ఫాసిజం (నియంతృత్వం) పడగ నీడలో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. వర్తమాన సందర్భంలో జన జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొని ఉంది. సామాజిక బహుళత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సహించని మత రాజకీయశక్తులు అడుగడుగునా విద్వేష విషాన్ని వెళ్లగక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మత విద్వేషశక్తుల దుర్విధానాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు ఒక ఆర్థిక అరాచక చర్యగా మారి దేశ ఆర్థిక వృద్ధిని అగాధంలో పడేసింది. ఈ పర్యవసానాల నుండి తేరుకోకముందే అమల్లోకి వచ్చిన జీఎస్టీ రాష్ర్టాల స్వావలంబనకు గొడ్డలి పెట్టుగా తయారైంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతులు, దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ దారుణంగా పడిపోవటం వంటి కారణాల వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోయాయి. దేశంలో ఉద్యోగ కల్పన శాతం గత 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది. కరోనా విపత్తు సమయంలో ఉత్పన్నమైన పరిస్థితులను నియంత్రించడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం, ఆ ఆపద సమయంలో సైతం మత విద్వేషాలను రెచ్చ గొట్టడానికి ప్రయత్నించి తన వికృత మానసిక ధోరణిని ప్రదర్శించింది.
తగిన ప్రణాళిక లేకుండా అనాలోచితంగా, ఆకస్మికంగా విధించిన లాక్ డౌన్ దేశ ప్రజలను అష్ట కష్టాలకు గురి చేసింది. లక్షలాది మంది వలస కార్మికులు వివిధ నగరాల నుంచి తమ సొంత ఊళ్లకు చేరుకోవడానికి వందల కిలోమీటర్ల దూరం కాలినడకన చేసిన పయనం దేశ చరిత్రలో ఎన్నడూ ఎరుగని అత్యంత విషాదకర సంఘటన. రైలు పట్టాలపై కార్మికుల దేహాలు ఛిద్రమై చెల్లా చెదురైన హృదయ విదారక సన్నివేశం జనం స్మృతి పథంలో మానని గాయమై సలుపుతూనే ఉంది. కరోనా అనంతర కాలంలో కేంద్రం తీసుకున్న ఆర్థిక ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించటంతో ప్రజలకు ఏ రకమైన ఉపశమనం లభించలేదు. నేడు ద్రవ్యోల్బణం అనే రాబందు పెరిగిన ధరలనే ఇనుప ముక్కుతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను పీక్కు తింటున్నది. దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నదని అమర్త్య సేన్, రఘురామ్ రాజన్, కౌశిక్ బసు వంటి ఆర్థిక వేత్తలు హెచ్చరికలు చేస్తున్నా వినిపించుకునే పరిస్థితి లేదు.
దేశంలో నెలకొన్న సామాజిక బహుళత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సహించని మత రాజకీయ శక్తులు అడుగడుగునా విద్వేష విషాన్ని వెళ్లగక్కుతున్నాయి. వివిధ సమూహాలు సహజీవనం చేస్తూ నిర్మించిన సామాజిక కలనేతను కకావికలం చేస్తున్నాయి. సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆధునిక విలువలకు వేదికైన రాజ్యాంగం మత రాజకీయ శక్తులకు కంటగింపుగా మారింది. రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడి జాతీయోద్యమ స్ఫూర్తిని తెగ నరుకుతున్నది. జాతీయోద్యమంలో ఏ విధమైన భాగస్వామ్యం లేని సంఘ్ పరివార్ శక్తులు జాతీయ వాదానికి తామే ఠెకేదారులైనట్టు ప్రవర్తిస్తున్నాయి. విశాలమైన జాతీయతా స్ఫూర్తిని సంకుచిత పరిధిలోకి ఈడుస్తున్నాయి. తమను విమర్శించిన వారిపై దేశ ద్రోహులుగా నిందలు వేస్తూ అణచివేతను ప్రయోగిస్తున్నాయి. సమరసానికీ, సహిష్ణుతకీ మారు పేరైన భారతీయతనే విచ్ఛిన్నం చేస్తున్నాయి. మతంలో ఉండే ఆధ్యాత్మిక, దివ్యత్వ భావనల స్థానంలో పచ్చి ద్వేషాన్ని, మూక మనస్తత్వాన్ని, హింసనూ ప్రేరేపిస్తున్నాయి. స్వమతాభిమానం కన్నా పరమత ద్వేషమే ప్రాతిపదికగా మార్చి భారతీయ జీవన గంగను కలుషితం చేస్తున్నాయి.
ప్రతి పక్షాలను అణచివేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకునే దుర్మార్గ విధానాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పరాకాష్ఠకు తీసుకుపోయింది. దేశంలో సమానత్వం కోసం పోరాడే వాళ్లపై చిత్ర, విచిత్రమైన కేసులు పెడుతూ కారాగారాల్లోకి నెట్టుతున్నది. మరో వైపు బిల్కిస్ బానోపై సామూహికంగా అత్యాచారం చేసి, పాలుతాగే పసికందును క్రూరాతికూరంగా చంపిన కరడు గట్టిన నేరస్థులను స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా నిర్లజ్జగా జైలు నుంచి విడుదల చేయటం బీజేపీ ప్రభుత్వం నైతిక భ్రష్టత్వానికి సాక్ష్యం.
సమానతకూ, సౌభ్రాతృత్వానికీ, సహిష్ణుతకూ, సహేతుకతకూ, తార్కికతకూ వ్యతిరేకంగా సాగుతున్న మత విద్వేష శక్తుల దుర్విధానాలపై చర్చను నిర్వహిస్తూ ప్రతిఘటన, చైతన్యాన్ని పెంచే ప్రయత్నాన్ని తెలంగాణ వికాస సమితి తన పరిధిలో శక్తి వంచన లేకుండా నిరంతరంగా కొనసాగిస్తున్నది. అందులో భాగంగా దేశంలో నేడు నెలకొన్న పరిస్థితులపై సదస్సును నిర్వహిస్తున్నది. దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ‘సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ -కారణాలు, ప్రభావాలు’ అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ‘భారత రాజ్యాంగ విలువలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రసంగిస్తారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, అయాచితం శ్రీధర్, ఓ.నరసింహారెడ్డి , తెలంగాణ వికాస సమితి కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారు. సహ జీవన సామరస్య విలువలను కాపాడుకోవాలని ఆకాంక్షించే వారందరూ ఈ సదస్సుకు ఆహ్వానితులే.
దేశ పరిస్థితులపై సామాజిక సదస్సు తేదీ: 20.11.2022 (ఆదివారం) సమయం – ఉదయం 10 గంటల నుంచి
వేదిక – తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, నాంపల్లి, హైదరాబాద్ నిర్వహణ: తెలంగాణ వికాస సమితి