ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వృథా చేయకపోతే సంపదను సృష్టించినట్లే! ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార ధాన్యాలలో 35 శాతం వరకు వృథా అవుతున్నాయి.
భారత్లో ఏటా సుమారు రూ.58 వేల కోట్ల విలువైన ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 82.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఈ లోపం వల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఒక పసి బిడ్డ పొత్తిళ్లల్లోనే చనిపోతున్నాడు. బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతున్నది. భారత్లో 5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. వీటిని అవసరమైన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచితే ఆకలి కేకలు, పోషకాహార లోపాలు తగ్గుతాయి. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందుబాటులో లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండించే భూమి విస్తీర్ణం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, వ్యవసాయ రంగంపై ఆశించిన పరిశోధనలు జరగకపోవడం, ఆహార ధాన్యాలు, పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం ప్రధానమైనవి.
2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటికే 750 కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్క పూట తిండికి కూడా నోచుకుని వారి సంఖ్య 150 కోట్ల పైమాటే. దీంతో కొన్ని దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నది. ఆహార కొరతను తీర్చాలంటే చాలా కాలంపాటు ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండేలా నిల్వ సదుపాయాలు పెంచాలి. ప్రజలకు ఆహార వృథా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. సరైన ప్యాకింగ్ పద్ధతులు పాటించాలి. ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలపై రైతులకు 90% రుణాలు ఇవ్వాలి. వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అప్పుడే ఆహార భద్రత సాధ్యమై అందరికీ ఆహారాన్ని అందించగలం.
(వ్యాసకర: సామాజిక కార్యకర్త)
(నేడు ప్రపంచ ఆహార దినోత్సవం)
పులి రాజు
99083 83567