‘అబద్ధమాడ.. నివొద్ది పల్క’ అన్నట్టుంది బీజేపీ నేతల తీరు. ఎన్నికల ముందు మేం అసల్కే అబద్ధాలాడం అని బల్లగుద్ది చెప్పే బీజేపీ నేతలు తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారని ప్రజలడిగితే మాత్రం ఆంధ్రా నాయకుడు ఆనం వివేకానందరెడ్డి ైస్టెల్లో ‘ఏందిది.. నేనెప్పుడూ చూల్లేదే…’ అంటూ మెల్లగా జారుకుంటున్నారు. అబద్ధాలాడటంలో బీజేపీ నాయకులను మించినోళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఏ నాయకుడైనా బీజేపీలో చేరితే చాలేమో.. అబద్ధాలు వాటంతటవే జాలువారుతూనే ఉంటాయి. నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలాడేస్తుంటారు. కానీ నిజం పల్కమంటే మాత్రం కషాయం మింగినంత పనిజేస్తారు కాషాయం నేతలు.
అబద్ధమాడకపోతే ఆ పార్టీలో చిన్న చూపు చూస్తారేమో.. అందుకే ప్రతీ నాయకుడు ప్రతీ ఎన్నికలో ఏదో ఒక పెద్ద అబద్ధాన్ని అవలీలగా ఆడేస్తుంటాడు. ఒక్కసారి దుబ్బాక ఉప ఎన్నికలు పరిశీలిద్దాం.. ఆ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు. ఆయన నాలుక వెంట మాటలు జారుడుబండపై నుంచి చిన్నపిల్లాడు జారినంత ఈజీగా జారుతనే ఉంటాయి. నరం లేని నాలుక ఏది మాట్లాడినా చెల్లుతుందనుకున్నాడేమో గానీ… అప్పటికే ఓటమి రుచి చూసిన ఆయన ఎలాగైనా గెలవాలనే కసితో అబద్ధాలనే అస్త్రంగా ఎంచుకున్నాడు. ‘రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా… కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’నని హామీ ఇచ్చాడు. తీరా గెలిచాక ‘ఏం అడిగినా నేనెప్పుడన్నానంటూ’ జారుకుంటున్నాడు.
ఇగ ఆత్మగౌరవం అంటూ టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3 వేల పింఛన్ ఇప్పిస్తానని మాటిచ్చాడు. ఎన్నికలైపోయి ఏడాది కావొస్తున్నది. కానీ ఆయన హామీ మాత్రం నెరవేరలేదు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ విషయానికి వస్తే… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరద బాధితులకు ‘ఇల్లు పోతే ఇల్లు, కారు పోతే కారు, బైక్ పోతే బైక్ ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. తీరా ఎన్నికలు ముగిశాక మేం ఇస్తామన లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇప్పిస్తామని చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇదీ ప్రజల పట్ల బీజేపీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి.
ఒక్కసారి దేశం దిక్కు చూద్దాం. బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో పింఛన్ ఎంత ఉన్నది? ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి ప్రభుత్వం రూ.500 పింఛన్ అందజేస్తున్నది. యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా మిగతా రాష్ర్టాల్లో పింఛన్ వెయ్యి దాటదు. అలాంటిది తెలంగాణలో మోదీని ఒప్పించి రాజగోపాల్రెడ్డి రూ.3 వేల పింఛను ఇప్పిస్తాననటం చూస్తుంటే నవ్వుపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది. ప్రజలకు చేసేది చెప్పాలి, చెప్పింది చేయాలి. అది చేతకాకపోతే ఊరుకోవాలి. అంతే కానీ అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాలనుకుంటే ప్రజలు చైతన్యవంతులై కర్రు కాల్చి వాత పెడతారు.
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం నల్గొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించిన ఘనత కేసీఆర్ది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.3 వేల పించన్లను అందిస్తున్నారు. ఇలా కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా, లేదా అనేది ప్రజలు గమనించాలి. ఏండ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పింఛన్ల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడుకు ఏమీ చేయలేదంటూ రాజగోపాల్రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన అసలు నియోజకవర్గంలో ఉంటే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, చేయలేదో తెలిసేది. మునుగోడు నియోజకవర్గంలో 2014-2018 వరకు నాలుగేండ్లలో రూ.2843.38 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరిగాయి. గత ఎనిమిదేండ్లలో మునుగోడు నియోజకవర్గంలో రూ.10,258 కోట్ల సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయి. బహుశా రాజగోపాల్రెడ్డికి తన స్వార్థం కోసం తెచ్చుకున్న రూ. 22 వేల కోట్ల కాంట్రాక్టు కంటే ఇవి తక్కువ అనిపిస్తుండొచ్చు. కానీ, రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.12 వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ది, పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారు.
మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గడపకు కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరాయి. నేడు ఏ ముసలవ్వనడిగినా ‘కేసీఆర్ నా పెద్దకొడుకు’ అంటున్నది. ఏ ఆడపిల్ల తండ్రినడిగినా ‘కేసీఆర్ నా బిడ్డ పెండ్లికి సాయం జేసిండు’ అని కీర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ, ఇలా అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను ఏమార్చుదామనుకున్నవాళ్లకు మునుగోడు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాల బీజేపీ పాలనకు చరమగీతం పాడి అభివృద్ధి, సంక్షేమంతో కూడిన దేశాన్ని నిర్మించేందుకు దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు.
ఆ అడుగుకు చైతన్యవంతులైన మునుగోడు ప్రజలే మంచి ఆరంభాన్ని అందించాలి. విద్వేషాలతో రాజకీయం చేసే బీజేపీ పార్టీకి తగు గుణపాఠం చెప్పాలి. ప్రజల ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి తన స్వలాభం కోసం రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటు కోసం తమ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నించాలి. ‘మన ప్రాంతం, మన రాష్ట్రం, మన పార్టీ, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష’ అన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాటను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లుతూ, వాళ్ల చెప్పులు మోస్తున్న వారి వెంటనడిచి రాష్ర్టా న్ని బానిస చేయాలా అనేది ప్రజ లు ఆలోచించాలి. అందుకే కేసీఆ ర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరా మ రక్ష అని గ్రహించాలి.
తెలంగాణ విజయ్
94919 98702