1996, వియెన్నాలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ప్రతి అక్టోబర్ రెండో శుక్రవారం రోజును ‘ప్రపంచ గుడ్డు దినోత్సవం’ (వరల్డ్ ఎగ్ డే)గా జరపాలని నిశ్చయించారు. ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా గుడ్డులో ఉన్న పోషక విలువల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
కరోనా నుంచి బయటపడేందుకు గుడ్డు ద్వారా లభించే పౌష్టికాహారం కూడా ఒక కారణమని వైద్యులు సూచించడంతో కరోనా కాలంలో గుడ్డు విలువ పెరిగిపోయింది. ఏటా జరుగుతున్న పరిశోధనల్లో గుడ్డు గురించిన కొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుందని, గుడ్డు ద్వారా చెడు కొలెస్ట్రాల్ సంక్రమించదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో వైద్యులు కూడా రోజుకో గుడ్డు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న ప్రజలు లెక్కకు మించి ఉన్నారు. పౌష్టికాహార సమస్యల నివారణకు ‘గుడ్డు’ పరిష్కారంగా కనిపిస్తున్నది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకంలో, బాలల సంరక్షణా కేంద్రాలైన అంగన్వాడీ, బాల్వాడీల్లో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల్లో గుడ్ల పంపిణీ పథకాలను ప్రారంభించాయి. ఈ పథకాల ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా హాజరుశాతం కూడా మెరుగుపడుతున్నది.
వ్యవసాయాధారిత దేశంగా భారత్ ఎదుగుతున్న తరుణంలో వ్యవసాయానుబంధ రంగమైన కోళ్ల పెంపకం అరువై ఏండ్ల నుంచి వస్తున్నది. మొదట గుడ్ల ఉత్పత్తి ప్రధానంగా మొదలైంది. 90వ దశకం నుంచి మాంసం కోసం పెంచే కోళ్ల పెంపకం ఊపందుకున్నది. గుడ్డు పెట్టే కోళ్ల పెంపకం ఏడాదిన్నర పాటు సాగితే, మాంసం కోసం పెంచే కోళ్ల పెంపకం 35-40 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. గుడ్లు పెట్టే కోళ్ల పెంపకంలో స్వల్ప మార్పులతో ఏటా ఐదారు శాతమే వృద్ధి కనిపిస్తుంటే, మాంసం కోళ్ల పెంపకం ఏ ఇతర వ్యవసాయిక రంగాల్లో లేనంతగా 10 శాతం వృద్ధి నమోదవుతున్నది.
బ్యాంకుల జాతీయీకరణ వల్ల పెంపకానికి ఇచ్చే రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణించడం లేదు. చెల్లింపులు, వడ్డీలు ఇతర రుణాలుగానే పరిగణిస్తున్నారు. కోళ్ళ పెంపకంలో ప్రధాన సమస్య ఏమంటే మేత కోసం 70-80 శాతం వ్యయం అవుతున్నది! వ్యవసాయ ఉత్పత్తిలో ప్రధాన పదార్థాలు కాని మిగులు సరుకులు సద్వినియోగమవుతున్నది కోళ్ల ద్వారానే. నూకలు, చిట్టు, తవుడు, సోయా చెక్క, సోయా తీసేసిన మిగులు పదార్థాలు కోళ్ల మేతగా వాడతారు. మేతలో ముఖ్యమైనవి సోయా, మక్కజొన్న. పండిన పంటల్లో మానవ వినియోగానికి పోగా మిగిలినవి కోళ్లు, పశువులు, చేపలకు వాడాలి. గుడ్డు ద్వారా ఉత్తమ మాంసకృత్తుల పదార్థాన్ని అందించేందుకు కోళ్లు 20 శాతం సోయా, 40 శాతం మక్కజొన్నలను తీసుకుంటాయి. నిత్యం 110-120 గ్రాముల మేత తిని 50-60 గ్రాములు గుడ్డును అందిస్తాయి. ఒక పది శాతమే శారీరక వ్యవస్థకు వాడుకొని మిగతా మొత్తాన్ని రెట్టగా విసర్జిస్తాయి. ఎంతో ఖరీదులో ఉత్పత్తి చేసే రసాయనక ఎరువులకు బదులుగా ‘సేంద్రీయ’ మంచి ఎరువుగా (పంటలకు) కోడి రెట్ట వినియోగపడుతుంది.
బహుళ ప్రయోజనకారిగా గల కోళ్ల పెంపకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. మన దేశంలో మాత్రం కోళ్ల పెంపకానికి ఆరోగ్యకర పరిస్థితుల్లేవు. ప్రకృతిపరంగా అతి ఉష్ణ- అతిశీతల వాతావరణం అనుకూలించదు. కానీ విదేశీ కోళ్లకు సంప్రదాయబద్ధమైన జన్యు మార్పులు జరిపించి మన శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన కోళ్లను రూపొందించి అందిస్తున్నారు. పెంపకంలో కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటి నుంచీ తెచ్చిన ‘ఆటో మేషన్’ పద్ధతులను పరిచయం చేస్తున్నారు. ఎన్నిరకాలుగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు నియంత్రణ-విస్తరణ పద్ధతులు విధి, విధానాలు రూపొందించడంలో ఆసక్తి కనపరచకపోవడం వల్ల కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి నోచుకున్నప్పటికీ ఆశాజనకంగా లేదు. నేడు ప్రపంచవ్యాప్త గుడ్డు దినోత్సవం. కానీ భారతీయ రైతులకు గడ్డు దినోత్సవమే! దేశంలో పరిస్థితులు మెరుగుపడాలంటే, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, యూపీ, రాష్ర్టాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ‘కోళ్ల పెంపకం అభివృద్ధి సంస్థలను’ అనుసంధాన పరుస్తూ ‘జాతీయ గుడ్ల అభివృద్ధి సంస్థ’ను నెలకొల్పాలి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్లో రాయి తీ ఇస్తున్నట్టు, మక్కజొన్నలకు రాయితీనిస్తూ సరఫరా చేయాలి. అప్పుడే దేశం లో ‘కోళ్ల పెంపకానికి ప్రోత్సాహం లభించినట్టవుతుంది.
-ఎం.ఎన్.రావు , 94400 59692