ఈ నెల 18న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ను ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన భాగస్వామ్య పక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండానే కేంద్రం మొండిగా ముందుకువెళ్తున్నట్లు అవగతమవుతున్నది.ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలు, వినియోగదారులు, ఉద్యోగ సంఘాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
రాజ్యాంగం ప్రకారం ‘విద్యుత్’ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అంశం. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకురానున్న బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ గతంలోనే తీర్మానం చేసింది. అంతేకాకుండా, ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని కొన్ని ఇతర రాష్ర్టాలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశాయి. రాష్ర్టాల్లోని విద్యుత్ పంపిణీ వ్యాపార వ్యవహారాలను ప్రభుత్వరంగ డిస్కంలు నిర్వహిస్తాయి. వీటికి పోటీగా కేంద్రం బహుళ ప్రైవేట్ సంస్థలను అనుమతించడమే ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ చట్ట సవరణలో ముఖ్యమైన అంశం. బహుళ ప్రైవేట్ సంస్థలు వీలింగ్ చార్జీలను నామమాత్రం చెల్లించి ప్రభుత్వ నెట్వర్క్ను విశృంఖలంగా వాడుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన నెట్వర్క్తో ఈ ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ డిస్కంలు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి కొంతమేరకు ఎక్కువ చార్జీలు వసూలు చేసి, కొంత లోటును సబ్సిడీల రూపంలో ప్రభుత్వం నుంచి సేకరిస్తాయి. తద్వారా పేద ప్రజలకు విద్యుత్ను అందిస్తాయి. కేంద్రం తెచ్చే చట్టం అమలులోకి వస్తే ప్రభుత్వ డిస్కం ఆధీనంలో గ్రామీణ, వ్యవసాయ వినియోగదారులు మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా ప్రభుత్వ డిస్కంలు ఆర్థికంగా నష్టపోయి సామాజిక, ఆర్థిక అసమానతలు ఏర్పడుతాయి. సరళీకృత ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా ఒక మెగావాట్కు పైగా విద్యుత్ వాడకం చేసే హెచ్టీ పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల ఆధీనంలోకి వెళ్లిపోతారు. రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ కాకుండా జాతీయ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఆ రాష్ట్ర కమిషన్ ప్రమేయం లేకుండానే అనుమతులు మంజూరవుతాయి.
విద్యుత్ కొనుగోళ్లు, కేటాయింపులు జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఎన్ఎల్డీసీ పరిధిలోకి వెళ్లిపోవడంతో విద్యుత్ సరఫరా, పంపిణీ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. ఆశ్చర్యమేమంటే సవరణ బిల్లును ఇప్పటివరకు సంబంధిత మంత్రిత్వశాఖ తమ అధికారిక వెబ్సైట్లో పెట్టకపోవడం. ఈ బిల్లు లక్ష్యాలను, సవరణకు గల కారణాలను పేర్కొనకుండా భాగస్వామ్యపక్షాల వాదనలు వినకపోవడం శోచనీయం. ఇటువంటి కీలక బిల్లులను సంబంధిత స్టాండింగ్ కమిటీకి పంపించి, సుదీర్ఘ చర్చల తర్వాత, అన్ని భాగస్వామ్యపక్షాల ఆమోదయోగ్యంతో పార్లమెంటు ముందుకు తీసుకురావాలి. కానీ, కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దీంతో కేంద్రం వైఖరి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కోటి 22 లక్షల మంది గృహ వినియోగదారులున్నారు. గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో 76 లక్షల మంది వినియోగదారులున్నారు. ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ ద్వారా వీరి భవిష్యత్ తీవ్ర ఆందోళనకరంగా మారనున్నది. ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ అమల్లోకి వస్తే దేశంలోని ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ బిల్లుతో సామాజిక అసమానతలకు, సామరస్యానికి విఘాతం కలిగించే ప్రమాదమున్నదని ‘పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ సర్వీసెస్’ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఈ విధానాన్ని దేశ ఫెడరల్ వ్యవస్థపై దాడిగా అభివర్ణిస్తున్నారు.
ఒకే ప్రాంతంలో బహుళ ప్రైవేట్ కంపెనీలను వ్యాపారానికి అనుమతించడం అనే ప్రక్రియను ప్రయోగాత్మకంగా ముంబైలో చేపట్టారు. అదానీ, టాటా పవర్ కంపెనీలు సంయుక్తంగా విద్యుత్ వ్యాపారం చేస్తుండగా, దేశంలోనే యూనిట్ రేటు రూ.12-14 దాకా వసూలు చేస్తుండటం విస్మయాన్ని కలిగిస్తున్నది. రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఏరియాను చట్టంలో నిర్వహించకపోవడం కీలక లొసుగు.
కేంద్రం తీసుకురానున్న ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ కార్పొరేట్ శక్తుల చేతుల్లో రూపుదిద్దుకున్నది. ఒకవైపు దేశంలో సోలార్ పవర్ లక్ష్యాన్ని ఏకంగా 500 గిగావాట్లకు పెంచడం, మరోవైపు ఈ రంగంలోకి అంబానీ, అదానీలు రావడం గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతున్నది. దేశానికి అన్నం పెట్టే రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న రాష్ర్టాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వని కేంద్రప్రభుత్వం సోలార్ ప్లాంట్లు నిర్మించే బడా కార్పొరేట్లకు మాత్రం భారీ ఆర్థిక రాయితీలు ఇస్తున్నది.
పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు కీలకమైనవి. పెట్టుబడులను సమకూర్చగల సామర్థ్యం జర్మనీకి ఉన్నది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమం కోసం భారతదేశానికి 10 బిలియన్ యూరోల సహాయం చేయడానికి జర్మనీ అంగీకరించింది. అది కూడా మన ప్రధాని ఆ దేశ పర్యటనలో ఉన్నప్పుడు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలు పునరుత్పాదక ఇంధనరంగంలో గత కొంతకాలంగా భారీ పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం. అదానీ పర్యావరణ పరిరక్షణ పేర దేశ విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రముఖ స్థానం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో 10 గిగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా పోటీ పెరిగి వినియోగదారులకు మేలు జరుగుతుందని కేంద్రం డాంబికంగా చెప్తున్నది. కానీ, ఈ బిల్లుతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసే పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం మినహా ప్రయోజనం శూన్యమని స్పష్టంగా అర్థమవుతున్నది.
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)
తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313