సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, లింగ ఆధారిత వివక్షల నుండి మహిళలకు విముక్తి కల్పించి వారికి పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించినప్పుడే మహిళల సాధికారత సాధ్యమవుతుంది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని నిజం చేసి చూపింది. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేసింది. మహిళల విద్యాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అతివల భద్రతకు భరోసా ఇచ్చి.. ఆరోగ్య సంరక్షణలో అండగా నిలుస్తున్నది.
పథకాల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో మహిళలను భాగస్వాములను చేసి గుణాత్మక మార్పును తీసుకొస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం, సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో 33 శాతం, ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు ఖాళీల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల మహిళలు, అన్ని వయసుల మహిళల కోసం ఆదర్శవంతమైన పథకాలను అమలు చేస్తున్నది. ఆడ పిల్లలకు జన్మనిచ్చిన మహిళలకు రూ.13 వేలను నగదు ప్రోత్సాహకంగా అందిస్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,90,639 మందికి లబ్ధి చేకూరింది. గర్భిణులు, బాలింతలు, ఆరేండ్ల లోపు చిన్నారుల ఆరోగ్యం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ‘కేసీఆర్ కిట్’ను అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్ధిదారులు పోషకాహార లోపాన్ని అధిగమించారు. మహిళల రక్షణ, సామాజిక భద్రత కోసం దేశంలోనే ప్రప్రథమంగా షీ టీమ్స్ పేరుతో ప్రత్యేకంగా 100 బృందాలతో పోలీస్ విభాగాన్ని తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసింది.
జీవితంపై భరోసా కోల్పోయి, సమస్యలతో సతమతమయ్యే మహిళలు, చిన్నారుల కోసం భరోసా, చేయూత కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పేద యువతుల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 లను ఆర్థిక సహాయంగా అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 13,03,818 మంది మహిళలు లబ్ధి పొంది సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా పేద కుటుంబాల మహిళలకు కేసీఆర్ సర్కార్ బతుకమ్మ చీరలను అందిస్తున్నది. ఇప్పటివరకు 5,75,43,664 చీరలు పంపిణీ చేసి పేదల ఇండ్లలో పండుగ వెలుగులు నింపింది. అంగన్వాడీ వర్కర్ల వేతనాలను రూ.4 వేల నుండి రూ.13,650కు పెంచింది. అంగన్వాడీ హెల్పర్ల వేతనాలను రూ.2,200 నుండి పెంచి రూ.7,800లకు, ఆశా వర్కర్ల వేతనాలను రూ.7,500 నుండి రూ.9,750లకు పెంచి వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నది.
ఒంటరి, వితంతు, వృద్ధ మహిళల జీవన అవసరాల కోసం ఆసరా పింఛను పథకాన్ని అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. 1,52,050 మంది ఒంటరి మహిళలకు, 15,74,905 మంది వితంతువులకు, 4,80,861 మంది బీడీ కార్మికులకూ పెన్షన్ అందించి ఆదుకొంటున్నది. వీ హబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మూలధన సహాయం, వ్యాపారాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతను అందిస్తున్నది. 1003 ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 3,03,820 మంది బాలికలు నాణ్యమైన విద్య అభ్యసిస్తున్నారు. ప్రతి విద్యార్థి కోసం ప్రభుత్వం ఏటా రూ.1,25,000 ఖర్చు చేస్తున్నది. మహిళా స్వయం శక్తి సహాయక సంఘాల సహాయకుల గౌరవ భృతిని రూ.8 వేలకు పెంచింది.
మహిళా సాధికారత కారణంగా ఈ తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి సూచీల్లో అగ్ర భాగాన నిలిచింది. ఇదే స్ఫూర్తితో తమ కోసం మరిన్ని పథకాలను అమలు చేయాలని మహిళలు కోరుకుంటున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను మిగతా రాష్ర్టాలు అమలు చేస్తే దేశమంతటా మహిళా సాధికారత సాధించే అవకాశం ఉంటుంది.
డాక్టర్ కందగట్ల శ్రవణ్కుమార్
86393 74879