ప్రధాని మోదీ సుమారు తొమ్మిదేండ్లుగా పాలన కొనసాగిస్తున్నారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించేప్పటికి మన్మోహన్సింగ్ సుమారు తొమ్మిదేండ్ల పాలన పూర్తిచేసుకున్నారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ‘దేశ ఆర్థికపరిస్థితి అధ్వానంగా తయారైంది. దానికి కారణం విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని అసమర్థత’ అని వ్యాఖ్యానించారు.
నాటి ప్రధానిని మౌన్ మోహన్సింగ్గా అభివర్ణించారు. మన్మోహన్సింగ్ అత్యంత బలహీనమైన ప్రధాని అని, తాను 56 ఇంచుల ఛాతి గల బలవంతుడనని, విధాన నిర్ణయాలతో ఆర్థిక చక్రాన్ని పరుగెత్తిస్తానని, తద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన జరుగుతుందని, అచ్చేదిన్ వచ్చి దేశంలో వికాసం జరుగుతుందని 2013-14లో ప్రజలను నమ్మబలికి అధికారం కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మోదీ పాలన కూడా సుమారు తొమ్మిదేండ్లు కావస్తున్నది. ఈ తొమ్మిదేండ్లలో ఆర్థిక, ఉద్యోగ కల్పన అంశాల్లో ఏం జరిగిందో చూద్దాం.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో మన్మోహన్ ప్రభుత్వం విఫలమైందనీ, తాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభ వాణిజ్యం)ను పెంచడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా ఉపాధి కల్పిస్తానని 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలకు మోదీ వాగ్దానం చేశారు. అన్నట్లుగానే ప్రపంచ బ్యాంకు సూచిక ప్రకారం ఈవోడీబీ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారతదేశం 2014లో 147వ స్థానం నుంచి 2019 నాటికి 63వ స్థానానికి చేరుకుందని, అది మోదీ ఘనత అని బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియా గట్టిగా ప్రచారం చేసింది. ఆ నివేదికే నిజమైతే దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడాలి. కానీ అలా జరగలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలే నిరూపిస్తున్నాయి.
2008లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జీడీపీలో 3.6 శాతంగా ఉంటే, 2008 ప్రపంచ ఆర్థికమాంద్యం తదనంతరం ఎఫ్డీఐలు గణనీయంగా తగ్గి 2014కు 1.7 శాతంగా నమోదయ్యాయి. దీనినే బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ 2013లో విధాన పక్షవాతంగా అభివర్ణించారు. ఆయన ప్రధాని అయిన తర్వాత 2018లో ఎఫ్డీఐలు జీడీపీలో 1.6 శాతంగా నమోదు కావడం గమనార్హం. అంటే కరోనా కన్నా ముందే 2014 నాటి కన్నా ఎఫ్డీఐలు తగ్గాయని గమనించవచ్చు. 2021 సంవత్సరానికి జీడీపీలో 1.4 శాతంగా ఎఫ్డీఐలు నమోదయ్యాయి. ఆర్థికవేత్తలు దీన్ని పెట్టుబడి పక్షవాతంగా అభివర్ణించారు. అంటే ఈవోడీబీ ర్యాంకింగ్ మెరుగుపడటం వల్ల ఎఫ్డీఐలు పెరగకపోగా తగ్గాయని భారత ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2020లో ఈవోడీబీ ర్యాంకింగ్ ఇచ్చే విధానంలో తలెత్తిన వివాదం వల్ల, 2018 ర్యాంకులు ఇవ్వడంలో బయటపడ్డ మోసపూరిత విధానాల వల్ల 2021 నుంచి ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్లు ఇవ్వడం మానేసింది. ఇది గమనించవలసిన విషయం. 2022లో భారతదేశం నుంచి 17.6 బిలియన్ డాలర్ల మేర విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐలు) తరలివెళ్లాయని భారత ప్రభుత్వం వెలువరించిన గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఎఫ్డీఐలు తగ్గుతున్నాయని, ఎఫ్పీఐలు తరలి వెళ్తున్నాయనేది స్పష్టం. పెట్టుబడులు తగ్గడం, తరలివెళ్లడం మూలాన ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ఉద్యోగకల్పన గణనీయంగా తగ్గుతుంది.
