ఇటీవల భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు మీడియా అకాడమీ శిక్షణా తరగతులు నిర్వహించింది. క్లాసులు చెప్పడానికి నాతోపాటు సీనియర్ జర్నలిస్టులు గొర్ల బుచ్చన్న, వర్దెల్లి వెంకటేశ్వర్లు, విష్ణువర్థన్రెడ్డి అక్కడికి వెళ్లాం. క్లాస్లు అయిన తర్వాత ఓ సాయంత్రం పాలంపేట దగ్గరున్న రామప్ప దేవాలయాన్ని సందర్శించాము. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాకు మార్గ నిర్దేశనం చేశారు. చరిత్రతోపాటు అనేక విషయాలను మాతో ఆయన పంచుకున్నారు. తెలంగాణలో వచ్చిన మార్పుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ రామప్ప చెరువును చేరుకున్నాం.
కనుచూపు మేరంతా జలకళ కనిపించింది. ఇటీవల వచ్చిన వరదలతో ములుగు రోడ్డుపై కొన్ని ఫీట్ల ఎత్తులో వరద పారిందని అక్కడి జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు. వెయ్యేండ్లు దాటినా చెరువు సజీవంగా ఉన్నది. గత చరిత్రపు ఘన వైభవానికి ప్రతీకగా సరి కొత్త హంగులు అద్దుకుని కనువిందు చేస్తున్నది. పక్కనే.. ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం. కాకతీయులు పాటించిన టెంపుల్, ట్యాంక్, టౌన్ (ఆలయం, చెరువు, పట్టణం) సూత్రానికి ప్రతీక పాలంపేట. ఇన్ని వందల యేండ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంతటి విజన్తో ముందుకెళ్తున్నది. స్వరాష్ట్రం వచ్చిన వెంటనే మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత చేపట్టింది. అనేక చెరువులు బాగుపడ్డాయి. భూగర్భ జలాలు పెరిగాయి. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకోవడం (రివర్స్ మైగ్రేషన్) సాధ్యమైంది.
మరోవైపు, దేవాలయాల పునః
నిర్మాణమూ భారీ స్థాయిలో జరుగుతున్నది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని యావత్ దేశం ఆశ్చర్యపోయే రీతిలో తెలంగాణ ప్రభుత్వం పునఃనిర్మించింది. భద్రాచలం, వేములవాడ గుడులకూ పునర్ వైభవం తీసుకొచ్చేలా దశలవారీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
కాకతీయులు అప్పట్లో నిర్మించిన చెరువుల కారణంగా 14వ శతాబ్దం తర్వాత తెలంగాణలో ధాన్యపు సిరులు మెరిశాయని చరిత్ర చెబుతున్నది. అప్పట్లోనే ఎగుమతులు దిగుమతులు జరిగేవని తెలుస్తోంది. వరి ధాన్యం, బెల్లం, మామిడి పళ్లు, నూలు వస్ర్తాలు, పట్టు వస్ర్తాలు, ముత్యాలు వంటివాటిని కాకతీయ ప్రభువుల కాలంలో ఎగుమతి చేసేవారని చరిత్ర వెల్లడిస్తున్నది. అదే విధంగా నేడు తెలంగాణ స్వయంపాలన ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంటోంది. అనేక కంపెనీలు నేడు తెలంగాణ ప్రాంతంలో తమ పరిశ్రమలను నెలకొల్పాయి. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. తొమ్మిదేళ్ల కాలంలో వచ్చిన గుణాత్మకమైన మార్పు ఇది.
గత పాలన వారసత్వాన్ని కొనసాగిస్తూ రావటం సాధారణ విషయమేమీ కాదు. దానికి చాలా పట్టుదల కావాలి. అంతకు మించిన సంకల్పం ఉండాలి. ఇదే భూపాలపల్లి, ములుగు ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించి కాకతీయుల నిర్మాణ కౌశల వారసత్వాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్. జలకళతో కళకళలాడుతున్న చెరువులకు అదనపు హంగులు అద్దడంతో అవి దేదీప్యమానంగా తయారవుతున్నాయి. తీగ వంతెనలు, పర్యాటకశాఖ వారి బోటింగ్లు, చెరువు కట్టలను మినీ ట్యాంక్బండ్లుగా తీర్చిదిద్దడంతో వాటి శోభ మరింత ఇనుమడిస్తున్నది.
రహదారుల విషయంలోనూ తెలంగాణ గొప్ప అభివృద్ధిని సాధించింది. హైదరాబాద్ నుంచి భూపాలపల్లి వరకు మధ్యలో కొద్ది దూరం తప్పితే, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణించేలా సౌకర్యవంతమైన రోడ్ల నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా కేవలం తొమ్మిదేళ్లలో సాధ్యమైంది. పూర్వపు వరంగల్ జిల్లాలోని రామప్పతోపాటు లక్నవరం, పాకాల వంటి పెద్ద పెద్ద చెరువులు కూడా పునరుజ్జీవం పొందాయని స్థానిక విలేకరులు మాతో చెప్పారు. యాదృచ్ఛికమే కావొచ్చు కానీ ఇక్కడో విషయం గమనించాలి. నాటి కాకతీయుల పాలన మధ్యప్రదేశ్లో విదిశ వరకు విస్తరించింది. ఇదే విధంగా తొమ్మిదేళ్ల స్వయంపాలన ఫలితాల ప్రభావం ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులను దాటి పూర్వపు హైదరాబాద్ రాజ్యం ఆవలి తీరాలపై సైతం పడుతున్నది. భవిష్యత్తులో ఇది యావత్ భారతావనిపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
– అస్కాని మారుతీ సాగర్
90107 56666
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యూనియన్
ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్