‘అహింసా పరమో ధర్మః!’ అనేది ఉపనిషద్ వాక్యం. ఈ మహత్తర ధర్మాన్ని తన జీవితంలో ఆచరించి, మానవాళిని పరిపుష్టం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన జీవనతత్వం సర్వులకు స్ఫూర్తివంతం, దీప్తివంతం.
‘చరకా యంత్రం చూపించి/ స్వదేశీ సూత్రం నేర్పించి/ గుప్పెడు ఉప్పును పోగేసి/ నిప్పుల ఉప్పెనగా చేసి’ అని కవితాత్మకంగా గాంధీజీని ఆవిష్కరించేరు సినీ గేయకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. గాంధీ పదాన్ని, విధాన్ని, విధానాన్ని, తత్వాన్ని, తాత్వికతను వివరిస్తూ… ‘రామ నామమే తలపంత/ ప్రేమ ధామమే మనసంతా/ కర్మయోగమే జన్మంత/ ధర్మక్షేత్రమే బతుకంతా..’ అంటూ కవితాత్మకతతో, తాను గాంధీజీని దర్శించి, లోకానికి దర్శనం చేయించారు సీతారామశాస్త్రి. ‘భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ’ అని గాంధీజీని సిరివెన్నెల నిర్వచించేరు. అంతటి విశిష్టమైనది గాంధీ తత్వం.
మహాత్ముని గురించి ‘ఆంగ్లేయుల రాక్షస అణచివేతకు వ్యతిరేకంగా, గాంధీజీ ప్రదర్శించిన త్యాగనిరతి, అంకితభావం, దక్షిణాఫ్రికాకు, యావత్ ప్రపంచానికి గొప్ప వారసత్వం’ అని అన్నారు నెల్సన్ మండేలా. అంతేకాకుండా ‘భారతీయులు లోకానికి మోహన్దాస్ కరంచంద్ గాంధీని ఇచ్చేరు. దక్షిణాఫ్రికా వాసులు మహాత్మాగాంధీజీని లోకానికి అందించేరు’. అని వినమ్రంగా గాంధీజీని శ్లాఘించారు మండేలా. అవును, దక్షిణాఫ్రికా వెళ్లిన తర్వాతే కదా? గాంధీలో విభిన్నమైన పెనుమార్పు వచ్చింది. నాయకత్వ పటిమ, కార్యదీక్ష , స్వాతంత్య్ర కాంక్ష, పరివర్తనాక్రమం వేళ్ళూనుకున్నది.
‘గాంధీజీ కండ్ల వెనుక ఏముందో, ఏ సుదూర నేల ఆ కండ్లను బంధించిందో, మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆయన మాకు తరచూ అవగాహన అవుతుండరు. గాంధీజీతో మేం వాదిస్తాం. ఒక్కొక్కప్పుడు గాంధీజీపై కోపగిస్తాం కూడా సమచిత్తం కోల్పోయినందుకు, ఆ తర్వాత మేం చాలా సిగ్గు పడుతుంటాం’ గాంధీజీపై జవహర్లాల్ నెహ్రూ ఇలా చెప్పారు. గాంధీజీ ఋజువర్తనాన్ని, అంతర్గత శక్తిని, అంకితభావాన్ని, మనో ధైర్యాన్ని, గాంధీజీ ఇతరులపైన వేసిన బలమైన ముద్రను, ఇతరులను ప్రభావితం చేసిన తీరునూ చెప్పకనే చెప్తాయి నెహ్రూజీ మాటలు. ఆటంకాలెన్ని ఎదురైనా ఒక దీక్షగా, ఓ మనో తపస్సుగా, సంకల్ప బలంతో ముందుకు కదిలారు గాంధీజీ. మానవాళికి ఆయన అందించిన విలువలు అనుసరణీయం, ఆరాధ్యనీయం.
గాంధీ సమస్త మానవ కోటికి చెందినవారు. బుద్ధుని తర్వాత మానవ సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిన మహా పురుషుడు గాంధీ ఒక్కరే. ‘ఆయన విధానం, ఇచ్చిన సందేశం నేడు సమస్త ప్రపంచానికి, సర్వ మానవ కోటికి మార్గదర్శకం’ అంటారు రాహుల్ సాంకృత్యాయన్ మహాశయుడు. ‘పిడుగు పడితే పాడయ్యేది ఒక ఊరో ఒక వాడో, అగ్నిపర్వతం బద్ధలైతే బూడిదయ్యేది ఒకటి రెండు పరగణాలే. భూకంపం సంభవిస్తే ఒక రాష్ట్రమో, ఒక దేశమో. ప్రకృతి ప్రదర్శించిన, ఈ భయానక రూపాల కంటే శతాధికంగా, సహస్రవిధాలుగా భయానకమైనది మహాత్మా గాంధీ’ అన్నారు గాంధీ హత్యమీద రాసిన సంపాదకీయంలో ప్రముఖ సంపాదకులు స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు.
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అహింసలు మానవ రూపంలో ఈ ధరాతలంలో నడయాడి, సమస్త మానవాళికి ఓ సందేశంలా నిలిస్తే, ఆ రూపం పేరు మహాత్మా గాంధీ. జీవితాన్ని, సత్యం, అహింసల జీవనవ్రతంగా సాగించి తన జీవితమే తన సందేశమని లోకానికి చాటిచెప్పిన జగజ్జేత మహాత్మా గాంధీ. ఆయన వ్యక్తిత్వంలో, జీవనంలో సేవకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు. కింకరుడు కానివాడు శంకరుడు కాలేడు. సేవే సర్వం, సేవే సకలం, సేవే సర్వస్వం అని ఆచరించి చూపారు గాంధీజీ. నువ్వెలా జీవించేవో నీ చేతలు చెప్పాలి, నువ్వెలా మరణించేవో ఇతరులు చెప్పాలంటారు గాంధీజీ. భగవద్గీత సారం, భారతీయత, మానవత, దేశభక్తి, సత్యసంధత, జాతీయభావాల కలబోత గాంధీ తత్వం.
‘గాంధీ మహాత్ముని లాంటి నరుడొక్కడు ఈ ధరాతలంలో, నడయాడిన ఈనాటి సంగతి, భావితరాలకు నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు’ అన్న ఐన్స్టీన్ వ్యాఖ్యలు గాంధీజీ మహోన్నతతకు నిలువెత్తు నిదర్శనం. మహిమాన్విత మానవతా మూ ర్తిత్వం గాంధీజీది. గాంధీజీ సత్యనిరతి, కార్యదీక్ష, సత్యాగ్రహం, నాయకత్వ మార్గదర్శనం, వ్యక్తిత్వం, సేవాభావం, జాతి యావత్తుకూ మార్గదర్శకం. సమస్తజనులకు మంగళాశాసనం.
రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669