చేనేతరంగం తక్కువ పెట్టుబడితో డిమాండ్కు అనుగుణంగా ఒక సంప్రదాయ కులవృత్తిగా కొనసాగుతున్నది. ఈ రంగం కరెంటు రహిత, తక్కువ ఉత్పాదకతతో, సృజనాత్మకతతో కూడుకున్నది. 2019-20లో చేపట్టిన 4వ ‘ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సెన్సెస్’ ప్రకారం… దేశంలో 35 లక్షల మంది చేనేత కార్మికులు ఉండగా, వారిలో 89 శాతం మంది కార్మికులు గ్రామాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయం తర్వాత చేనేతరంగం ప్రధాన వృత్తిగా ఉండి, నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నది.
2009-10లో చేపట్టిన 3వ ‘ఆల్ ఇండియా హ్యండ్లూమ్ సెన్సెస్’ ప్రకారం.. 1995-2010 మధ్య కాలంలో దాదాపు 3 లక్షల నేత కార్మికులు తగ్గిపోయారు. కానీ 4వ ‘ఆల్ ఇండియా హ్యండ్లూమ్ సెన్సెస్’ నాటికి, ఈ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలు 3 లక్షలకు పైగా పెరిగాయి. ఇక మగ్గాలపై జరిగిన వస్ర్తోత్పత్తిని చూస్తే.. 2013-14లో 7,104 మిలియన్ చదరపు మీటర్లు ఉండగా, 2018-19 నాటికి 5,134 మిలియన్ చదరపు మీటర్లకు తగ్గింది. చేనేతరంగంలో నైపుణ్య శిక్షణ ఒక తరం నుంచి మరో తరానికి ఇతర కులవృత్తుల్లాగానే జరుగుతున్నది. టెక్స్టైల్లో ఇంజినీరింగ్, హ్యండ్లూమ్లో డిప్లొమా కోర్సులున్నప్పటికీ అవి ఈ వృత్తిపై ఆధారపడ్డ యువతను ఆకర్షించలేకపోతున్నాయి. మరోవైపు చేనేత వృత్తిపై ఆధారపడిన వారికి ఆశాజనకమైన ఆదాయం రావడం లేదు. ఫలితంగా ఈ వృత్తిని యువత తమ జీవనోపాధిగా ఎంచుకోలేకపోతున్నది. చేనేత వృత్తిపై ఆధారపడిన (గ్రామీణ) కుటుంబాలకు చెందిన యువత ఉన్న ఊరిలోనే ఇతర లాభదాయకమైన పనిచేసుకోవడం గానీ, పట్టణాలకు, నగరాలకు ఉపాధి కోసం వలస పోవడం గానీ చేస్తున్నది.
జాతీయ చేనేత దినోత్సవం: మహాత్మా గాంధీ 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందువల్ల, కేంద్రం 2015 నుంచి ఏటా ఆగస్టు 7ను చేనేతరంగం పట్ల అవగాహన కల్పించడానికి, నేతన్న ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో ‘జాతీయ చేనేత దినోత్సవం’గా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ప్రధాని ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకాన్ని పటిష్టపరిచే దిశగా అడుగులు వేయడానికి ‘వోకల్ ఫర్ హ్యాండ్మేడ్’ (చేనేతకు గొంతు అవ్వండి) అని పిలుపునిచ్చారు. చెన్నైలో మొదలైన ఈ ఉత్సవాలు ఏటా ఒక్కో నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదేరోజున ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్కు కూడా రూపకల్పన చేశారు. దీనిద్వారా ఇప్పటివరకు 184 విభాగాల కింద 1,714 ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ చేశారు.
చేనేతరంగంపై కేంద్రం ధోరణి: ఇప్పటివరకు కేంద్రం 72 రకాల చేనేత ఉత్పత్తులకు, 6 రకాల లోగోలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపునిచ్చింది. 60 ఏండ్లు పైబడి, ఒక లక్ష కంటే తక్కువ సంవత్సర ఆదాయం కలిగి పద్మశ్రీ గాని, సంత్ కబీర్ గాని, ఇంకా ఏదైనా జాతీయ/రాష్ట్రస్థాయి అవార్డు పొందిన నేత కార్మికులకు నెలకు రూ. 8 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. గత యూపీఏ ప్రభుత్వం నేత కార్మికుల కోసం అమలుపరిచిన ‘మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన’ స్థానంలో, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం 2017 నుంచి కొత్తగా రెండు పథకాలను తీసుకువచ్చింది. దీనివల్ల చేనేత కార్మికులు మునుపటిలా ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ముద్ర’ పథకం కింద 23 శాతం మంది నేత కార్మికులకే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి.
చేనేత కార్మికులు: మతపరంగా చూస్తే.. 78 శాతం హిందువులు, 15 శాతం ముస్లింలు, 6 శాతం బౌద్ధులు, ఒక శాతం ఇతరులున్నారు. కులాలవారీగా చూస్తే.. 42 శాతం ఓబీసీలు, 21 శాతం ఎస్టీలు, 9 శాతం ఎస్సీలు, 27 శాతం ఇతరులున్నారు. రాష్ర్టాలపరంగా చూస్తే అసోంలో 10 లక్షల మందితో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణలో 47 వేలకు పైగా నేత కార్మికులున్నారు.
2014-15లో చేనేత రంగానికి రూ.621 కోట్లు కేటాయించగా, 2018-19 నాటికి కేవలం రూ.386 కోట్లు విదిల్చింది. చేనేతరంగాన్ని బతికించడానికి గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని తీసుకువస్తే, నేడు 75 వసంతాల ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ కేంద్రం 5 శాతం జీఎస్టీ వేసి ఆయువు తీసేలా వ్యవహరిస్తున్నది. చేనేత వస్ర్తాలపై జీఎస్టీ వల్ల సమీప భవిష్యత్తులో లక్షలాది మంది నేత కార్మికులు రోడ్డునపడే దుస్థితి రానున్నది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదాలతో స్వదేశీ వస్తువులను విరివిగా వాడాలని చెప్పే కేంద్ర ప్రభుత్వమే చేనేత వస్ర్తాలపై పన్నులు వేసి వారిని వృత్తికి దూరం చేస్తున్నది.
నేతన్నలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: చేనేతరంగ సమస్యలు గుర్తించిన తెలంగాణ సర్కార్ చేనేత రంగానికి పునర్ వైభవం తీసుకురావాలని సంకల్పించింది. వారి సంక్షేమం కోసం నేరు గా నగదు ఇవ్వడం, బీమా సౌకర్యం కల్పించడంతో పాటు ముడిసరుకులను రాయితీతో అందిస్తున్నది. మరోవైపు ఉపాధి కల్పనే ధ్యేయంగా టెక్స్టైల్ పార్కులు నెలకొల్పి పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచడం వంటి బహుముఖ వ్యూహాలను రూపొందిస్తున్నది.‘ఆసరా’ పథకం కింద నేతకార్మికులకు నెలకు రూ.2 వేల చొప్పున పింఛన్ అందిస్తున్నది. అలాగే నేత కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడానికి ‘బతుకమ్మ చీరలు’ నేయించి, రాష్ట్రంలోని తెల్ల రేషన్కార్డు హోల్డర్లకు ఉచిత కానుకగా అందిస్తున్నది. ఈ పథకాలన్నీ రోజురోజుకూ కునారిల్లుతున్న చేనేత రంగానికి నూతన జవాసత్వాలిచ్చేవే. రాష్ట్ర ప్రభుత్వం ఆచరిస్తున్న మార్గాన్ని కేంద్రం కూడా అనుసరిస్తే దేశంలోని నేతన్నలు సంతోషిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చేనేత పాలసీతో ముందుకురావాలి.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్)
డాక్టర్ జి.శ్రీరాములు 92484 24384