స్వతంత్ర కాకతీయ రాజులందరికీ ఒక సామ్యం ఉంది. రుద్రదేవుడి మొదలు చివరివాడైన ప్రతాపరుద్రుడి దాకా అందరూ యుద్ధంలోనే మరణించారు, ఒక్క గణపతి దేవుడు తప్ప. గణపతి దేవుడు కూడా మొదలు యుద్ధబందీగా ఉండే రాజైనాడు. ఇది కేవలం కాకతీయ వంశానికే పరిమితమైనది కాదు. మధ్యయుగాల్లో భూస్వామ్య విధానంలో ఎదిగిన రాచరిక వ్యవస్థల ఉమ్మడి లక్షణం. ప్రతీ రాజ్యం ఎందరో భూస్వామ్య, సైనిక నాయక కుటుంబాల మీద ఆధారపడి పెరగడం, రాజులూ, రాజ వంశాలు ఈ యుద్ధాలతోనే ఎదిగాయి. కాకతీయుల్లాగే దేవగిరిలో యాదవులు కూడా క్రీ.శ.1187లో భిల్లమ అనే రాజు కాలంలో స్వతంత్రులైనారు. వీళ్ళు కూడా ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల సామంతులే.
కాకతీయుల శాసనాల్లో రుద్రదేవుడి మరణం ఎట్లా జరిగిందనేది తెలియడం లేదు. దేవగిరి యాదవుల శాసనాల్లోనే రుద్రుడి ఓటమి లేక మరణం గురించి ఉంది. అయితే యాదవ రాజు జైతుగి (జైత్రపాలుడు అని కూడా అంటారు) చేతిలో యుద్ధ భూమిలో చనిపోయింది రుద్రదేవుడా లేక ఆయన తమ్ముడు మహదేవుడా అనేది స్పష్టంగా లేదు. ఏదేమైనా రుద్రదేవుడి గురించి ఉన్న చివరి శాసనం క్రీ.శ.1195 నాటి జనగామ జిల్లా బెక్కల్లు శాసనం కాబట్టి రుద్రుడి మరణం అప్పుడే జరిగిందని చెప్పొచ్చు. మహదేవుడి శాసనాల్లో మొదటిది క్రీ.శ.1195 నాటిది కావటం దీనిని బలపరుస్తుంది.
మహదేవుడు
అతి తక్కువ కాలం, క్రీ.శ.1195 నుంచి క్రీ.శ.1198 వరకు, కేవలం మూడేండ్లు మాత్రమే రాజ్యం ఏలిన వాడు మహదేవుడు. రుద్రదేవుడికి కొడుకు లేకపోవడంతో తమ్ముడైన మహదేవుడు రాజైనాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మహాదేవపూర్ ఈ రాజు పేరిట వెలసిన గ్రామమే. నల్గొండ జిల్లా దేవరకొండలో దొరికిన ఒక శాసనం నల్లదామేపల్లి అనే గ్రామంలోని మహాదేవ సముద్రం గురించి చెపుతుంది. చెరకు వంశస్థులు నిర్మించిన ఈ చెరువు మహదేవుడి పేరిట నిర్మించిందే కావచ్చు, ఎందుకంటే రుద్రదేవుడి నాటి నుండే చెరకు వంశస్థులు కాకతీయుల విధేయులు. మిర్యాలగూడ దగ్గర మాటూరులో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న శాసనం మహదేవుడి గురించిన స్పష్టమైన శాసనం.
క్రీ.శ.1195 నాటి ఈ శాసనంలో శ్రీపర్వత ఉత్తర ద్వారంలో ఉన్న మహేశ్వరుడికి (అంటే ఏలేశ్వరంలోని మహేశ్వరుడికి కావచ్చు), కాకతి మహదేవ మహారాజు, లెంకల మాటూరును దానం చేసినట్టు ఉంది. లెంకలు అంటే సైన్యంలో నాయకులు అని అర్థం. ఈ లెంకల్లో వెలమలు, రెడ్లు వంటి కులాల వాళ్ళు ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న లెంకలపల్లి అర్థం కూడా ఇదే. ఈ పేర్లున్న ఊర్లల్లో పరిశోధన చేస్తే కాకతీయ కాలం నాటి శాసనాలు, ఆలయాలు దొరికే అవకాశం ఉంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంటలో దొరికిన క్రీ.శ.1197 శాసనం మహదేవుడి కాలానికి చెందిన ఒక ముఖ్య శాసనం.
