నాడు తన విధ్వంస యుద్ధోన్మాదం ద్వారా, భిన్నధృవాల వంటి సామ్రాజ్యవాద బ్రిటన్! క్యాపిటలిస్టు అమెరికా! సోషలిస్ట్ రష్యాలు చేతులు కలిపి నడిచే విధంగా చేశాడు హిట్లర్! నేడు తన ప్రమాదకర పోకడల ద్వారా… పరస్పరం పొసగని, బీజేపీయేతర జాతీయ-ప్రాంతీయ-వామపక్ష పార్టీల మధ్య సమైక్యతను తీసుకువచ్చింది బీజేపీ! ఇది ఆయా పార్టీల మనుగడకే కాదు, బడా కార్పొరేట్ వ్యతిరేక ప్రజలందరికీ శుభసూచకమే! పెద్దలన్నట్లు ‘కీడులో మేలంటే’ ఇదేనేమో!
సిద్ధాంతాలు, విలువలు జానేదేవ్! ఏం చేసైనా సరే, కేంద్రంలోనే కాదు, రాష్ర్టాలన్నింటా విస్తరించాలి! దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రకృతి వనరులన్నింటినీ కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టాలి..! ఎనిమిదేండ్లుగా ఈ లక్ష్యంతోనే బుల్డోజర్లా దేశాన్ని ధ్వంసం స్తున్నది బీజేపీ!
బీజేపీయేతర రాష్ర్టాలపై దాడి: ఈడీ, ఐటీ, సీబీఐ, గవర్నర్ మొదలైన వ్యవస్థలన్నింటినీ బీజేపీయేతర రాష్ర్టాల మీదికి ఉసిగొల్పుతున్నది మోదీ ప్రభుత్వం. తద్వారా.. లొంగివచ్చిన వారికి కండువాకప్పి తమ బలగాన్ని పెంచు కుంటున్నది. లొంగనివారిని కేసులతో వేధిస్తూ వాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నది. పార్టీలలో చిచ్చుపెట్టి విపక్ష ప్రభుత్వాలను కూల్చేస్తున్నది. ప్రలోభాలో లేక బ్లాక్మెయిలో చేసి కొన్ని పార్టీలను బీజేపీకి ‘బీ టీమ్’లుగా మలచుకుంటున్నది. రాష్ర్టాల హక్కులను, ఆదాయాలను లాగేసుకుంటున్నది. ఈ బీజేపీ బుల్డోజర్ విధానాలే పార్టీలన్నింటినీ ఏక తాటిపైకి వచ్చేలా చేస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చిన్న పరిశ్రమలు- వ్యాపారాలపై దాడి!: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల ద్వారా సన్న, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను, వ్యాపారులను చావుదెబ్బ కొట్టింది మోదీ ప్రభు త్వం. విమానాశ్రయాలు, ఓడరేవులు, రోడ్లు, రైల్వేలు, విద్యుత్తు, ఖనిజాలన్నింటినీ గంపగుత్తగా బడా కార్పొరేట్లకు కట్టబెట్టి, దేశీయ చిన్న పారిశ్రామిక ఉత్పత్తి దారుల దారులన్నీ మూసేస్తున్నది. అందుకే వాళ్లంతా, ఆత్మరక్షణార్థం బీజేపీయేతర పార్టీలను బలపరచుకోవాలన్న నిశ్చయానికి వస్తున్నారు. బాంబే పారిశ్రామికవేత్తలు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి, బెంగాల్ వ్యాపారులు మమతా ప్రభుత్వానికి అండగా నిలవటమే అందుకు నిదర్శనం! అలాగే ఇతర రాష్ర్టాల వ్యాపార, పారిశ్రామికవర్గాల వారంతా ఆయా ప్రాంతీయ పార్టీలకు అండగా నిలవాలనుకోవటం ఆహ్వానించదగిన పరిణామం.
రైతులు- కార్మికులపై దాడి: రైతుల భూములను కార్పొరేటీకరించే దిశగా పార్లమెంట్లో చర్చకు, పార్లమెంటరీ కమిటీల ఆమోదానికి పెట్టకుండానే రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చింది మోదీ ప్రభుత్వం! ఇది దేశానికే ప్రమాదం! ఎందుకంటే.. భారత ఆర్థికాభివృద్ధిలో 70 శాతం వ్యవసాయ రంగానిదే. పారిశ్రామికాభివృద్ధికి వ్యవసాయమే పునాది. 130 కోట్ల భారతీయుల ఆహారభద్రతకు వ్యవసాయమే భరోసా. అత్యధికులకు జీవనోపాధి కల్పిస్తున్నదీ వ్యవసాయరంగమే. కనీస ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారు గ్రహించగలిగిన వాస్తవాలు ఇవి! మోదీ ప్రభు త్వం చేసిన నిర్వాకం ఇదని చెప్పటానికి మోదీ ప్రభుత్వపు తదుపరి చర్యలే సాక్ష్యాలు. రైతు ఉద్యమానికి అప్పటి ఎన్నికలకు భయపడి వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నారు. చట్టాల ద్వారా సాధించాలనుకున్న వ్యవసాయ కార్పొరేటీకరణ లక్ష్యాన్ని చాపకింది నీరులా సాధించేందుకు ప్రణాళికను రూపొందించారు నరేంద్ర మోదీ.
