ఊరికే రారు మహానుభావులు అంటారు. ఇక నుంచి ఊరికే మాట్లాడరు మహానుభావులు అని చెప్పుకోక తప్పదేమో. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తాండూర్లో జరిగిన సభలో ఎల్బీ స్టేడియంలో రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని అర్థం వచ్చేలా ప్రసంగించారు.
ఊరికే రారు మహానుభావులు అంటారు. ఇక నుంచి ఊరికే మాట్లాడరు మహానుభావులు అని చెప్పుకోక తప్పదేమో. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తాండూర్లో జరిగిన సభలో ఎల్బీ స్టేడియంలో రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని అర్థం వచ్చేలా ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలు సీఎం రేస్లో ఉన్న నాయకమ్మన్యులకు ఆగ్రహం తెప్పించాయి. మల్లికార్జున్ ఖర్గేనో, రాహుల్గాంధో, సోనియా గాంధో ఆ మాటన్నారంటే సీరియస్గా తీసుకోవచ్చు కానీ ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారు… పైగా ఆయన ఏ మూడ్లో ఉండి అలా మాట్లాడారేమో అంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలపై బాహాటంగానే స్పందించారు. సీఎం ఎవరన్నది గాయనకేం (డీకే) తెలుస్తుంది? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే డీకే అలా ఎందుకు మాట్లాడారనే చర్చ గాంధీభవన్లో కాస్త సీరియస్గానే జరిగింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షునిగా డీకే ఉన్నప్పటికీ సీఎం పోస్టు ఆయనకు దక్కలేదు. ఇక్కడ తెలంగాణలో పీసీసీ అధ్యక్షునికి సీఎం పోస్టు ఇవ్వాలని సూచించడం ద్వారా అక్కడ (కర్ణాటక) తనకు కూడా ఇవ్వాలని పరోక్షంగా డిమాండ్ చేయడమే అయి ఉంటుందని గాంధీభవన్ మేధావులు విశ్లేషిస్తున్నారు.
పొలిటికల్ డ్రాపౌట్ !
స్కూల్ డ్రాపౌట్ గురించి విన్నాం కానీ… పొలిటికల్ డ్రాపౌట్ గురించి వినడం మాత్రం బహుశా ఇదే కొత్త. గతంలో షర్మిల పార్టీలో పని చేసిన మాజీ నేత ఒకరు తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తూ పొలిటికల్ డ్రాపౌట్గా అభివర్ణించారు. ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఎన్నికల కమిషన్ గుర్తు కూడా కేటాయించాక బరిలో దిగకుండానే అస్త్ర సన్యాసం చేసిన షర్మిలను పొలిటికల్ డ్రాపౌట్గా పిలువవచ్చు అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే రాజన్న రాజ్యం పార్టీ బిచాణా ఎత్తివేయడం మాత్రం ‘సరైన సమయంలో సరైన నిర్ణయం’గా సదరు నేత అభివర్ణించారు. మరో మూడు, నాలుగు రోజుల్లో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా వైఎస్ఆర్టీపీ అధ్యాయం ముగుస్తుందన్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించడం ఒక్కటే ఆమె తెలివిగా తీసుకున్న నిర్ణయం అంటున్నారు. పార్టీ పోయినా… పరువు దక్కిందని ఆమెతో కలిసి ఇంతకాలం పాదాల మీద పాదయాత్ర చేసిన నాయకులు కూడా మెచ్చుకుంటున్నారు. లేకుంటే తండ్రి దివంగత వైఎస్ఆర్, అన్న జగన్, తల్లి విజయమ్మ, భర్త అనిల్కుమార్ అందరి పరువు గంగలో కలిసేదంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, అభ్యర్థులను ఎంపిక చేయడం, మ్యానిఫెస్టో ప్రకటించడం, ఎన్నికల ప్రచారం చేయడం, ఆ తర్వాత అందరి డిపాజిట్లు పోవడం వంటి ప్రమాదం నుంచి తమను తప్పించడం ద్వారా షర్మిల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్టేనని పొలిటికల్ డ్రాపౌట్ క్యాడర్ మెచ్చుకుంటున్నారు.
నిను వీడని నీడను నేను
టికెట్ కోసం ఏ పార్టీలోనైనా పోటీపడుతారు. అవసరమైతే అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతారు. కానీ విచిత్రంగా ‘టికెట్ వద్దు .. ఈ సారికి వదిలేయండి ప్లీజ్’ అని రాష్ట్ర బీజేపీ నాయకులు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. నిన్నగాక మొన్న బాబుమోహన్ ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు కూడా. కానీ, మూడవ జాబితాలో అందోల్ అభ్యర్థిగా బీజేపీ ఆయనను ప్రకటించింది. ‘టికెట్ వద్దన్నా.. ఇదేమి టార్చర్’ అని ఆయన మండిపడుతున్నారు. ‘టికెట్ ఇస్తే సరిపోదు.. పోటీ చేయడానికి ఎంత డబ్బు ఇస్తారో చెప్పండి.. దాన్ని బట్టి పోటీ చేయాలో? లేదో?’ అప్పుడు నిర్ణయం తీసుకుంటానని పార్టీ ముఖ్య నాయకుడికి బాబుమోహన్ ఫోన్ చేసినట్టు సమాచారం.