దాదాపు 50 ఏండ్ల క్రితం సమర్పించిన మిశ్రా కమిటీ నివేదిక నిజాలు నేడు జోషిమఠ్ సంఘటనల ద్వారా వాస్తవ రూపం దాల్చాయి. గత ఐదు రోజులుగా ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ గ్రామం దేశవ్యాప్తంగా వార్తల పతాక శీర్షికలో హాట్టాపిక్గా మారి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నది. అదే సమయంలో, ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ప్రమాదపు అంచులో ఉన్న ప్రతి ఒక్కరినీ పభుత్వం ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తూ, పునరావాస కేంద్రాలకు చేరుస్తూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
జోషిమఠ్ ఘటనకు కారణం గత కొన్ని దశాబ్దాలుగా మానవుడు ప్రకృతితో వైరం పెంచుకోవడమే అనేది నిర్వివాదాంశం. అభివృద్ధి పేరుతో అడవులు, కొండలు, గుట్టలను ఇష్టానుసారంగా తొలగించడం. భూగర్భ జలాలను తోడెయ్యడం. హైడ్రాలిక్ ప్రోబబిలిట్స్ పేరుతో విచ్చలవిడిగా భూ అంతర్భాగాలను చీల్చడం. విద్యుత్ ఉత్పత్తి, భారీ కట్టడాలు, విశాలంగా రహదారులు నిర్మించటం ఇటువంటి పనులన్నీ కలిపి మొత్తం జోషి మఠ్ గ్రామానికి పెను ప్రమాదం దాపురించేలా చేశాయి. ఇలాంటి ప్రమాదాలు కేవలం జోషిమఠ్కే కాదు, దాదాపు హిమాలయ పర్వత శ్రేణులను ఆనుకొని ఉన్న అన్ని గ్రామాలకు పొంచి ఉన్నాయని అందరూ గ్రహించాలి.
25 వేల జనాభా ఉన్న జోషిమఠ్ గ్రామానికి, పర్యాటకం పేరు న ప్రతి ఏడాది 5 లక్షలకు పైగా సందర్శకులు వస్తుంటారు. వారి సౌకర్యార్థం బహుళ అంతస్తుల భవనాలు, నీరు, విద్యుత్ సౌకర్యాలు, రహదారులు నిర్మించటం వల్ల జోషిమఠ్ గ్రామం పెను ప్రమాదంలో పడింది.అసలే ఇక్కడ భూ ఉపరితలం, అంతర్భాగం హిమాలయ పర్వతాల గ్లేషియర్స్ వల్ల మెత్తని స్వభావం కలిగి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం సరికాదు అని మిశ్రా కమిటీ ఆరోజే హెచ్చరించింది. అయి తే, ఈ సూచనలు తుంగలో తొక్కి, ఆదాయమే పరమావధిగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడానికి వెసులుబాటు ఇచ్చింది. దీంతో నేడు భూమి లోపలి భాగం మెత్తబడి, చివరికి గ్రామంలో అనేక భవంతులు, నిర్మాణాలు, రోడ్లు పగుళ్లు ఏర్పడి, ఏ క్షణాన కూలి భారీ సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతోరో అనే భయంతో ఊరు ఊరంతా ఖాళీ చేసేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశా లు ముఖ్యంగా సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్నది. ఈ తరుణంలో ఖాళీ సమయాల్లో, వీకెండ్స్, పండుగల సందర్భంగా దేశంలో ఉన్న వివిధ పర్యాటక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, పుణ్య క్షేత్రాలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రకృతి ప్రాంతాల్లో విహారించడానికి ఆసక్తి చూపుతున్నారు. నైనిటాల్, జోషిమఠ్, కులుమనాలి, చంపాపట్ మొదలైన ప్రదేశాలను చూడటానికి ప్రతి ఏటా లక్షలాది మంది వస్తుంటారు. వీరికి అవసరమైన విశ్రాంతి గదులు (హోట ల్స్, రెస్టారెంట్లు), విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, రహదారులు, ప్రయాణ సౌకర్యాలు కోసం ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలను, భూమి స్థితిగతులను పట్టించుకోకుండా వివిధ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఆ ప్రాంతాలు ప్రమాదాల్లో పడ్డాయి. అసలే అక్కడ ఉన్న భౌగోళిక, భూగర్భ పరిస్థితులు అననుకూలంగా ఉంటే, ఇక మానవుని అత్యాశ, ఆదాయం సమకూర్చుకోవాలనే కోరిక వల్ల అసలుకే ఎసరు వచ్చింది.
ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా, హిమాలయ పర్వతాలను ఆనుకొని ఉన్న రాష్ర్టాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్లపై దృష్టి సారించాలి. భూగర్భ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా పర్యాటక శాఖ అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణ మీదే మానవ మనుగడ ఉందనే విషయాన్ని మరువరాదు. ఉత్తర కాశీ కూడా ప్రమాదం అంచున ఉందని తెలుస్తున్నది. భూగర్భంలో సొరంగాలు తవ్వటం, నీరు, విద్యుత్ రహదారులు నిర్మించటం కోసం అక్రమ త్రవ్వకాల చేపట్టరాదు. వివిధ రకాల మెటల్స్, మినరల్స్ కోసం అక్రమ తవ్వకాలను, అడవులు నరికివేత చేపట్టరాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలి. పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలి. ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలి. నిఘా పెంచాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలి. ప్రకృతి కన్నెర్ర చేయకముందే, మానవ స్వార్థానికి చెక్ పెట్టాలి. సర్వేజనాసుఖినోభవంతు అనే నానుడి అనుసరిస్తూ ముందుకు సాగాలి.
-ఐ.ప్రసాదరావు
63056 82733