వ్యక్తి, వ్యవస్థ, సంస్థ… ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజం వేస్తుంది. బహుజనుల చైతన్యం కోసం తరాల తరబడి ఎంతోమంది పోరాటం చేస్తూనే ఉన్నారు. వారిలో స్మరించుకోదగిన మహనీయుడు మహాత్మా జ్యోతిభా పూలే.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక పుస్తకాన్ని పూలేకు అంకితం ఇస్తూ ‘విదేశీ పాలకుల నుంచి విముక్తి సంపాదించడం కంటే, సాంఘిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం ముఖ్యం అని మహత్తర సందేశాన్ని అందించినవారు మహాత్మా జ్యోతిభా పూలే’ అని రాశారు. అంటే అంబేద్కర్ మాటల ద్వారా పూలే బహుజనుల బానిసత్వం విముక్తి కోసం చేసిన కృషి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అంబేద్కర్, పూలే రచనలను ఓసారి గమనంలోకి తీసుకుంటూనే బీసీల అడుగులు ఎటు పడుతున్నాయన్న చర్చ జరగాలి. అస్తిత్వ ఉద్యమాల నుంచి, రైతాంగ సాయుధ పోరాటాలు, వామపక్ష ఆందోళనలు, తెలంగాణ తొలిదశ ఉద్యమ ఫలితాలు బీసీలకు, బీసీ సంఘాలకు ఏ మేరకు ఉపకరించాయో లేదో కానీ, ఆ అస్తిత్వ పోరాటాలు తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయిలో ప్రభావితం చేశాయి. దాని ఫలితాలు, బీసీలు బీసీ సంఘాలుగా త్వరితగతిన సాధించుకున్న ఉద్యమ ప్రతిఫలాలు నేడు చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో బీసీలకు ఏ రాజకీయ వ్యవస్థ అండగా ఉన్నదో, ఉంటున్నదో లోతైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో బీసీలకు ఏ మేరకు న్యాయం జరిగిందో వెనక్కి వెళ్లి చూద్దాం.
90 ఏండ్ల నాటి కులాల లెక్కలతో దేశంలో నేడు బీసీ సామాజిక వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం కాదా? ఈ దేశంలో పదేండ్లకోసారి జనగణన జరుపుతారన్నది జగమెరిగిన సత్యం. ఇందులో కేవలం ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. కానీ దేశంలోనీ బీసీ కులాల వివరాలు మాత్రమే తెలువకుండా చేస్తున్నారంటే ఇందులో ఏ మేరకు కుట్ర దాగి ఉన్నదో తెలియదా? ఎప్పుడో బ్రిటిష్ పాలకులు 1931లో కులగణన చేసినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. నాటి లెక్కల ఆధారంగానే దేశంలోని బీసీలకు పలురకాల పథకాలు ఇస్తున్నట్టు పాలకులు చెప్తున్నారు. బీసీ ప్రధానిగా ఉంటూ కనీసం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయలేని నరేంద్ర మోదీ బీసీలకు ఏనాడూ వెన్నుదన్నుగా నిలవలేదు.
బీసీలకు బీజేపీయే అండ అనే కలరింగ్ ఇచ్చింది. అంతకుముందే ఈటల రాజేందర్ను చేర్చుకుని ‘తెలంగాణలో భావి రాజకీయాలన్నీ బీసీ కార్డ్తోనే నడుస్తాయి. ఇదే పార్టీ వ్యూహం’ అని నమ్మించారు. ఈ క్రమంలోనే స్వామిగౌడ్, విఠల్, దాసోజ్ శ్రవణ్, బూర నర్సయ్య గౌడ్లు బీజేపీలో చేరి అంతర్మథనంలో పడ్డారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, పల్లె రవికుమార్ సహా చాలామంది బీసీ నేతలు బీజేపీని ‘దూరపు కొండలు నునుపు’గా భావించి కప్పుకున్న కాషాయ కండువాలను ఒక్కరొక్కరుగా వదిలేస్తున్నారు. బీజేపీలో ఆత్మగౌరవం లేదని అనతికాలంలోనే ఒక నిర్ధారణకొచ్చా రు. తమ రాజకీయ జీవితాలను బలిచేసుకోకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఒక్కరొక్కరుగా తిరిగి టీఆర్ఎస్లో చేరుతుండటం శుభపరిణామం.
ఆవేశ, అనాలోచిత నిర్ణయాలతో రాజకీయ జీవితాలను బలిచేసుకుంటున్న సదరు నేతలు బీసీల అస్తిత్వ, ఆత్మగౌరవ నినాద పునాదులను అవలోకనం చేసుకుంటున్నారు. సబ్బండ వృత్తులు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తీరు, ఆ తర్వాత ఫలితాలను బేరీజు వేసుకుంటే మన ఆత్మగౌరవ నినాదాలు, పునాదులు సమీక్షించుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసం అయిన కులవృత్తులను గమనంలోకి తీసుకుంటే ఇప్పటికీ ఆ శిథిల జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతుంటాయి. నిజం చెప్పాలంటే చేతి వృత్తులకు జవసత్వాలు కల్పించి, సబ్బండవర్ణాల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు చేయూతనిచ్చించి. గొర్ల పంపిణీతో మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం మచ్చుకో ఉదాహరణ. ఇలా బీసీల అభ్యున్నతి కోసం, బీసీ అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం.
బీసీ సమస్యలపై ఏనాడూ గళమెత్తకుండా, బీసీ సంఘాలతో ఆయా కులాలతో ఏనాడూ సభలు, సమావేశాలు పెట్టకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం వ్యవహరిస్తున్న నేతల పట్ల బీసీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కేవలం మునుగోడు ఉప ఎన్నిక, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలు కోణంలో బీజేపీ ఆడుతున్న బీసీ రాజకీయ డ్రామా పట్ల జాగరూకతతో వ్యవహరించాలి. అస్తిత్వ పోరాటాలతో హక్కులను సాధించుకునేందుకు మన రాష్ట్రంలో ప్రాం తీయ పార్టీలు పోరాటాలు చేయాలే తప్ప, బీసీ వ్యతిరేక భావజాల పార్టీల్లోకి వెళ్లి బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని ఆయా కులసంఘాలు కోరుతున్నాయి.
-వెంకట్ గుంటిపల్లి , 94949 41001