‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (యన్సీ ఆర్బీ)-2021’ నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 42,004 మంది రోజువారీ కూలీలే ఉండటం అత్యంత బాధాకరం. 2014లో 12 శాతంగా ఉన్న రోజువారీ కూలీల ఆత్మహత్యలు, 2021 నాటికి 25 శాతానికి చేరింది. ఇది దేనికి సంకేతం? ఓ పక్క సెన్సెక్స్ సూచికలు పైకి ఎగబాకుతున్నాయి. మిలియనీర్ల సంఖ్య వేల సంఖ్యలో పెరుగుతున్నది. జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా లక్షల కోట్ల రూపాయలుగా ఉంటున్నాయి, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను మనం వెనక్కు నెట్టాం. ఇవన్నీ చూస్తుంటే మన దేశాభివృద్ధి ‘మేడిపండు చూడ మేలిమై ఉండు’ అన్న చందంగా ఉన్నది.
రోజులో కనీసం ఒక పూట తిండిలేని ప్రజలు దేశంలో కోకొల్లలు. ఆకలి కేకలు, పోషకాహార లోపంతో సగంమంది ప్రజలు బాధ పడుతున్నట్లు పలు నివేదికలు చెప్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణమైతే, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం మరో కారణం. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు గత రెండేండ్లుగా కరోనా కారణంగా పలు పరిశ్రమలు, నిర్మాణ రంగం కుదేలయ్యాయి. రోజువారీ పనులు, ఈవెంట్ ఇండస్ట్రీ, పర్యాటక రంగం వంటివి నైపుణ్యం లేని వర్కర్లకు, కొన్ని నైపుణ్యాలు మాత్రమే గల శ్రామికులకు పని కల్పించేవి. కరోనా లాక్డౌన్, కర్ఫ్యూలతో మొత్తం ఆర్థిక, కార్మిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వలస కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. క్రెడిట్ కార్డులు, లోన్ యాప్లు వాడుతూ, చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటుండటం మనం చూస్తున్నాం.
సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీలో కల్యాణీపూరీ జాలేబి చౌక్ వద్ద ఉదయాన్నే 200 మంది పనులు కోసం గుమిగూడుతారు. వారిలో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే పని దొరుకుతుంది. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరుగుతారు. వారానికి కనీసం రెండు రోజులు కూడా పని దొరకడం లేదని ఆ కూలీలు తెలుపడం బాధాకరం. కరోనా తర్వాత నేటికీ అన్ని రంగాలు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అదే సమయంలో స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి రాలేదు. దీంతో ప్రచ్ఛన్న నిరుద్యోగం పడగ విప్పింది.
సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీలో కల్యాణీపూరీ జాలేబి చౌక్ వద్ద ఉదయాన్నే 200 మంది పనులు కోసం గుమిగూడుతారు. వారిలో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే పని దొరుకుతుంది. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరుగుతారు. వారానికి కనీసం రెండు రోజులు కూడా పని దొరకడం లేదని ఆ కూలీలు తెలుపడం బాధాకరం. కరోనా తర్వాత నేటికీ అన్ని రంగాలు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అదే సమయంలో స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి రాలేదు. దీంతో ప్రచ్ఛన్న నిరుద్యోగం పడగ విప్పింది. కష్టానికి తగ్గ వేతనాలు రాక, కుటుంబాలను పోషించడం కత్తి మీద సాములా మారింది. పిల్లల చదువులు భారంగా మారాయి.
పలు రకాల అనారోగ్యాలు, తల్లిదండ్రుల సంరక్షణ వేతన జీవులపై పెను ప్రభావం చూపుతున్నాయి. దీంతో నిస్సహాయ స్థితిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 32% మంది కుటుంబ సమస్యలతో తనువు చాలించినవారే. ఒడిశాలో 4,033 మంది అత్యధికంగా కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్, సిక్కింలలో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నవారు ఎక్కువగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నవారిలో 1,09,749 మంది వివాహితులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికంగా 22,207 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 72% మంది పురుషులు, 27% మంది మహిళలు. 2020తో పోలిస్తే 2021 నాటికి ఆత్మహత్యలు 7.2 శాతం పెరిగాయి.
‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్’ కింద అర్హులకు ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నాయి. కానీ అందరికీ అవి సరిగా అందడం లేదు. దీంతో ఆకలి బాధతో కొందరు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలు నివేదికలు చెప్తున్నాయి. కేవలం ఈ ఏప్రిల్-జులైల మధ్యకాలంలో నిర్మాణం రంగంలో 15 శాతం వేగం మందగించింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలుచేసి ప్రతి నిరుద్యోగికి పని కల్పించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’, ‘గతిశక్తి’ వంటి పథకాల ద్వారా ఎంస్ఎంఈ పరిశ్రమలను, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి. పైపై అభివృద్ధి సూచికలు చూసి మురిసిపోకుండా, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి.
దేశంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు గుర్తించి, వారి అభివృద్ధికి కృషిచేయాలి. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చుచేయాలి. ప్రజలందరికీ సామాజిక, ఆర్థికభద్రత అందించటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలి. పన్నుల వ్యవస్థను పునఃసమీక్ష చేయాలి.
స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాం గ నిర్మాతలు ఆశించిన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద భావాలను అమలు చేస్తూ, సమాఖ్య వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం నేటి పాలకులపై ఉన్నది. దేశం వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల నాటికైనా ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడానికి నేటి పాలకులు కంకణం కట్టుకోవాలి. అదే మన అందరి ఆశయం కావాలి. ఈ దేశ పాలకులు ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.
ఐ.ప్రసాదరావు
63056 82733