ఓరుగల్లు సింహాసనమెక్కిన అందరు పాలకులు దేవగిరి యాదవులతో యుద్ధం చేసిన వారే. యుద్ధమే కాదు కొన్ని సందర్భాల్లో వియ్యం కూడా చేశారు. ఇంకొన్ని సార్లు యాదవుల రాకుమారులు, వంశస్థులు కాకతీయులకు సామంతులుగా కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తారు. నల్గొండలోని పానుగల్లు శాసనంలో యాదవ పాలకుడు సారంగపాణి వివరాలు కనిపిస్తాయి.
మహదేవుడి సామంతుడు మల్లిరెడ్డి ఆ ఊరిలో మహాదేవర, సూర్యదేవర, శ్రీవాసుదేవరలకు గుళ్ళు కట్టించి చెరువులు తవ్వించి, చేసిన దాన వివరాలున్నాయి. పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో దొరికిన క్రీ.శ.1197 నాటి శాసనం మహదేవుడి ఒక స్థానిక సామంతుడు ఏర్పాటు చేయించింది కావచ్చు. మహదేవుడి ఇద్దరు కూతుళ్లు చెరువులు తవ్వి తమ పేరును అజరామరం చేసుకున్నారు. మైలాంబ ఇప్పటి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో, కుందమాంబ చెన్నూరు దగ్గర కుందవరంలో కుందసముద్రాన్ని చెరువులు తవ్వించి శాసనాలు జారీ చేశారు.
తండ్రి మరణం-కొడుకు బందీ
రుద్రదేవుడి తర్వాత మహదేవుడు యాదవులతో యుద్ధాన్ని కొనసాగించాడు. వరంగల్ జిల్లా ధర్మారావుపేట్ (రామకృష్ణాపురం)లో దొరికిన గణపతిదేవుడి శాసనం మహదేవుడు రణంలో వీర మరణం పొంది స్వర్గపురికి చేరినాడని స్పష్టం చేసింది. మహదేవుడితో పాటే యుద్ధానికి పోయిన పిల్లవాడైన గణపతి దేవుడిని జైతుగి బంధించి దేవగిరిలో ఉంచాడనీ, కాకతీయ మంత్రి రేచర్ల రుద్రుడి దౌత్యం వల్ల గణపతి దేవుడు విడుదలై రాజైనాడని కూడా ఈ శాసనంలో తెలుస్తుంది. అందుకే రుద్రదేవుడి మరణంలో ఉన్న సందేహాలు మహదేవుని విషయంలో లేవు.
యాదవులెవరు?
మధ్యయుగాల్లో అధికార వర్గంగా మారిన శూద్ర కులాలెన్నో ఉన్నాయి. మొత్తం భారత ఉపఖండంలో ఈ పరిణామం జరిగింది. అయితే శూద్ర కులాల నుంచి రాజకీయంగా ఎదిగినప్పటికీ, సామాజికంగా ఎదిగేందుకు చేసే ప్రయత్నంలో ఎన్నో వంశాలు పురాణాల్ని, కాల్పనిక అంశాల్ని ఆశ్రయించాయి. దేవగిరిలో అధికారాన్ని చిక్కించుకున్న యాదవులు కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్లులో ఉన్న శాసనంలో యాదవ వంశం గురించి రాస్తూ, ద్వారావతీ పురవరాధీశ్వర (ద్వారకా పుర రాజులు), విష్ణు వంశోద్భవులమనీ చెప్పుకొన్నారు.
యాదవులు ఏలిన ఈ ప్రాంతాన్ని సౌన దేశం అని కూడా అన్నారు. నాసిక్-దౌల్తాబాద్ మధ్య ప్రాంతం వీరి రాజ్యానికి కేంద్రంగా ఉండింది. వీరు ఎదుగుతున్న కాలంలోనే పశ్చిమోత్తర, ఉత్తర భారతంలో పాలకులవుతున్న ప్రతీహారులు కూడా పశుపాలక వృత్తి నుండి వచ్చిన వారే. కానీ వాళ్ళు కృష్ణుడి వారసత్వాన్ని కాకుండా రాముడి తమ్ముడు లక్ష్మణుడి ద్వారపాలకులమని (ప్రతీహారులంటే ద్వారపాలకులు అని అర్థం) చెప్పుకొన్నారు. దేవగిరి యాదవులు మాత్రం స్పష్టంగా కృష్ణుడి వారసత్వాన్ని, ద్వారకతో సంబంధాన్ని తమ కాల్పనిక చరిత్రకు జోడించారు.
డాక్టర్,ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000