తెలంగాణలో కాకతీయుల చరిత్రను చెరువులు చెబుతాయి. చెరువు కట్టలపై ఉన్న శాసనాలు ఊళ్ల పేర్లకు, మలి కాకతీయుల పేర్లకు ఉన్న సంబంధాన్ని వివరిస్తాయి. ఆనాడు చెరువుల్ని తవ్వించిన ఫలితంగా ఊళ్లతో పాటు గుళ్ళూ, దేవుళ్ళూ వెలిశారు. ఈ చారిత్రక పరిణామాలు నాటి సామాజిక, ఆర్థిక ముఖ చిత్రాన్ని మన కళ్ల ముందుంచుతాయి.
క్రీ. శ.1000 ప్రాంతంలో కళ్యాణి చాళుక్య రాజ్యంలో అనుమకొండ ఒక ప్రముఖ ప్రాంతంగా, తొలి కాకతీయులు ముఖ్యమైన సామంతులుగా ఎదిగిన క్రమం రెండు వందల ఏళ్లు కొనసాగింది. ఈ క్రమంలో మొదటి బేతను అనుమకొండకు అధిపతిగా చేసి ఉత్తర తెలంగాణలో పెద్ద ప్రాంతాన్ని కళ్యాణి చాళుక్యులు రాజ్యమేలారు.
కేసముద్రం చెప్పే మొదటి ప్రోల కథ
వరంగల్ జిల్లా కేసముద్రం ఊరి పేరు కేసరి సముద్రం అనే పదానికి జరిగిన మార్పు. మొదటి ప్రోల తవ్వించిన కేసరి తటాకం, కేసరి సముద్రమై చివరకు కేసముద్రంగా మిగిలింది. తటాకం అంటే చెరువు అని అర్థం అవుతుంది కానీ కేసరి ఎందుకు వచ్చింది? మొదటి ప్రోల రాజు బిరుదు అరిగజ కేసరి. అంటే ఏనుగుల వంటి శత్రువులకు సింహం వంటి వాడని అర్థం. అందుకే ఆయన తవ్వించిన చెరువు కేసరి సముద్రం అయింది.
అన్నిటి కంటే ముఖ్యమైన సంగతి మొదటి ప్రోల కాలంలోనే కళ్యాణి చాళుక్యులు అనుమకొండ, చుట్టు పక్కల ప్రాంతాలకు శాశ్వత పాలకులుగా కాకతీయుల్ని నియమించడం. దీనికి కారణం కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్ల సోమేశ్వర కాలంలో యువరాజు విక్రమాదిత్యుడి నేతృత్వంలో చక్రకూట, కొంకణ ప్రాంతాలపై చేసిన యుద్ధంలో మొదటి ప్రోల సాధించిన విజయాలే కావచ్చు. అప్పటివరకు కాకతీయుల రాజ లాంఛనం గరుడ చిహ్నం. కానీ మొదటి ప్రోలరాజును కళ్యాణి చాళుక్యులు శాశ్వతంగా అనుమకొండ పాలకుడిగా నియమించినందుకు కృతజ్ఞతగా వారి చిహ్నమైన వరాహం అప్పటి నుండి కాకతీయుల చిహ్నంగా మారింది.
చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్రీయం, పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, కొలను గణపతి దేవుడి శివయోగ సారము వంటి రచనలు నాటి మత పరిస్థితుల్ని తెలుపుతాయి.
సాహిత్యంలో కాకతీయుల చరిత్ర
కాకతీయుల చరిత్రను రాసేందుకు శాసనాలు సాధికార ఆధారాలైనప్పటికీ, సాహిత్య ఆధారాలు కూడా ముఖ్యమైనవే. శాసనాల్ని, సాహిత్యాన్ని పోల్చి చూసుకొన్నప్పుడే చరిత్ర రచన పరిపుష్టం అవుతుంది.
కాకతీయుల పాలన ముగిసిన వందేళ్ల తర్వాత వచ్చిన సాహిత్యం కూడా కాకతీయ కాలం నాటి సమాజాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. క్రీ.శ.14-15 శతాబ్దాల్లో వచ్చిన వినుకొండ వల్లభరాయ రచన క్రీడాభిరామం ఓరుగల్లు నగరం, నాటి సమాజం గురించిన అంశాల్ని చెపుతుంది. కాకతీయ చరిత్ర రికార్డు చేసిన సాహిత్యంలో ముఖ్యమైనవి ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్రము, కాసె సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్రము. ప్రతాప రుద్రీయం తెలుగు లౌకిక సాహిత్యంలో తొలి వచన రచన కాగా, సిద్దేశ్వర చరిత్రము ద్విపద కావ్యం. వెలుగోటివారి వంశావళి, వెలుగోటివారి చరిత్ర కాకతీయ కాలం నుండి వెలమ నాయకుల చరిత్రను చెప్పే ముఖ్య ఆధారాలు.
డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000