూ.78 వేలు పోగొట్టుకొని ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఓ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. మామయ్య వైద్యం కోసం దుబాయ్ నుంచి అత్త పంపించిన సొమ్మును ఆటకు అర్పించాడు. వరంగల్ జిల్లాకు చెందిన ఐటీఐ విద్యార్థి కూడా ఇదే తరహాలో డబ్బులు పోగొట్టుకొని ఉరేసుకొన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఓ గృహిణి సైతం ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్కు బానిసైంది. పెద్ద మొత్తంలో అప్పులు చేసింది. అప్పులోళ్ల వేధింపులు పెరిగాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. చావే శరణ్యమనుకున్నది. బంగారంలాంటి ఇద్దరు కొడుకులతోసహా సంపులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆన్లైన్ ఆటకు కుటుంబం బలైంది. గుండెను పిండేసే ఈ ఘటనల్లో బాధితుల వయసు ముప్పై లోపే.
తీవ్ర నిర్ణయాలతో కొన్ని ఘటనలే వెలుగుచూస్తున్నాయి. కానీ, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ బారిన పడ్డ కుటుంబాలు అనేకం. చాలాచోట్ల ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ గ్యాంగ్లు ఉన్నాయి. రెగ్యులర్గా ఆన్లైన్ గేమ్స్.. సీజనల్గా ఐపీఎల్ వంటి బెట్టింగ్స్ వీరి వ్యాపకం. ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి. బెట్టింగ్ లావాదేవీలు అన్నీ ఆన్లైన్లోనే. బెట్టింగ్ ముఠాలకు అనుబంధంగా డబ్బులు వడ్డీకి ఇచ్చేందుకు ప్రత్యేకంగా కొందరు ఉంటారు. వీరు యువతకు బైకులు, గోల్డ్చైన్లు కుదవబెట్టుకొని డబ్బులు ఇస్తున్నారు. వడ్డీ కూడా చాలా ఎక్కువ. వ్యక్తుల ఖాన్దాన్ను బట్టి అప్పు పరిమితి పెరుగుతుంటది. ఆ ఊబి నుంచి కొందరు బయటపడుతుండగా, మరికొందరు మునిగిపోతున్నారు. నిండు జీవితాలను బలితీసుకుంటున్నారు. తొలుత టైమ్పాస్గా మొదలై.. ప్రాణాలు తీసే వరకు, తీసుకొనే వరకు ఇవి పురిగొల్పుతున్నాయి. ప్రధానంగా యువత ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్కు బెండ్ అవుతున్నది. సరదాగా మొదలయ్యే వ్యాపకం.. వ్యసనంగా మారి నిలువునా ముంచేస్తున్నది.
ప్రజల రక్షణ ప్రభుత్వాల బాధ్యత.
ప్రజలకు ఎవరి నుంచి, ఏ సంస్థల నుంచి, ఏవైనా మార్గాల నుంచి ముప్పు వాటిల్లకుండా రక్షణ కల్పించడం పాలకుల విధి. వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశంలో ఆన్లైన్ గేమింగ్ కోసం కేంద్రం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కొత్త చట్టం తెచ్చింది. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ ఉండొద్దని నిబంధన విధించింది. వీటి వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ (ఎస్ఆర్వో)ను కేంద్రం నియమించింది. వీటిలో వ్యాపార ప్రతినిధులు, విద్యావేత్తలు, సైకాలజీ నిపుణులు ఉంటారు. ఏ గేమ్ను అనుమతించాలనేది వీరు డిసైడ్ చేస్తారు. అయినా, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ నడుస్తున్నాయి.
ఓ అధ్యయనం ప్రకారం దేశంలో ఉద్యోగి నెల జీతం సగటు రూ.32,840. అంటే గంటకు రూ.171 సంపాదిస్తాడు. రోజుకు కనీసం ఒక గంట ఆన్లైన్ గేమ్ ఆడితే.. నెలకు రూ. 5,130ల ఉత్పత్తి తగ్గిపోతున్నట్టే లెక్క. 2022 లెక్కల ప్రకారం.. దేశంలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య సుమారు 42 కోట్లు. అంటే నెలకు రూ. 2 లక్షల కోట్ల ఉత్పత్తిని దేశం కోల్పోతున్నది. ఏటా రూ.24 లక్షల కోట్ల ఉత్పత్తి లాస్. ఇది దేశ బడ్జెట్లో సగం కంటే ఎక్కువ. దేశం ఆర్థికవ్యవస్థపై పెను ప్రభావం చూపుతున్న ఆన్లైన్ గేమ్స్.. మానసికంగానూ వేధిస్తున్నాయి. ఒత్తిడి, కుంగుబాటు, భయం, సామాజిక అభద్రత, ఒంటరితనం, ఆత్మనూన్యతాభావం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ రుగ్మతల నుంచి బయటపడేందుకు దవాఖానలకు అయ్యే ఖర్చు మరో లెక్క. దాన్నీ కలుపుకుంటే దేశ బడ్జెట్ను దాటిపోవడం ఖాయం. కేంద్రంలో ఉన్న పెద్దలకు ఈ లెక్క ఎందుకు అర్థం కాదు? ఆన్లైన్ గేమ్స్ నియంత్రించడం ఎందుకు చేతకావడం లేదు?
-లట్టుపల్లి విక్రమ్
97015 87979