ఎంఎస్ఎంఈ పరిస్థితి: ఎంఎస్ఎంఈలు 2014 నాటికి దేశ జీడీపీలో 30.2శాతంగా ఉండేవి. నోట్ల రద్దు వల్ల 2016లో తగ్గి 29.48 శాతంగా నమోదయ్యాయి. లోపభూయిష్టమైన జీఎస్టీ అమలు వల్ల మరింత తగ్గి 2017లో 29.25 శాతంగా నమోదయ్యాయి. 2020 నాటికి కాస్త పుంజుకొని 30 శాతంగా నమోదు కాగా, 2021కి కరోనా వల్ల 26.83 శాతంగా ఉండగా 2022 నాటికి 27 శాతంగా నిలిచాయి. అంటే ఎంఎస్ఎంఈలకు మోదీ ప్రభు త్వం ఉద్దీపనలు పెద్దగా లబ్ధి చేకూర్చలేదని తెలిసిపోతున్నది. ఎంఎస్ఎంఈలు జీడీపీలో 3 శాతం వాటా కోల్పోవడమంటే ఎంత ఉత్పత్తి తగ్గిందో, తదనుగుణంగా భారతీయులు ఎన్ని ఉద్యోగాలు కోల్పోయారో అర్థమవుతున్నది. ఇటీవల కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి భానుప్రతాప్ రాజ్యసభలో ప్రకటించిన గణాంకాలను అనుసరించి 2016 నుంచి 22 వరకు ఆరేండ్ల కాలంలో 10,067 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. ఇందులో 4 శాతం అంటే సుమారు 400 పరిశ్రమలు 2019కి ముందు (నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల), మిగతావి కరోనా వల్ల అని భావించవలసి ఉంటుంది. ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తిని సామ ర్థ్యం మేరకు కొనసాగించకపోవడం వల్ల జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా తగ్గిందని భావించవలసి ఉంటుంది. తదనుగణంగా ఉద్యోగాలు తగ్గి లేబర్ పార్టిసిపేషన్ రేటు గణనీయంగా పడి పోయి 46 శాతంగా ఉండగా ఇటీవల ఈపీఎఫ్ఓ ప్రచురించిన డేటాను బట్టి ఫార్మల్ జాబ్ క్రియేషన్ 17 నెలల కనిష్ఠానికి చేరుకున్నదని గణాంకాలు చెప్తున్నాయి.
బహుళజాతి కంపెనీలు-భారతదేశంలో పెట్టుబడుల పరిస్థితి: తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమని, ఉత్పత్తి కర్మాగారాల స్థాపనకు అనుకూలంగా ఉన్నదని అలెక్స్ కాప్రి (రీసెర్చ్ ఫెలో ఇన్ హిన్రిచ్ ఫౌండేషన్)తన నివేదికలో ఇటీవల పేర్కొన్నారు. అందువల్లనే కావచ్చు తెలంగాణలో పెట్టుబడుల వెల్లువను చూడగలుగుతున్నాం. అయితే దేశవ్యాప్త పరిస్థితి మరొకవిధంగా ఉన్నది. యాపిల్-ఫాక్స్కాన్ సంస్థ మన దేశంలో పెట్టుబడి పెట్టిందని అది తమ గొప్పతనమని ఇటీవల మోదీ ప్రభుత్వం డప్పు కొట్టి చెప్పుకొన్నది. మహారాష్ట్ర నుంచి గుజరాత్కు ఫాక్స్కాన్ సంస్థను గుజరాత్ ఎన్నికల ముందు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఎన్నో బహుళజాతి సంస్థలు భారత్ను విడిచి వెళ్తున్నాయనేది గమనార్హం. 2014-21 మధ్యలో 2,783 బహుళజాతి కంపెనీలు తమ కార్యకాపాలను మూసివేసి తమ దేశాలకు తరలివెళ్లాయని పార్లమెంట్ సాక్షిగా పరిశ్రమలు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. 12,458 బహుళజాతి కంపెనీలు తమ కార్యకాపాలను కొనసాగిస్తున్నాయని తెలియజేశారు.
