గవర్నర్ను సీఎం అవమానిస్తున్నారని పెడబొబ్బలు పెడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడితే మంచిదేమో. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన ‘ఎట్ హోం’ను బహిష్కరించారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ పక్కన పెట్టినందుకు నిరసనగా ఈ పని చేశామని తమిళనాడు కాంగ్రెస్ సభాపక్షం ప్రకటించింది. ఇక ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం అయితే మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ రాజీకి వస్తే మంచిదని హితవు పలికారు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్కు తమ రాష్ట్రం పట్ల ఉన్న సోయి ఇక్కడి టీపీసీసీకి ఉంటే బాగుండేదేమో.
జర సోచో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును జీర్ణించుకోలేక తనకు భోజనం కూడా సహించలేదని గతంలో పవన్ కల్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడేమో తెలంగాణలో తన పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ చిరంజీవి పార్టీ పోటీ చేస్తేనే రెండంటే రెండు సీట్లు వచ్చాయి. ఇక పవన్ కల్యాణ్ను ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం అంటూ గత ఎన్నికల్లో ప్రచారం చేసినా స్వయంగా ఆయనే గెలువలేదు. పోనీ బీజేపీ పొత్తు పెట్టుకుంటేనైనా గెలుస్తారేమో అనుకోవడానికి కూడా వీల్లేదు.. ఎందుకంటే, గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది కూడా ఒక్క సీటేనన్న విషయం పవర్స్టార్కు తెలియదేమో పాపం.
అబ్బ.. చా…
వైఎస్ షర్మిల అంటే మీడియా వాళ్లు భయపడిపోతున్నారు. తమను ఎన్నిసార్లు ఫూల్ చేస్తారని నిలదీస్తున్నారు. షర్మిలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయినట్టు బీట్ రిపోర్టర్లకు సమాచారం ఇచ్చారు. కెమెరాలు, గొట్టాలు తీసుకొని పరిగెత్తుకెళ్తే అక్కడ అలాంటి ఆనవాళ్లేమీ కనిపించలేదు. మెసేజ్ పెట్టిన వ్యక్తిని అడిగితే.. ఇక్కడ కాదు, రహస్య ప్రదేశంలో భేటీ జరుగుతున్నదని అన్నారు. ఆరా తీస్తే షర్మిల ఇంట్లోనే ఉన్నారని తేలింది. కొందరు పొంగులేటికి ఫోన్చేసి అడిగితే, ‘రాజకీయంగా ఓనమాలు తెలిసిన ఎవరూ కూడా ఆ పనిచేయరు. ఇంత అనుభవం ఉండి నేను కలుస్తానని ఎట్ల అనుకున్నారు’ అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని షర్మిలను అడిగితే, ‘ఆయన కలిసినట్టు నేను చెప్పానా?’ అని ఎదురు ప్రశ్నించారు. గతంలోనూ పీఎం మోదీ షర్మిలకు ఫోన్ చేశారని అన్నారు. వాస్తవం కాదని బీజేపీ నేతలు ఖండించారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు గురించి మాట్లాడకుండా ఉంటే.. వంద కోట్లు ఇస్తామని మెఘా కంపెనీ ఆఫర్ చేసినట్లు చెప్పారు. అదీ అబద్ధమేనని తేలింది. ఇప్పటికైనా ‘నాన్నా! పులి’ సామెతలా చేయొద్దంటూ మీడియా హితవు పలికింది.
– వెల్జాల