హిందువుల ఉద్ధరణ: హిందువులను ఉద్ధరించే ఏకైక పార్టీ అని చెప్పుకొంటున్న బీజేపీ, మరో కోణంలో తన కోణంలో మాట నిలుపుకొంటున్నది. ఉదాహరణకు విజయ్ మాల్యా- నీరవ్ మోదీ మొదలు ఆల్కా గోయల్, ఆశిష్ సురేష్ భాయ్ వరకు 28 మంది కార్పొరేట్లు భారతీయ బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఎగ్గొట్టిన మొత్తం పది ట్రిలియన్లు. అంటే.. అక్షరాల కోటి కోట్ల రూపాయలు. వీళ్లంతా హిందూ కార్పొరేట్లే. విజయ్ మాల్యా తప్ప, తక్కినవారంతా మోదీ స్వరాష్ట్రమైన గుజరాతీయులే! వాళ్లంతా దేశ విదేశాల్లో తమ వ్యాపారాలతో వర్ధిల్లేలా ఉద్ధరిస్తున్నది బీజేపీ ప్రభుత్వమే. కనీసం వాళ్ల వైపు కన్నెత్తి చూడ కుండా వ్యవస్థలను కట్టడి చేస్తూనే, మరో వైపు… వ్యవస్థలన్నింటినీ బీజేపీయేతర రాష్ర్టాల మీదికి ఉసిగొల్పటాన్ని చూస్తూనే ఉన్నాం! హిందువులను ఉద్ధరిస్తానంటున్న బీజేపీ ఎవరిని ఉద్ధరిస్తున్నదో ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
సహోదర భారతీయులారా.. చట్టాలు, నిబంధనలన్నీ పేదలు, రైతులు,కార్మికుల హక్కులను హరిస్తాయి. కానీ అవినీతిపరులైన కుబేరుల అక్రమాలను అరికట్టారు. నల్లధనాన్ని కట్టడి చేస్తానన్న మోదీ మాటలు డొల్ల మాటలే. మోదీ వన్నీ కల్ల నినాదాలేనన్న వాస్తవాన్ని సదా గుర్తుంచుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఎనిమిదేండ్లుగా కార్పొరేట్లకు తప్ప ఓటర్లకు చేసిందేమిటో చెప్పుకోవటానికి మోదీకేమీ లేదు. నాటి బ్రిటిష్ వాడిలా నేడు బీజేపీ కూడా సదా విద్వేషపు మంటలు వేసి చలి కాచుకుంటున్న రహస్యాన్ని భారతీయులు పసిగట్టడం శుభసూచకం.
రైతు ఆదాయానికి గండి: కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయకపోవటం. 5 కిలోల బియ్యానికి రూ.50 చొప్పున నగదు బదిలీ చేయటం ద్వారా సబ్సిడీ ఆహార పథకాన్ని ఎత్తేసి, రైతు నుంచి కొనుగోళ్లు ఆపటం. ఎఫ్సీఐ గోడౌన్లు అమ్మివేయటం ద్వారా రైతులను మార్కెట్ శక్తుల దోపిడీకి వదిలేయటం. ఖర్చుకు తగ్గ ఆదాయం రాకుం డా చేయటం…
వ్యవసాయ ఖర్చును పెంచేయటం: ఎరువులపై సబ్సిడీలను తగ్గించడం,డీజిల్ రేటును భారీగా పెంచడం, బోరు బావులకు మీటర్లు బిగించటం వంటి చర్యల వల్ల వ్యవసాయ ఖర్చును మోదీ రెట్టింపు చేశారు.
అన్నివర్గాల మీద దాడులే : యూనివర్సిటీలలో చొరబడి విద్యార్థుల మీద దాడులు. మతోన్మాదుల వికృత చేష్టలను ఎండగడుతున్న కళాకారులు, జర్నలిస్టుల మీద, ప్రశ్నించే వ్యక్తుల మీద హంతక దాడులు. విభేదించే వారి గొంతు నొక్కటానికి నిర్బంధాలు…
పాతూరి వేంకటేశ్వర రావు