తెలంగాణ తెచ్చిన మలి ఏడాది. వసంత కాలం. అప్పటి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకొనే తంతు జోరుమీదుంది. మెదక్ జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకునే ప్రక్రియ అది. కార్యస్థలం మెదక్ పట్టణం. బాధ్యుడు హరీశ్రావు. శోధకుడు పోచారం శ్రీనివాసరెడ్డి (అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి). అప్పటి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ధూం ధాం ఏర్పాట్లు చేశారు. తెల్లారితే కార్యం.. కానీ, కోడికూత పొద్దుకు జడివాన కొట్టింది.. వడగండ్లు పడ్డయి.
పూల దండలు, డప్పు, దరువులతో మెదక్ అంతా రంజు మీదుంది. హరీశ్రావు వచ్చారు. కానీ, కారు ఆగలేదు. అందులోనే పోచారం ఉన్నరు. కారు నర్సాపూర్ చౌరస్తా దాటింది.. సభావేదిక మళ్లింది. మంబోజిపల్లి, కొత్తపల్లి దాటి పాపన్నపేట మండలం కుర్తివాడ ఏటిగడ్డ పంట పొలాల్ల ఆగింది. నేను, నాతో పాటు అప్పటి సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మంత్రి కారును వెంబడించినం. అప్పుడు నేను ఓ పత్రికకు ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో ఇన్చార్జిగా పని చేస్తున్న.
అది ఏటిగడ్డే కానీ బోర్ల కింది కాపురం. ఎప్పుడూ బోర్ల పడ్డట్టే ఉండేది. రైతుది నిత్తె గుంజాటన. సేతానం సేతికొచ్చేదాక మిడుకుడు బతుకే. ఎగిలివారంగ పడ్డ వడగండ్ల వానకు ధాన్యం తడిసింది. పొలం మీది వడ్లు రాలినయి. వెన్ను విరిగిన పంటచేను చూసి సేద్యకారులు గుండెలు బాదుకుంటున్నరు. గొంతు పొలమారి పోయేటట్టు వగపోస్తున్నరు. అగో..! వాళ్ల వెన్ను తట్టనికే హరీశ్రావు వచ్చిండ్రు. పొలాలన్ని కలియ తిరిగిండు. కల్లం మీది వడ్లు చూసిండు. ‘అంకుల్.. మీరు అధికారులను అలర్టు చేయండి.. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుత’ అని అన్నరు హరీశ్రావు.
ఎవరి ఫోన్లో వాళ్లు మంత్రాంగం నడిపిండ్రు. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రాలిన వరికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు హరీశ్ అదే పంటపొలంలో ప్రకటించారు. ఎల్లమ్మ అనే మహిళ హరీశ్రావు కాళ్ల మీద పడ్డది. రెండు చేతులు పట్టి లేపితే.. ఎద నిండా హత్తుకున్నది. అప్పటికీ ఆమె దుఃఖంతో ఎగపోస్తూనే ఉన్నది. గుండె నిబ్బరం తాలూకు వగపోత అది.
2014-15లో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రెండు సీజన్లకు కలిపి 35 లక్షల ఎకరాల్లోనే వరి సాగు ఉండేది. కేసీఆర్ కొలువు కూటం ఎక్కినంక మిషన్ కాకతీయ, కాళేశ్వరం, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టెంపాడు, సీతారామ సాగర్ ప్రాజెక్టులు జీవం పోసుకున్నయి. వాటికి ఉచిత కరెం టు, రైతుబంధు తోడైనయి. ప్రకృతి తోడ్పాటునిచ్చిం ది. అన్ని కలగలిసి పంజాబ్ను తలదన్నేంత పంట కాదు, భూమికి బరువయ్యేంత పంట పండింది. ఇది ఎంతవరకు ఎదిగిందంటే! కేసీఆర్ దిగిపోయే నాటికి అనగా.. 2022-23 నాటికి ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి ఏకంగా 1.22 కోట్ల ఎకరాలు సాగై 3 కోట్ల టన్నుల ధాన్యం వచ్చింది. పోయిన యాసంగిలో 1.20 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి ఎల్లింది.
ఇప్పుడు కాలం మారింది. కాల్వ ఆగింది. సాగు భూమి తగ్గింది. అంతా కలిపి యాసంగికి 65 లక్షల ఎకరాలే సాగయ్యాయి. దీంట్లె పొట్ట మీద నీళ్లు లేక, అదును మీద కరెంటు రాక లక్షన్నర ఎకరాలు బొందు వడ్డది. అకాల వర్షాలు, వడగండ్లతో మరో 50 వేల ఎకరాలు పోయింది. ఈత కొయ్యల కష్టాలన్ని దాటుకొస్తే.. ధాన్యం 85 లక్షలు టన్నులు మించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆటపాటల మీద ధాన్యం కొనుగోలు చేయవచ్చు. కానీ, దీన్ని కూడా కొనలేని దైన్యం పాలకులది. సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటం, వరుసగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం, దొడ్డు వడ్ల మీద ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే.. అందులో సన్నాలు 8 నుంచి 10 లక్షల టన్నులకు మించవు. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో, మహబూబ్నగర్ జిల్లా కృష్ణా తీరం వెంట ఒక లక్ష ఎకరాలు, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ కింద 2 లక్షల ఎకరాల్లో సన్నాలను పండించారు.
డిమాండ్కు తగ్గ దిగుబడి లేకపోవడం వల్ల మిల్లర్లు, వ్యాపారులు నేరుగా కల్లాల మీదకు ఎగబడ్డరు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాపారులు వచ్చి కొంటున్నారు. పచ్చి వడ్లకు క్వింటాల్కు రూ.2,700 నుంచి రూ.3,000 వరకు నగదు పెట్టా రు. ఇది కొంత మెరుగైన ధరే కావటం, ఒకటి రెండు రోజుల్లో డబ్బు చేతికి వస్తుండటంతో.. రైతులు కూడా విక్రయిస్తున్నారు. 80 శాతం సన్నాలను వ్యాపారులు, మిల్లర్లే కొనుగోలు చేశారు. మిగిలేవి 20 శాతం. దీనికి మాత్రమే బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పటం అభ్యంతరకరం.
రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు పెట్టి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, మద్దతు ధర, కొనుగోళ్లు రైతులను ఆదుకునే స్థాయిలో లేవు. అకాల వర్షాలు ఆగం చేసినయి. కల్లాల మీది ధాన్యం, కాంటాకు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. ఈ ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా, కొనుగోలు చేయకుండా తాత్సారం చేయటంపై రైతాంగం మండిపడుతున్నది.
‘మార్కెట్ తెరిపించురి సారు’ అని ఒక మహిళ ఇటీవల పోలీసుల కాళ్లు మొక్కుతున్న దృశ్యం జనగామ మార్కెట్ యార్డులో కనిపించింది. అది ధాన్యానికి మద్దతు లేని రైతు దైన్యానికి సచిత్రిక. ఆ వలపోత ప్రతి హృదయాన్ని తాకింది. తొలి ముఖ్యమంత్రి హృదయాన్ని కదిలించింది. తాను రైతుల పక్షం నిలబడ్డడు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిండు. అన్నదాత గుండె చప్పుడు పాలకులు వినాలె. ఏ ఒక్క రైతు గుండె ఆగిపోకముందే మద్దతు ధరతో ప్రతి గింజను కొనుగోలు చేయాలె.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు