నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయి. మన్ కీ బాత్, మేక్ ఇన్ ఇండియా, ఒకే దేశం ఒకే పన్ను, ఒకే విధానం నినాదాలతో ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదు. కానీ ఇవేమీ పట్టించుకోని బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు గడుస్తున్నప్పటికీ కొత్తదనం లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ధ్వంసం చేస్తూ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పేరుతో కంపెనీలను తెగనమ్ముతున్నది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటి ధరలు అడ్డగోలుగా పెంచి పేద ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తున్నది. గుజరాత్ నుంచి ప్రారంభమైన మోదీ కాషాయీకరణ విధానం దేశమంతా విస్తరింపజేయడమే లక్ష్యంగా బీజేపీ సాగుతున్నది. అన్ని రాష్ట్రాల్లో అధికారం తమకే చెందాలనే దురుద్దేశంతో ప్రాంతీయపార్టీలు, జాతీయ పార్టీలు అని తేడా లేకుండా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వంలో చిచ్చుపెడుతున్నది. అక్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అధికార సాధనే లక్ష్యంగా చాలా సీరియస్గా పావులు కదుపుతున్నది.
భారతదేశాన్ని కాస్తా హిందూ దేశంగా మార్చాలనే దురుద్దేశపూరిత ఆలోచన బీజేపీలో ఉన్నది. ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్నది. వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేపిస్తూ రాజకీయ ప్రభావాన్ని తగ్గిస్తున్నది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ మరోసారి అధికారంలోకి వస్తే మరింత రెచ్చిపోయే ప్రమాదం పొంచివున్నది. బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి ప్రతిపక్షపార్టీలు కూడా దూకుడుగానేవ్యవహరిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఉనికిని నిలబెట్టుకుంటున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. అయితే ప్రాంతీయ పార్టీల అధికారాన్ని కూల్చే ప్రయత్నంలో బీజేపీ ఉన్నది.
అధికారం కోసం అర్రులు చాచే రోజుల్లో సైతం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా సీపీఐ పని చేస్తున్నది. అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరుతో నిర్వహించే జాతీయ సదస్సులో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలను ఒకతాటిపై తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నది.
బీజేపీతో కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్కుమార్, దానితో విభేదించి ఆర్జేడి, వామపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలకు బీహార్ను ఒక ఉదాహరణగా తీసుకొవచ్చు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక కూటమి, అలాగే బీజేపీ, కాంగ్రెస్యేతర కూటములపై రకరకాల చర్చలు సాగుతున్నవి. ఇలాంటి పరిస్థితుల్లో వామ పక్షాలు కీలక పాత్ర పోషించాల్సి ఉన్నది. దేశం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత నేపథ్యంలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరుగనున్నాయి. నిరంకుశ, మతోన్మాద, ఫాసిస్టు బీజేపీని 2024లో గద్దె దింపేందుకు సీపీఐ తన వంతు కర్తవ్యాన్ని జాతీయ రాజకీయాలలో నిర్వహిస్తున్నది. అధికారం కోసం అర్రులు చాచే రోజుల్లో సైతం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా, అధికారంలో భాగస్వామి కాకుండా దేశానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను అందించిన చరిత్ర వామపక్షాలది. 2004లో దేశానికి అప్పుడప్పుడే ప్రమాదకారిగా మారుతున్న మితవాద ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించి, యూపీఏ 1 ప్రభుత్వ ఏర్పాటులో వామపక్షాలు కీలక భూమిక పోషించాయి. రానున్న ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించేందుకు సమాయత్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభ ద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో విశాల లౌకిక, ప్రజాతంత్ర , వామపక్ష వేదిక ఏర్పాటుకు రూపకల్పన జరగనున్నది. అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరుతో నిర్వహించే జాతీయ సదస్సుకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలను ఒకతాటిపై తీసుకువచ్చే ప్రయత్నాలలో భాగంగా బీహార్, కేరళ, తెలంగాణ , తమిళనాడు తదితర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నాము. ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం జరిగే ప్రయత్నాలకు ఈ మహాసభ ఒక వేదిక కానున్నది.
(వ్యాసకర్త: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు)
(అక్టోబర్ 14-18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా..)
చాడ వెంకటరెడ్డి