భారతదేశాన్ని మాన్యుఫాక్చరింగ్ హబ్గా తయారుచేయాలంటే స్థిరమైన విధానాలతో పెట్టుబడులను ఆకర్షించాలని ఓఆర్ఎఫ్ డైరెక్టర్ మిహిర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆ పెట్టుబడుల ద్వారా ఏర్పాటయ్యే పెద్ద కర్మాగారాలకు మద్దతుగా ఎంఎస్ఎంఈల పెరుగుదల ఉండాలని తెలియజేశారు. అయితే ఎంఎస్ఎంఈల పరిస్థితి దారుణంగా తయారైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ)ను ఎంఎస్ఎంఈలకు వర్తింపజేయకపోవడం లోపభూయిష్టమని అభిప్రాయపడ్డారు. కార్మికులను ఎక్కువగా ఉపయోగించుకొనే పరిశ్రమలకు పీఎల్ఐని వర్తింపజేసి, ఎగుమతుల చోదిత అభివృద్ధిగా మార్చడం వల్లనే ఏడాదికి 1.2 కోట్ల ఉద్యోగ కల్పన సాధ్యమని తెలియజేశారు. అంటే ఇప్పుడున్న విధానాలే అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
చైనా నుంచి తరలిపోతున్న పెట్టుబడులను ఇండియా ఆకర్షించగలదా?: భారతదేశంలో మార్కెట్, జనాభా వల్ల, కార్మికుల లభ్యత మూలంగా చైనా నుంచి పెట్టుబడులను భారత్ ఆకర్షించడం సాధ్యమని మనం అనేక విశ్లేషణలు చూస్తున్నాం. అది సత్యమైనప్పటికీ ఎన్నో అడ్డంకులున్నాయనేది వాస్తవం. ఎగుమతి ప్రాధాన్యం కన్న, స్థానిక అవసరాలను తీర్చడమే ప్రధానంగా భారతదేశ విధానంగా ఉన్నదని, వాణిజ్య నియంత్రణల ద్వారా ఈ పరిస్థితి ఏర్పడిందని సౌమిత్రో ఛటర్జీ, అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. ‘ఇండియాస్ ఇన్వర్డ్ (రి)టర్న్: ఈజ్ ఇట్ వారంటెడ్, విల్ ఇట్ వర్క్’ అనే పరిశోధనా పత్రంలో ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. భారతదేశ జనాభాలో మధ్యతరగతి కేవలం 15-17 శాతమని, వారి కోనుగోలు శక్తి ఏడాదికి సుమారు 500 బిలియన్ డాలర్లు మాత్రమేనని వారు వివరించారు. భారత్ మినహా మిగతా ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి కొనుగోలు శక్తి 30 ట్రిలియన్ డాలర్లు అని కూడా వారు లెక్కగట్టారు. అందువల్ల ప్రపంచవ్యాప్త కొనుగోళ్లపై ఆధారపడినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం చైనా నుంచి అనేక పరిశ్రమలు తరలివెళ్లాయి. కానీ కార్మికులను ఎక్కువగా ఉపయోగించుకునే పాదరక్షలు, దుస్తులు, లెదర్, సెరామిక్స్ మొదలైన పరిశ్రమలను బంగ్లాదేశ్, వియెత్నాం వంటి దేశాల స్థాయిలో కూడా భారత్ ఆకర్షించలేకపోయిందని సౌమిత్రో ఛటర్జీ, అరవింద్ సుబ్రమణ్యన్ గణాంకాలతో సహా నిరూపించారు.
ఇక కరోనా తదనంతర పరిస్థితుల్లో కూడా చైనా నుంచి పరిశ్రమలు తరలుతున్నాయి. కానీ భారతదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పరిశ్రమలను ఆకర్షించలేక పోతున్నదని అరవింద్ సుబ్రమణ్యన్, జోష్ ఫెల్మన్ ఇటీవల ఫారిన్ అఫైర్స్ పత్రికలో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో అభిప్రాయపడ్డారు. గూగుల్, వాల్మార్ట్, వోడాఫోన్, జనరల్ మోటార్స్తో పాటు అమెజాన్ కూడా తన మూడు వెంచర్లను మూసుకున్నది. దీనికి ముఖ్య కారణం మోదీ అనుసరిస్తున్న నేషనల్ ఛాంపియన్స్ అనుకూల విధానమని అభిప్రాయపడ్డారు. అంటే అంబానీ, అదానీ వంటివారికి అనుకూలంగా నియంత్రణ విధానాలను మార్చడం వల్ల ఈ విధంగా జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ‘ఈజ్ మోదీ ఇండియా ఏన్ ఎంపైర్ బిల్ట్ ఆన్ కోల్’ అనే వ్యాసాన్ని ప్రచురించింది. మోదీ ప్రభుత్వం మూడుసార్లు నిబంధనలను, నియంత్రణలను మార్చడం వల్ల ఒక వ్యక్తికి ఒక బిలియన్ డాలర్ల మేర లబ్ధి చేకూరిందనీ, మిగతా కంపెనీలు ఇబ్బంది పడ్డాయనీ ఈ వ్యాసంలో వివరించారు. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు ముప్పు ఉందనే భయాందోళనలకు లోనవుతున్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.
మోదీ పాలనలో ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల.. దేశంలో ఆర్థికరంగం పరిస్థితి
విధానపరమైన పక్షవాతం నుంచి పెట్టుబడి పక్షవాతం అన్నట్లుగా తయారైందని ఆర్థికవేత్తలు విశ్లేషించారు. అంటే మోదీ ప్రభుత్వం సుమారు ఈ తొమ్మిదేండ్లలో భారత అర్థికపరిస్థితిని, ఉద్యోగ కల్పన పరిస్థితిని మరింత దిగజార్చిందని మనం గమనించవచ్చు.
-పెండ్యాల మంగళాదేవి