అంతా బహిరంగమే., తప్పులను చేసేటప్పుడు కూడా చాలా బహిరంగంగానే దబాయించి ‘ఇట్లనే చేస్తం.. ఏం చేస్తర్ మీరు’ అనే టైప్లో చేస్తుండటం ఒక దిక్కుమాలిన సాహసోపేత చర్య. మొన్నటికి మొన్న, గత ఆగస్టు 1న 5జీ స్పెక్ట్రం వేలం వేయడంలో కూడా సభ్య ప్రపంచమంతా చూస్తూండగానే ఒక బహిరంగ అకృత్యం జరిగిపోయింది. వేలంలో ప్రభుత్వం రూ.4,75,000 కోట్ల రాబడిని ఆశించింది. కానీ అంతిమంగా బహిరంగంగానే అంబానీకి ఈ ఆధునిక సాంకేతిక దేశ సంపదను రూ.1,50,000 కోట్లకే కావాలని కట్టబెట్టి రూ.3,25,000 కోట్ల ప్రజా ధనాన్ని నష్టపర్చింది.
ఇంత పెద్ద స్కాండల్ అతి బహిరంగంగానే జరిగినా మరి ఈ దేశ మీడియా, వ్యవస్థలూ అన్నీ కిమ్మనకుండా మిన్నకున్నయ్. 15 ఏండ్ల కిందట 2జీ స్పెక్ట్రం వేలంలో అప్పుడు రూ.60 వేల కోట్ల రాబడిని ప్రభుత్వం పొందితే జరిగిన అవినీతి గురించి చెలరేగిన కల్లోలం మనందరం చూశాం. మరిప్పుడు.. కండ్లముందే ఎందుకింత బహిరంగ దౌర్జన్యకర దగా జరిగింది. అధునాతన 5జీ స్పెక్ట్రం విలువ దాదాపు కనీసం 5 లక్షల కోట్లయినా పలుకుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది.
కానీ ఊహాతీతమైన అదనపు ‘అజ్ఞాత లక్షల కోట్ల మేలు’ కూడా అంబానీకి బంగారు పళ్ళెంలో పెట్టి అప్పజెప్పారు. అదెట్లంటే.. గత కొన్నేండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసి ఈ దేశపు మహా నగరాల దగ్గరి నుంచి గ్రామీణ మండల కేంద్రాల దాకా విస్తృతమైన ‘ఫైబర్ నెట్వర్క్ వ్యవస్థను’ ఏర్పాటుచేసింది. దాన్ని ఇప్పుడు ఈ 5జీ స్పెక్ట్రం అలాట్మెంట్లో భాగంగా ఉచితంగా వాడుకుంటాడు అంబానీ. అదేవిధంగా ఇస్రో సహకారంతో కోట్ల రూపాయలను ఖర్చుచేసి అంతరిక్షంలోకి పంపిన శాటిలైట్స్ ద్వారా అత్యాధునిక ‘సిగ్నలింగ్ వ్యవస్థ’ను కూడా ఉచితంగా తన టవర్స్కు అనుసంధానం చేసుకుని ఉపయోగించుకుంటాడు. ఇంకా తన సొంత టవర్స్ వ్యవస్థ లేని చోట బీఎస్ఎన్ఎల్ టవర్లను సంధానం చేసుకుంటూ అతిక్రమిస్తాడు. ఇంత విచ్చలవిడి.. ఇది ప్రజారంజక పాలననా.. ప్రజాకంఠక దూర్తపరిపాలననా ఆలోచించాలె. ఇంతకూ ఈ ప్రభుత్వానికి ఈ అంబానీలు ఎవరు? ఈ దేశ ప్రజలు ఎవరు? లోతుగా ఆలోచించాలి మనం.
ఎప్పుడైనా కేంద్ర, రాష్ట్ర స్నేహపూర్వక ప్రేమమయ సంబంధాలే దేశంలో శాంతిని స్థాపిస్తాయి. అన్నిరంగాల్లో బలమైన రాష్ర్టాలే కేంద్రాన్ని బలంగా దృఢంగా ఉంచగలుగుతాయి. ఎన్ని రాష్ర్టాల్లో మనం అధికారంలో ఉన్నామన్నది కాదు, ఎన్ని రాష్ర్టాల మధ్య సౌభ్రాతృత్వ సంబంధాలను తండ్రి వంటి కేంద్రం నెలకొల్పగల్గుతున్నది. ‘అప్పులను మీరూ చేయండి.. మీకంటే అప్పులు మేమూ చేస్తాం’ అన్న అనారోగ్యం సందేశాన్నివ్వడం కాకుండా, ఎట్లా మనందరం రుణ విముక్త భారత్ను సృష్టిద్దాం అన్న దిశలో ఆలోచించండి.
