ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా సంపద పెంచుతూ పేదలకు పంచుతున్నది. దశాబ్దాలుగా వెనకబడిన బీసీలకు ఆర్థిక సాధికారత కల్పించి అండగా నిలుస్తున్నది. కానీ మంచి జరుగుతున్న దగ్గరే దుష్ట శక్తులు మోపైతయన్నట్లుగా తెలంగాణలో ఇయ్యాల కొన్ని విభజన శక్తులు తయారైనయి. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి ప్రజల విజ్ఞతకు పరీక్ష పెట్టాయి. వారి కుట్రలకు బలి కాకుండా తమను అందలమెక్కించిన వారికే బీసీలు అండగా నిలవాలి.
మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉండగా, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఏ ప్రయోజనాలను ఆశించి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు? నమ్మి తనకు ఓటు వేసిన ప్రజలను ఆయన ఎందుకు మోసం చేశారో అందరికీ తెలిసిందే. పేదలను కొట్టి పెద్దలకు మేలు చేసేదే బీజేపీ అని, బీసీ నాయకులకు ఆ పార్టీలో ప్రాధాన్యం లేదని తెలుసుకుని కొందరు నాయకులు కూడా ఆ పార్టీని వీడుతున్నారు. బీసీ నేతలైన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ తమ ఆత్మగౌరవం కోసం బీజేపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరడం ఇందుకు నిదర్శనం. రాజగోపాల్ రెడ్డితోపాటు బీజేపీని కలవరపెడుతున్న ఈ చేరికలు, మునుగోడు నియోజకవర్గ ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మునుగోడు. ఇక్కడ 2.27 లక్షల మంది ఓటర్లుండగా, ఇందులో లక్షన్నర మంది అంటే 66 శాతం బీసీ ఓటర్లే. వీరిలో గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు 16 శాతం, ముదిరాజ్లు 15 శాతం, యాదవులు 10 శాతం, పద్మశాలీలు 7 శాతం ఉన్నారు. తెలంగాణలో బీసీలంటేనే ఆయా కులవృత్తులు చేసేవారు. వీరి సంక్షేమం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటి వరకూ ఏం చేసింది? మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఏం చేశారంటే… సమాధానం లేదు.
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 8 ఏండ్లలో బీసీలకు ఎలాంటి మేలు చేసిందో చర్చిస్తే.. ఈ ఎన్నికలో ఎవరి పక్షాన నిలబడాలో బీసీలకు స్పష్టత వస్తుంది. సమైక్య పాలనలో ధ్వంసమైన కుల వృత్తులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటున్నది. గౌడన్నల సంక్షేమం కోసం తాటి చెట్లపై పాత పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా, చెట్ల పన్నును శాశ్వతంగా రద్దు చేసింది. చెట్టు మీద నుంచి పడి మరణించిన లేదా కాలు చెయ్యి విరిగిన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని రూ.50 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్ ఇస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. తాటి చెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్గా మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. అవకాశమున్న ప్రతి చెరువులో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. గంగపుత్ర, ముదిరాజ్ కులాలవారికి ఆయా చెరువుల్లో ఉచితంగా చేపలు పట్టుకొనే అవకాశం కల్పించింది. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని పెద్ద చెరువుల్లో మత్స్యకారులు చేపలు పడుతూ ఆదాయం పొందుతున్నారు. త్వరలో పూర్తి కానున్న చర్లగూడెం/శివన్నగూడెం, లక్ష్మణాపురం జలాశయాల వల్ల మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి. యాదవులు, గొల్ల కురుమల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ వారి ఆదాయాన్ని పెంచింది. మునుగోడు నియోజకవర్గంలో 5,563 మంది గొల్ల కురుమల ఖాతాల్లో గొర్రెల కొనుగోలుకు డబ్బులు జమయ్యాయి. ఈ ఉప ఎన్నిక తర్వాత వారికి గొర్రెల యూనిట్ల పంపిణీ కొనసాగనుంది.
నేతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిది. బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగించటంతోపాటు నూలు, రసాయనాలపై 50 శాతం రాయితీ ఇస్తున్నది. నేతన్నలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ బడ్జెట్ను రూ.1200 కోట్లకు పెంచింది. రూ.200గా ఉన్న నేతన్నల పింఛనును రూ.2016 చేసింది. 10,500 మందికి రూ.1 లక్ష వరకు చేనేత రుణ మాఫీ చేసింది. సర్కారు చేపట్టిన చర్యల వల్లే పోచంపల్లికి ప్రపంచ పర్యాటక సంస్థ అవార్డు వచ్చింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద చేనేత కార్మికులకు అవార్డు, రూ.20 వేల నగదు అందిస్తున్నది. రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టింది. దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తూ రజకులు, నాయీ బ్రాహ్మణులకు మేలు చేస్తున్నది. ఇవిగాక బీసీ మహిళలకు బీడీ కార్మికుల పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్నది. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 79 వేల మంది రైతులకు రైతు బంధు, 43 వేల మందికి పింఛన్లు, 10 వేల మందికి కల్యాణలక్ష్మి, 9.5 వేల మందికి కేసీఆర్ కిట్లు, 1200 మందికి రైతు బీమా ఇచ్చింది. ఈ విధంగా అన్ని విధాలా తమను ఆదుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బహుజన కులాలు ఎలా మరిచిపోతాయి?
రాజగోపాల్రెడ్డి ఏం చేశారు?: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇంత చేస్తుంటే.. ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. ప్రతి మండలంలో సొంత డబ్బులతో స్కూళ్లు, కాలేజీలు కట్టిస్తానని, బాగు చేయిస్తానని చెప్పారు. వాటి జాడ లేదు. కుల సంఘాలకు సామాజిక భవనాలు కట్టిస్తానన్న హామీకి దిక్కు లేదు. చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి దాటవేశారు. ఇక ఆయన చేరిన బీజేపీ కూడా మునుగోడు ప్రజలకు చేసిందేమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వం నేతన్నల బతుకులను ఆగం చేసేలా చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ లాంటి నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల జీవితాలను మరింత భారం చేసింది. ప్రజలారా… ఇప్పుడు చెప్పండి… తన స్వార్థం కోసం ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డి వెంట ఉంటారా? లేదా అన్ని రకాలుగా ఆదరించిన కేసీఆర్కు మద్దతుగా నిలుస్తారా? నిర్ణయం మీదే!
-బచ్చు శ్రీనివాస్ , 93483 11117