ఆర్టీసీ విలీనం మా విజయమే. రైతు రుణమాఫీ మా విజయమే. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో పెడుదామనుకున్నాం.
ఆర్టీసీ విలీనం మా విజయమే. రైతు రుణమాఫీ మా విజయమే. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో పెడుదామనుకున్నాం. రైతులకు లక్ష కాదు, అధికారంలోకి వస్తే 2 లక్షలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించాం. తామిచ్చిన హామీలనే ప్రభుత్వం ఆదరాబాదరాగా అమలుచేస్తున్నదని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి గెలిచాక కూడా అదికూడా తమ విజయమని అంటారేమో? తాము గెలుస్తామని ప్రకటించడం వల్లనే బీఆర్ఎస్ గెలిచి చూపింది. కాబట్టి అది కూడా మా విజయమేనని అంటారేమో చూడాలి.
సైలెంట్ మోడ్
రాష్ట్ర బీజేపీ పగ్గాలు కిషన్రెడ్డికి అప్పగించాక బండి సంజయ్ వర్గం సెలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. బండిని మార్చడానికి ముందు ఆయనకు మద్దతుగా పలువురు నాయకులు జితేందర్రెడ్డి ఫామ్హౌజ్లో సమావేశమై అట్లెట్ల మార్చుతారని పార్టీ అధిష్టానాన్నే నిలదీసినంత పనిచేశారు. అయితే ఇవ్వేం పట్టించుకోకుండా పార్టీ అధ్యక్షుడు నడ్డా వన్ ఫైన్ మార్నింగ్ బండిని ఢిల్లీకి పిలిచి మిమ్మల్ని పీకేసి మీ పోస్టు కిషన్రెడ్డికి ఇచ్చినట్టు చావుకబురు చల్లగా చెప్పారు. అంతకుముందు బండికి మద్దతుగా నిలిచిన నాయకులు ఈ పరిణామం తర్వాత ఎవరూ నోరు మెదపలేదు. బండిని మార్చితే ఏదో అయిపోతుందనుకున్నాం. కానీ అంతా సైలెంట్ అయిపోయారేంటీ? అని రాష్ట్ర ఇంచార్జీ తరుణ్చుగ్ ఇటీవల ఒక నాయకుడిని అడిగితే, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాదిరిగా వారంతా బాత్రూమ్కెళ్లి ఏడుస్తున్నట్టున్నారని చెప్పారట.
ఆ చాన్స్ కూడా ఇవ్వం
కాంగ్రెస్ నాయకులకు పార్టీ అంటే వల్లమాలిన ప్రేమ. పార్టీ కోసం ఏమైనా చేయడానికి కూడా వారు సిద్ధం. చివరికి సొంత పార్టీ అభ్యర్థిని ఓడించే చాన్స్ కూడా ప్రత్యర్థులకు ఇవ్వం గాక ఇవ్వమని ముందే చెప్తున్నారు. రాష్ట్ర ఇంచార్జిగా ఇటీవల నియమితులైన ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలకు హాజరయ్యారు. పార్టీలో మొదటినుంచి ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్ ఇస్తే సొంత పార్టీ అభ్యర్థి అని కూడా చూడకుండా ఓడించి తీరుతాం, ఇదే తమ శపథం అని కార్యకర్తలు తేల్చిచెప్పడంతో, అబ్బో పార్టీ అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ అని మన్సూర్ అలీఖాన్ ఆశ్చర్యపోయారట.
వాళ్లకు కూడా తెలిసిందా?
కర్ణాటక ఎన్నికల ముందు దాకా తెలంగాణలో తెగ హడావుడి చేసిన బీజేపీ, ఆ ఫలితాల తర్వాత దింపుడుకల్లం ఆశ కూడా పోయాక తెలంగాణలో తమది మూడో ప్లేసే అని డిసైడయిపోయింది. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ కూడా చెప్పారు. తాజాగా కాంగ్రెస్ కూడా వారిది థర్డ్ ప్లేస్ అయితే తమది రెండో ప్లేస్ అని డిసైడయినట్టున్నది. అందుకేనేమో, పార్టీలో చేరుతాం నాగర్కర్నూల్/ కొల్లాపూర్ ఎక్కడైనా సభ పెడుతాం రండి మహోప్రభో అని జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల రాజేశ్ ప్రాధేయపడి వేడుకున్నా ప్రియాంక గాంధీ రాలేదు. మల్లికార్జున్ ఖర్గే రాలేదు. కనీసం డీకే శివకుమార్ను అయినా పంపించినా అడ్జెస్టవుతామన్నా పట్టించుకోలేదు. ఇక చేసేది లేక వారే ఢిల్లీ వెళ్లి కండువా కప్పించుకొని హమ్మయ్యా ఒక పని అయిపోయిందని తిరిగి వచ్చేశారు. మాజీ మంత్రి జూపల్లి పరిస్థితి ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటీ? అని వైఎస్ షర్మిల కూడా ఢిల్లీ వెళ్లి తనకు కండువా ఎప్పుడు కప్పుతారని అడిగిందట. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనంటున్న కాంగ్రెస్ చేరికల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం చేస్తుందని ఆ పార్టీ నాయకుడు ఒకరిని ఆరా తీస్తే, ఏమో తమది రెండో ప్లేస్ అని వారికి కూడా తెలిసిపోయిందేమో? అన్నారు.