ఒకపక్క అపార రాజకీయ అనుభవం. మరోపక్క ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన రికార్డు, పరిపాలనా అనుభవం ఉంది. మీకు ఎప్పుడు ఏ సూచన, సలహాలు కావాలన్నా అడగండి.. చెబుతా. ప్రభుత్వానికి నావంతుగా సహాయపడుతా.
‘ఒకపక్క అపార రాజకీయ అనుభవం. మరోపక్క ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన రికార్డు, పరిపాలనా అనుభవం ఉంది. మీకు ఎప్పుడు ఏ సూచన, సలహాలు కావాలన్నా అడగండి.. చెబుతా. ప్రభుత్వానికి నావంతుగా సహాయపడుతా. పైగా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా. గత ప్రభుత్వానికి కూడా ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో సలహాలు ఇచ్చిన. కావాలంటే తెలుసుకోవచ్చు. అసెంబ్లీ లైబ్రరీలో వెతికినా లభిస్తాయి. పరిశీలించుకోవచ్చు. మరి ఇంత టాలెంటున్న నన్ను వదిలేసి ఇతరులను సలహాదారులుగా పెట్టుకోవడమేంటి?’ అని జానారెడ్డి పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. నా టాలెంట్ వాడుకున్నోడికి వాడుకున్నంత అంటున్నారు పెద్దలు జానారెడ్డి. తమది కొత్త ప్రభుత్వం, కొత్త సంసారం అన్న బెంగ వద్దేవద్దు.. మై హూనా అంటున్నారాయన.
వదిలేయండి ప్లీజ్
ఒకప్పుడు పబ్లిసిటీ కోసం మీడియా వెనుకపడే రాజకీయ నాయకులు.. ఇప్పుడు ‘మమ్మల్ని వదిలేయండి ప్లీజ్’ అని దండం పెడుతున్నారంటే ఆశ్చర్యపడక తప్పదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలలో పేపర్ టైగర్లంతా ఓడిపోయారని పొలిటికల్ సర్కిల్లో విశ్లేషణ ఒకటి చక్కర్లు కొడుతున్నది. దీంతో మీడియాకు ఎంత దూరంగా ఉంటే.. అంత బెటర్ అన్న ఫీలింగ్తో వారంతా ఉన్నారు. మీ పార్టీ గురించి ఫలానా ఆయన అలా అన్నారు.. మీరేమంటారని మాజీ మంత్రి ఒకర్ని అడిగితే, ‘నో కామెంట్’ నన్ను వదిలేయండి ప్లీజ్ అని దండం పెట్టారు. అయినదానికి కానిదానికి ప్రతీదాంట్లో తగదునమ్మా అని దూరిపోయే మా జిల్లాకు చెందిన నాయకుడి పరిస్థితి ఏమైందో తెలుసుకదా అని సదరు నేత తప్పించుకున్నారు.
గెలిచింది మా వల్లే!
గాంధీభవన్లో ఏ కార్యక్రమం జరిగినా సోషల్ మీడియా పేరుతో వచ్చే వారిని తట్టుకోలేకపోతున్నామని మీడియా వ్యవహారాల ఇంచార్జి బేజార్ అవుతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఆ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. బీట్ రిపోర్టర్లు, కెమెరామెన్ల సంఖ్య మేరకే పాసులు ముద్రించారు. కానీ, సోషల్ మీడియా పేరుతో వచ్చిన వారు పాసుల కోసం ఎగబడ్డారు. కాస్తో, కూస్తో గుర్తింపు ఉన్న మీడియాకు అయితే పాసు ఇస్తాం కానీ, మీరంతా ఎవరని మీడియా ఇంచార్జి ప్రశ్నిస్తే, ‘ఏం సార్ అలా అంటారు. మా వల్లనే మీ పార్టీ గెలిచిందని అందరూ అంటుంటే.. మీరేమో ఇలా అంటున్నారు ఏంటి’ అని సదరు వ్యక్తి ప్రశ్నించే సరికి అక్కడున్న వారు ఉలిక్కిపడాల్సి వచ్చింది.
ముక్క ముందే చెప్పాలి
‘ఆ ముక్క ముందే చెప్పాలి’ ఇది ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాల్రావు చెప్పిన పాపులర్ డైలాగ్. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చెప్పిన కథ వింటే, ఈ డైలాగ్ గుర్తుకు రాకతప్పదు. ‘దవాఖానలో చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు పట్టించుకోనోడు.. చచ్చినంక వచ్చి డప్పులోళ్లకు పైసలు పంచిండంట ఎనకటికి ఒకడు’ నా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉందని జగ్గన్న వాపోయారు. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక్కడంటే ఒక్కడు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఓడిపోయినంక వచ్చి ‘అరే అన్నా, నాకు చెప్పొద్దా పైసలు పంపిస్తుంటి’ అని సింపతి చూపిస్తున్నారు అని వాపోయారట. నాపై అభిమానం ఉంటే ఓడిపోకముందు అనాలి ఆ మాట, ఇప్పుడు అంటే ఎట్టా? అని జగ్గన్న గుస్సా అయ్యారట.