ప్రశ్నించేవాడిపై ఈడీ, సీబీఐ దాడులు. తమకు వంతపాడని ప్రభుత్వాలను కూడా నిర్దాక్షిణ్యంగా ఆంక్షలకూ, వివక్షకు గురిచేస్తూ నిధులను కేటాయించకుండా హింస. వేలకొద్ది కోట్ల రూపాయలు చెల్లింపులను, రుణ సదుపాయాలను నియంత్రించడం. కేంద్రం తాను మాత్రం లక్షల కోట్ల రూపాయల అప్పులను చేస్తూ ప్రజా ధనాన్ని తమకు నచ్చిన కార్పొరేట్లకు దోచిపెడుతూ రాష్ర్టాలకు మాత్రం అనేకానేక కొరుకుడు పడని ఆంక్షలను అడ్డుపెడుతుంటుంది. అభివృద్ధికి మోకాలడ్డుతూ శాడిస్టుగా ప్రవర్తిస్తుంది. ఇవన్నీ నానాటికీ హద్దులు దాటుతూ నీతివంతులైన, క్రమశిక్షణగల పాలకులను ఇబ్బంది పెట్టే దుష్ట సంస్కృతి ఒక ప్రాణాంతక రుగ్మతై సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నది.
ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ర్టానికి ‘నీతి ఆయోగ్’ వంటి సాధికారక సంస్థలు కూడా బహిరంగంగా రికమెండ్ చేసిన వేలకొద్ది కోట్ల రూపాయల నిధులను ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’, ‘కాళేశ్వరం’ వంటి సాగు, తాగునీటి మహాద్భుత ప్రాజెక్టులకు అస్సలు ఒక్క రూపాయి కూడా సహాయం అందించకుండా, బహుళార్థ సాధక ప్రాజెక్టును కూడా ఒక్కటైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకుండా కేంద్రం హింసిస్తున్నది. కాళేశ్వరం అనే ప్రపంచస్థాయి సాగునీటి శాశ్వత భాండాగారాన్ని తయారుచేసుకుని నీటి కరువును శాశ్వత ప్రాతిపదికన దూరం చేసిన దార్శనికతతో తెలంగాణ ఒక ‘మోడల్’గా నిలబడ్డది. కేంద్ర మంత్రులతో సహా పలువురు పదే పదే ప్రశంసిస్తూ, పురస్కారాలతో గౌరవిస్తూ శ్లాఘిస్తూండగా తుచ్ఛ పాలక రాజకీయ నాయకులు మాత్రం లోతైన శాస్త్రీయ జ్ఞానం లేక, సరైన శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఎవరో చెప్పే ‘ప్రాంప్టింగ్ నాలెడ్జ్’ అధికార దాహంతో వేదికలపై హూం కరిస్తూ అరుస్తే.. అది కేంద్ర రాష్ట్ర సఖ్యతను కక్షపూరితం చేస్తూ హరిస్తుంది తప్పితే, సౌభ్రాతృత్వాన్ని స్థాపించలేదు.
మన కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకులను లూటీచేసే కార్పొరేట్ నేరస్థులపై ప్రేమ ఎక్కువ. అందుకే 2015-2022 మధ్య 13 లక్షల కోట్ల రుణాలను మాఫీచేసింది. ఇవేకాకుండా ఈ దేశ గత వైభవానికి చిహ్నాలుగా, లాభాలను కూడా ఆర్జిస్తూ కేంద్రానికి కోట్ల రూపాయల డివిడెండ్లను అందజేస్తున్న ప్రతిష్ఠాత్మక వ్యవస్థలను ప్రైవేట్పరం చేయాలన్న దుస్సంకల్పం చేస్తున్నది. ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి అప్పజెప్పేందుకు లైన్ క్లియర్ చేయాలన్న దురాలోచన. ఇటువంటి ఈ దేశాన్ని అమ్మేయాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రభుత్వంగా గొప్ప పేరును సంపాదించుకుంటున్నా కేవలం రాజకీయ అధికారదాహంతో ఆక్టోపస్లా వ్యాపించే దుగ్ధను తగ్గించుకొని… ఈ దేశానికి వెన్నెముక వంటి రైతులు.. ఎందుకు 23 రాష్ర్టాల నుంచి ప్రతిఘటిస్తున్నారు. ఎందుకు నాయకత్వం కొరవడి ఉత్ప త్తిరంగాలన్నీ నిర్వీర్యమై సంక్షుభితంగా ఉన్న యి, ఎందుకు ఆర్థిక సూచికలన్నీ నేల చూపు లు చూస్తూ పతనమౌతున్నయి. ఎందుకు మన రూపాయి జీవితకాల పతనావస్థలో ఉన్నదని ఆత్మ పరిశీలన చేసుకోవడం ఇప్పటికైనా చాలా అవసరం.
అంతిమంగా మానవ సంబంధాలన్నీ వ్యా పారాత్మక, ఆర్థిక సంబంధాలే అన్న సిద్ధాంతకర్తల అవగాహనలో వర్తమాన కేంద్ర, రాష్ట్ర సం బంధాలను వీక్షించినపుడు.. కొత్తగా 2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇంతవరకు కేంద్రానికి ఇచ్చింది రు.3,65,797 కోట్లు.. రాష్ట్రం రాజ్యాంగబద్ధ పద్ధతుల ద్వారా పొందింది రూ.1,96,448 కోట్లు. ఎవరైనా తప్పులు చేస్తున్నప్పుడు.. ‘చెయ్ చాపు’ అన్న గదమాయింపు తప్పదు. దానిపై ‘సర్ ర్ర్ర్’ మని ఒక బెత్తం దెబ్బ తప్పదు. ఐతే మంచి మార్పు ఎప్పుడూ భయంతోనే వస్తుంది.
ప్రొఫెసర్ రామా చంద్రమౌళి
93901 09993