తల్లి కొలువుకు వడిగ వెళ్ళేను
తల్లికి దండం పెట్టి నిల్చెను
ఎరుకట్టి వ్యవసాయం,
అమ్మ ఎంగిలి ముంత ఎత్తలేను
కొడ్తాను గోల్కొండ పట్టణం
ఢిల్లీకి మోజురవుతాను నేను
మూడు ఘడియల్లో బందరు కొడ్తను
మూలకోట కందనోలు చూచి
బంగారు కడియల్ పెట్టుదును
మనకన్నా బంట్రోతుతనమేల
అడుగో పాపన్న వస్తాడంటే
కుందేళ్లు కులబడేను
లేడి పిల్లలు లేవలేవు
పసిబిడ్డలు పాలు త్రాగారు
నక్కలు, సింహాలు తోక్కుళ్ళాడును
అబ్బా! అబ్బా! పాపనొక్క పేరు చెప్తే
ఊరపిచ్చుక ఊరు చేరదు
కౌజులు కారాడుతుండును
నక్కలు నాట్యము త్రొక్కును
పందికొక్కులు డోలు కొడ్తదో పాపన్నంటే
దొంతికుండలు గంతులేస్తది పాపన్నంటే
పసి బిడ్డలు పాలు త్రాగరుగా పాపన్నంటే
గుర్రాలు గుగ్గిళ్ళు తినవు పాపన్నంటే
తల్లి దర్పణము పొణుకు
గోల్కొండ బస్తీలొణుకు
నెల్లూరి బస్తీలొణుకు
బందరు బస్తీలొణుకు
కడప జిల్లాలొనుకు పాపన్నంటే!!
రెండుగా తల పట్టాలు తొడిగే సర్దార్ పాపన్న
కయ్యానికైతే దూకినాడుగా దండుకేమి
పోడు పోడు పోడు పోడు పోడుమంటాడు సర్దారి పాపన్న
గిర గిర గిర గిరమంటూ పట్టాలు తిరిగినవి
కొడితేను కాపాడియున్నవీ క్రొవ్వినా దేహాలు
నరికితేను పాడియున్నవి శిరసులు పేగులు
అప్పుడు తిన్న పప్పు అన్నమే తెప్పలు పడుతుంది
ఎగిరే వక్క శిరస్సులకు ఏడా సందులేదు
వ్రాలేటిపో శిరస్సులకు ఏడా సందులేదు
కొడితే గోల్కొండ కొట్టాలన్న పాపన్న కత్తికి పదునెక్కువ
సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా సర్వాయిపేటలో క్రీ.శ.1650లో గౌడ కులంలో జన్మించాడు. కులవృత్తితో పాటు పొలం పనులు చేస్తూ సామాన్యుడి జీవితం గడిపాడు. మొగల్ సామ్రాజ్య సైనికులు, భూస్వాములు, జాగీర్దార్లు ప్రజలను అణచివేసే విధానాన్ని చూసి ఆయన ఆలోచనలో మార్పులు వచ్చాయి. ప్రజలు అణచివేతకు గురవుతున్న సమయంలో వారి కష్టాలను చూసి, వారికోసం పోరాటం చేశాడు. ప్రజల నుంచి ఎదిగిన బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. తన తల్లి దగ్గర ఉన్న కొంత సొమ్మును, ఆభరణాలను తీసుకొని తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
భూస్వాముల, జాగీర్దార్ల ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచడం ప్రారంభించాడు. మొదట తాటికొండ చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న జాగీర్దార్ల ఆస్తులను కొల్లగొట్టాడు. ఆ ఆస్తులన్నీ పేద ప్రజలకు పంచాడు. ఆ తర్వాత పెద్దమొత్తంలో సైన్యాన్ని ఏర్పాటుచేసుకొని 1695లో సర్వాయిపేటను స్వాధీనం చేసుకొని, అక్కడ ఒక పెద్ద కోట నిర్మించాడు. పాపన్న మొదట నిర్మించిన కోట ఇదే. ఇక్కడి నుంచే పాపన్న స్వయం పాలన మొదలైంది. 1698లో తాటికొండ కోట, 1700-1705 మధ్యకాలంలో ఖిలాషాపురం కోటలను నిర్మించాడు. ఇలా మొట్టమొదట మూడు కోటలను నిర్మించి ఆయన పాలన ప్రారంభించాడు.
