డెభ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతంలో అన్ని రాష్ర్టాల ఎన్నికల చరిత్రలో ప్రతిసారి తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఎన్నికల ఎజెండాలుగా సాంప్రదాయంలా వస్తున్నాయి. ప్రస్తుత 5 రాష్ర్టాల ఎన్నికల్లోనూ తెలంగాణ మినహా అన్నిచోట్ల ఇవే ఎజెండాలో ఉన్నయి. కానీ దేశ చరిత్రలో మొదటిసారి తెలంగాణ ఎన్నికల్లో తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఎజెండాలుగా లేవు.
దశాబ్దకాలంగా రాష్ర్టాన్ని పాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తాగునీరు, విద్యుత్తు సమస్యలను రూపుమాపి దేశానికే తలమానికంగా నిలిచింది. ఈ రెండు ప్రజా జీవనానికి నిత్యావసరాలు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్నది. దీనికోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.44 వేలకోట్లు ఖర్చు పెట్టి, కృష్ణ గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చి రాష్ట్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా రూపుమాపింది.
తెలంగాణ రాకముందు ఊర్లల్లో నీళ్లులేని కారణంగా పిల్లనిస్తే బాయి ల దగ్గరనుంచి నీళ్లు మోపిస్తరనే కారణాలతో కొన్ని ప్రాంతాలకు ఆడపిల్లనియ్యని దుస్థితిని చూశాం, నులక మంచం కింద తాంబాలం పెట్టి మంచం పైన స్నానం చేసి తిరిగి ఆ నీటిని ఇతర అవసరాలకు వాడే దీనస్థితిని నారాయణ ఖేడ్ పరిసరాల్లో చూశాం. సరైన నీటి వసతి లేక వర్షాకాలంలో విషజ్వరాలుసోకిన అనారోగ్య పల్లెల్ని చూశాం. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల అవస్థలను చూశాం. వాటన్నింటికీ చెక్ పెట్టింది కేసీఆర్ మిషన్ భగీరథ.
ఇక విద్యుత్తు విషయానికొస్తే అన్ని వర్గాలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. ఈ ఆధునిక యుగంలో విద్యుత్తు ఒక మౌలిక వసతి, నిత్యావసరం. వ్యవసాయానికి ఉపాధికి, టూరిజానికి, ప్రొడక్టివిటీకి, ఐటీకి ఇలా అన్ని రంగాలకు ఇంధనం విద్యుత్తు.
అభివృద్ధి చోదక శక్తి విద్యుత్తు. అటువంటి విద్యుత్తు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలు దేశానికే ఆదర్శం. రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగంలో 1196 యూనిట్స్ నుంచి 2166 యూనిట్స్కు ఎగబాకింది. దేశానికి అవసరమైన డిమాండ్ను సైతం సప్లయి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. గత మార్చిలో విద్యుత్తు 15497 వేల మెగావాట్ల పీక్ డిమాండ్కు చేరుకున్నది. తెలంగాణకు ఇప్పుడు విద్యుత్తు సమస్యే కాదు. అలాగే ఎన్నికల ఎజెండాలో కూడా లేదు. కాంగ్రెస్ పాలన వస్తే మళ్లీ పాతరోజులు వస్తాయని భయపడడానికి వాటిని ఎన్నికల్లో ప్రస్తావించడానికి కారణం కాంగ్రెస్ నాయకుల మాటలే కానీ విద్యుత్ సమస్య కాదు.
ఆర్థిక బలంతో సంబంధం లేకుండా ప్రజలకు మేలు చేయాలన్న సం కల్పం, రైతులు, ప్రజలపైన ప్రేమ ఉంటేనే ఇది సాధ్యమౌతుంది. ఆర్థికంగా బాగానే ఉన్నా కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలు కూడా అన్నివర్గాలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వలేకపోతున్నా యి. కారణం అక్కడి పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ధే.
ఈ ఎన్నికలు చారిత్రాత్మకం. దశాబ్దాలుగా ఎన్నికల ఎజెండా గా ఉన్న సమస్యలు కనుమరుగవడం ఎలా సాధ్యపడిందని దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది.
పాశం రఘునందన్ రెడ్డి
72077 70469