తెలంగాణ నల్ల నేల పీఎం గో బ్యాక్ అంటున్నది. ప్రభుత్వ రంగమే వద్దని చెప్పే మోదీ ఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించడానికి వెనక ఉన్న రాజకీయాలేమిటని ప్రశ్నిస్తున్నది. ఈ సారైనా సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిరసనల సెగ తప్పదని హెచ్చరిస్తున్నాయి.
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీని తెలంగాణ సమాజం మొత్తం ప్రశ్నిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆయనకు మంచి అభిప్రాయం లేదు. వాటిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టినట్లు ప్రవర్తిస్తున్నది. రైల్వేలు, ఎయిర్ పోర్టులు, ఓడరేవులు, విద్యుత్తు కేంద్రాలు, హైవేలు, బ్యాంకులు, ఎల్ఐసీ ఇలా ఎక్కడెక్కడ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మడమో, లీజుకు ఇవ్వడమో చేస్తున్నారు. ఉద్యోగాల సృష్టి, సంస్థల పరిరక్షణ కోసం నాటి ప్రధాని ఇందిరా గాంధీ జాతీయీకరణ భావన తీసుకొస్తే నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఆ లక్ష్యాన్ని, భావనను తుంగలో తొక్కేస్తున్నారు. ఒక చేత్తో ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ, మరో చేత్తో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు.
ప్రభుత్వ రంగమే వద్దని చెబుతున్న ప్రధాని ఒక ప్రభుత్వ రంగ సంస్థను జాతికి అంకితం చేయడానికి రావడం ఏమిటి? ఏడాది క్రితం నుంచే ఉత్పత్తి చేస్తున్న ఈ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించడం, దాన్ని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పడంలో పక్కా ప్రణాళికతో కూడిన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి అని చెప్పిన పీఎం ఒక ప్రభుత్వ రంగ కంపెనీని జాతికి అంకితం చేయడానికి రావడం ద్వారా ఏమి సందేశం ఇవ్వదలిచారు? ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కు తీసుకుంటామని చెబుతారా లేక ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్పరం చేయబోమని చెబుతారా? పక్కన ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గు గనులు ఉన్న ప్రాంతం రామగుండం. ఓ రెండు కిలోమీటర్లు గోదావరి వంతెన దాటితే మంచిర్యాల జిల్లా అంతా బొగ్గు బావులు, సింగరేణికి చెందిన 1200 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్, సిమెంట్, సిరామిక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సింగరేణి నుంచి ఏటా కేంద్రం, రాష్ట్రం, రాయల్టీని, డివిడెంట్ను, ఇతర పన్నులను పొందుతూనే ఉన్నాయి. ఈ మొత్తం రూ.3 వేల కోట్లకు పైగానే ఉంటుంది. సింగరేణి సొంత బొగ్గు అన్వేషణ విభాగం ఇప్పటికే 10 వేల మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిక్షే పాలను గుర్తించింది. ఇవి 100కు పైగా బొగ్గు బ్లాకుల కిందకు వస్తాయి.
రెండు దశాబ్దాలుగా లాభాల్లో ఉన్న బొగ్గు సంస్థల్లోని ఉద్యోగులకు 3 శాతం కన్నా ఎక్కువ జీతం పెంచేది లేదని కేంద్రం చెబుతున్నది. ఇలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై కార్మికులు భగ్గుమంటున్నారు. అందుకే రామగుండానికి వస్తున్న ప్రధాని పర్యటనలో నిరసనలకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణకు సింగరేణి గుండె కాయ లాంటిది. ఏటా వేలాది మందికి ఉపాధికి కల్పించే సంస్థ. దేశంలో 500 బొగ్గు బ్లాకులను వేలం వేసి తద్వారా రూ.1.65 లక్షల కోట్ల ఆదాయం సాధించడానికి కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని బ్లాకులు వేలం వేసి రూ.30 వేల కోట్ల వరకు కేంద్రం తన ఖజానాలో వేసుకున్నది. స్వయంగా ప్రధానే ఈ వేలాన్ని ప్రారంభించారు. సింగరేణి దరఖాస్తు చేసుకున్న 4 బ్లాకులలో కోయగూడెం బ్లాకును అరబిందో కంపెనీకి కేంద్రం ఇచ్చేసింది. బొగ్గు బ్లాకులు కావాలంటే సింగరేణి, కోల్ ఇండియా లాంటి ప్రభుత్వ సంస్థలైనా వేలంలో పాల్గొనాల్సిందేనని కేంద్రం కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేశారు. సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయితే కార్మికుల సమ్మెను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్రం అవమానించింది.
ఇటీవల 4 ఏండ్లలో 44 కార్మిక చట్టాల్లో కేంద్రం మార్పులు చేసింది. తద్వారా కార్మికుల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నది. కార్మిక సంఘాల ఉద్యమాలు, పోరాటాలను గుర్తించి వాటితో చర్చలు జరిపే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం ఏనాడో మానేసింది. బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం జులై 2021 నుంచి అమలు కావాల్సి ఉండగా జేబీసీసీఐ-11లో జరుగుతున్న చర్చలను కేంద్రం సాగదీస్తున్నది.
రెండు దశాబ్దాలుగా లాభాల్లో ఉన్న బొగ్గు సంస్థల్లోని ఉద్యోగులకు 3 శాతం కన్నా ఎక్కువ జీతం పెంచేది లేదని కేంద్రం చెబుతున్నది. ఇలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై కార్మికులు భగ్గుమంటున్నారు. అందుకే రామగుండానికి వస్తున్న ప్రధాని పర్యటనలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నాకే ప్రధాని రామగుండానికి రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాలు మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని పేర్కొంటున్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రధాని పర్యటన ఏర్పాట్లలో బీజేపీ కేంద్ర మంత్రులు, నేతలు నిమగ్నమయ్యారు. ప్రధాని మోదీ తాను గతంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే కార్మికుల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి నిరసన ఎదుర్కొక తప్పదని గ్రహించాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
ఎండీ మునీర్
99518 865223