ఈ క్రమంలో రాజుగా ఎదిగాడు. మొగల్ చక్రవర్తి బహుదూర్ షాకు పాపన్న గురించి తెలిసి ఆయనను గద్దె దించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. సంధి కుదుర్చుకున్న పాపన్న రూ.14 లక్షలు పన్నుగా బహుదూర్ షాకు కప్పం కింద చెల్లించాడు. తన ప్రజా ప్రభుత్వాన్ని గుర్తించాలని తన ప్రతినిధిని ఢిల్లీకి పంపాడు. 30 ఏండ్ల పాటు బహుజన రాజ్యాన్ని నడిపిన రాజు పాపన్న. అందుకే తెలంగాణలోని ప్రజలందరి చేత సర్దార్ సర్వాయి పాపన్న అని పిలిపించుకున్నాడు. సాటి మానవునికి హక్కులనేవి లేకుండా పరిపాలిస్తున్న తరుణంలో మొగల్ సామ్రాజ్యాన్ని మెడలు వంచి గద్దె దింపి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న తొలి తెలంగాణ బహుజన రాజు సర్వాయి పాపన్న.
తెలంగాణ ప్రజల మీద ఎన్నో అరాచకాలు చేస్తున్న మొగల్ పరిపాలన తాలూకు భూస్వాముల గుండెల్లో గునపమైండు పాపన్న. ఒక వ్యక్తిగా మొదలై ప్రజలను చైతన్యం చేసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన బహుజన బందూక్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ గడ్డమీద పోరాటం మొదలుపెట్టి రాజ్యాన్ని ఏలిన తొలి బహుజన రాజుగా చరిత్రలో నిలిచిపోయారు. వరంగల్-గోల్కొండ మధ్యలో 21 కోటలను స్థాపించి బురుజులను నెలకొల్పాడు పాపన్న. అన్నిటికి మూలం గోల్కొండ కోట. ఇది మొగల్ పరిపాలనకు స్థానిక కేంద్రంగా ఉండేది. ఇక్కడినుంచే మొగల్ ప్రతినిధులు తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని పరిపాలించేవారు. అందుకే పాపన్న గోల్కొండ కోటను ఆక్రమించాలనుకునేవాడు. అప్పట్లో మొగల్ రాజ్యమన్న, మొగల్ సైన్యమన్న భయపడే పరిస్థితి ఉండేది. ఆ సైన్యాన్ని చూసి రాజపుత్రులు, ప్రజలు ఎందరో తలవంచారు. అలాంటి మొగల్ సైన్యాన్ని ఎదురించి 1709లో గోల్కొండను ఆక్రమించుకున్నాడు. ఆ కోటనేలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొదటి తెలంగాణ బహుజన రాజుగా చరిత్ర సృష్టించాడు.
సర్వాయి పాపన్న తల్లి: వినరా సర్దారి పాప పరవిద్య లెన్ని యైన కుల విద్య సాటి రావు సర్దారిపాప పాపన్న: ఇంటి ఆవుల మేపుమంటది సర్వమ్మ తల్లి ఈత చెట్టు గీయమంటాది సర్వమ్మ తల్లి తాటికల్లే కట్టమంటది సర్వమ్మ తల్లి ఈత కల్లే కట్టమంటది సర్వమ్మ తల్లి ఈత బెల్లము వండమంటాది సర్వమ్మ తల్లి.
ఈదులు గీస్తే ఇండ్రవాడు
కల్లు కట్టితే గవాళ్ళవాడు
కత్తిపడితే మేదరివాడు
కుండ పడితే కుమ్మరివాడు
మొనగాడిచ్చట మెచ్చునా సర్వమ్మ తల్లి
పాలేగాడిచ్చట మెచ్చునా సర్వమ్మ తల్లీ
ఊరు కొడితే ఏమి ఫలం
పల్లి కొడితే ఏమి ఫలము
కొడ్తే గోల్కొండ కొట్టాలే సర్వమ్మ తల్లి!
నెల్లూరి బస్తీలు కొట్టాలే సర్వమ్మ తల్లి
కందనోలు మహాలు కొట్టాలే సర్వమ్మ తల్లి
మైసూర్ దేశం కొట్టాలే సర్వమ్మ తల్లి
మీసం గిరగిరా తిప్పేను సర్దారి పాపన్న…
దళిత, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన మొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఛత్రపతి శివాజీ ఉత్తర భారతంలో విదేశీయుల నుంచి దేశాన్ని కాపాడి సంప్రదాయ బూజు పట్టిన వ్యవస్థపై తిరుగుబావుటా ఎగురవేసి, స్వరాజ్యాన్ని సాధిస్తున్న సమయంలో, దక్షిణాదిన భూస్వామ్య, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటుచేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన, మైనారిటీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించినవాడు పాపన్న. అందుకే సర్దార్ సర్వాయి పాపన్నను తెలంగాణ శివాజీగా అభివర్ణించవచ్చు.
(సర్దార్ సర్వాయి పాపన్న జయంతి నేడు)
ముచ్కుర్ , సుమన్ గౌడ్