ఎలాగైనా ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీల నాయకులు పాదయాత్రలు మొదలు పెట్టారు. యాత్రలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లవి సరైన రాజకీయ పరిజ్ఞానం లేని రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప మరొకటి కాదు.
నో రుతిరగక పోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం, కేసులు పెట్టగానే నానా యాగీ చేసి ప్రసార మాద్యమాల్లో పోజులు కొట్టడం వంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. పాదయాత్రల పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న యాత్రలు విమర్శలపాలవుతున్నాయి. అనుచితవ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో పలుచనవుతున్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి ఇటీవల ఒకప్పటి నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ములుగు రోడ్షోలోప్రగతిభవన్ను పేల్చివేయాలనడంలో ఆంతర్యమేంటీ? ఆ విపరీ త వ్యాఖ్యలు ఎటు దారితీస్తాయి. టీపీసీసీ స్థాయి వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా అని వారి కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. సరైన నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తులను టీపీసీసీ స్థానంలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుందని పార్టీ నాయకులే అనుకుంటున్నారు. నిజంగా వీరికి తెలంగాణ పై ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి నినాదం ఇవ్వాలి కానీ ప్రగతి భవన్ పేల్చేస్తాం, ఫాంహౌజ్ దున్నేస్తాం వంటి విద్వేషపూరిత మాటలు కాదని గుర్తు చేస్తున్నారు.
ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేని పార్టీల అసమర్థ నాయకులంతా రాష్ట్రంలో పాదయాత్రల పేరుతో తిరుగుతున్నారు. ఈ యాత్రలన్నీ వారి స్వలాభం కోసమే తప్ప వారి పార్టీకి కూడా ఏమాత్రం ఉపయోగపడనివి. పాదయాత్రలేకాదు మోకాళ్ల యాత్రలు చేసినా తెలంగాణలో వారు అధికారంలోకి రారన్నది జగమెరిగిన సత్యం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని షర్మిల కూడా పాదయాత్రల పేరుతో సీఎం కేసీఆర్ను ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. విచక్షణ లేని ఇలాంటి నాయకులు కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టి కులాల మధ్య, ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టించి ఓట్లు రాబట్టుకోవాలనుకోవడం ‘దింపుడు కల్లం ఆశ’ తప్ప మరొకటి కాదు.
తెలంగాణ పరిపాలన కార్యక్రమాలు ప్రగతి భవన్ నుంచే జరుగుతాయి. అది ప్రగతి భవన్ కంటే ప్రజాభవన్ గానే అందరూ భావిస్తున్నారు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా అండగా నిలుస్తున్న భవనం అది. అలాంటి ప్రగతి భవన్ను నక్సలైట్స్ పేల్చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనడాన్ని సీనియర్ రాజకీయ నాయకులు సైతం తప్పు పడుతున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, రైతు ప్రతినిధులు, ఆర్టీసీ కార్మికులు, కళాకారులు – ఇలా భిన్న వర్గాలతో సమస్యలను ముఖ్యమంత్రి స్వయంగా చర్చించి, సహపంక్తి భోజనాలు చేసిన గొప్ప భవనమిది. ఈ ప్రజాస్వామ్య సౌధానికి భూమిపై మరే భవనమూ సాటిరాదు.
75 ఏండ్ల స్వతంత్రభారతాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్. తమ పాలనతో దేశాన్ని అన్ని రంగాల్లో వెనుకబడేలా చేసిన ఘనత ఆ పార్టీది. అందుకే దేశ ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా గుణపాఠం చెప్పారు. ఇప్పుడు దేశ ప్రజలు భవిష్యత్ తరాలకు మేలు చేసే దూరదృష్టి గల ఆశావాద నాయకత్వాన్ని కోరుకొంటున్నారు.
తెలంగాణలో వ్యవసాయం ఒక విప్లవంలా సాగుతోంది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలున్నాయి. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. కాళేశ్వరం జలాలతో పంటల దిగుబడులు పెరిగి రైతురాజ్యం నడుస్తున్నది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగిపోయానని పార్లమెంట్లోనే కేంద్రం ప్రకటించిందంటే వ్యవసాయం ఎంత వృద్ధి చెందిం దో చెప్పవచ్చు. ఒకప్పటి బీడుభూములన్నీ పంట పొలాలుగా మారాయి. రైతు కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నది. చెరువులు, బావులు నిండుగా దర్శనమిస్తున్నవి. హైదరాబాద్లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. నల్గొండలో ఫ్లోరైడ్ నీళ్ళ పీడ పోయింది.బతుకు దెరువు కోసం సాగే వలసలు ఆగిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బు ఏండ్లుగా జరగని అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నది.
మౌలిక సదుపాయల కల్పనలో మూ డుసార్లు హడ్కోఅవార్డు, ఆన్లైన్ పర్యవేక్షణకోసం మొబైల్ యా ప్ ను అభివృద్ధి చేసినందుకు 2018లో స్కోచ్ అవార్డ్ లభించింది. మిషన్ భగీరథ పథకం అమలు తీరును పరిశీలించిన కేంద్రం..‘రెగ్యులారిటీ క్యాటగిరీ’లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా గుర్తించి ‘జల్ జీవన్ మిషన్ అవార్డు’కు ఎంపిక చేసింది. ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు 13 రాష్ర్టాల ప్రజా ప్రతినిధులు తెలంగాణలో పర్యటించారు. ఇలా ఎన్నో విజయాలను తెలంగాణ సాధించింది. భవిష్యత్ తరాలకు మార్గాలను నిర్మించేందుకు, తెలంగాణను చరిత్ర పుటల్లో నిలిపేందుకు సీఎం కేసీఆర్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఒకప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ఎట్లుండే. కండ్లముందు కనపడుతున్న అభివృద్ధితో తెలంగాణ ఇప్పుడెట్లా ఉన్నదో మేధావులు, విద్యావంతులు, ప్రపంచానికి చెప్పవలసిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త : వరంగల్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్)
పెద్ది స్వప్న