Maharashtra : మహారాష్ట్రలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో ఒక చిన్నారిని అధికారులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. మంగళవారం ఉదయం మహారాష్ట్ర, జల్గావ్ ప్రాంతంలోని అమాల్నేర్, ధూలె హైవేపై మాంగ్రూల్ గ్రామం వద్ద ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
గుజరాత్కు చెందిన ఒక కారు ఒక బైకును ఢీకొంది. ఆ వెంటనే మహారాష్ట్ర రవాణా శాఖకు చెందిన బస్సు ఈ రెండు వాహనాల్ని ఢీకొంది. ఇలా మూడు వాహనాలు ఢీకొన్నాయి. బైకు పూర్తిగా బస్సు కింద పడి నలిగిపోయింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వీరిని నిలేష్ తవాడే, ఫల్గుణి భోయ్గా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో నలిగిపోయిన కారులోంచి ఒక చిన్నారిని బయటకు సురక్షితంగా తీశారు. పోలీసులు, స్థానికులు చాలా సేపు శ్రమించి చిన్నారిని రక్షించారు.
అలాగే, నందలాల్ మహాజన్, అనితా మహాజన్, సురేష్ మహాజన్, నిర్మల అనే నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. కార్ డ్రైవర్ ఆదిత్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతడితోపాటు ఈ ప్రమాదంలో గాయపడిన మిగతవారిని సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. బాధితులు ఒక వేడుక కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందుతోందని పోలీసులు, వైద్యాధికారులు తెలిపారు. అలాగే, మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.