కాకతీయ గణపతి దేవ చక్రవర్తి చేసిన యుద్ధాలు, సాధించిన విజయాలు, సామంతులు, నిర్మించిన కట్టడాలు ఆయన గొప్పతనాన్ని పేర్కొంటున్నాయి. దానధర్మాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాడు. ఇతని పాలనా కాలంలో సూర్యాపేట తాలూకాలోని మామిళ్లగూడలో విరియాల వంశానికి చెందిన పెద్ద గణపతి వేయించిన శాసనం ఉంది. ఈ శాసన కాలం శ.సం. 1171 = క్రీ.శ. 1249, సౌమ్య, నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి, గురువారం.
శాసనం ప్రారంభంలోనే కాకతీయ గణపతిదేవుని ప్రశంస ఉంది. సత్య త్యాగ విలాస భాసుర యశః సౌజన్య రత్నాకర: నిత్యానిత్య వివేక దారకుతలోనిత్యాన్విత తేజసాంద్రత్యాశ నివాస దేశ హరణ.. మతంగ కృత ధర్మజా: గణపతిక్ష్మాపాల చూడామణి: అని కొనియాడబడినాడు.
విరియాల మల్ల నృపతికుమారుడు రుద్రనాఖ్యుడు. అతడికి కార్యదురంధరుడైన పెద్ద గణపతి జన్మించాడు. ఇతడే విరియాల గణపతి రాజుగా కీర్తి పొందాడు. కాకతీయ గణపతి దేవ మహారాజుకు పుణ్యంగా కొండపల్లి నాటిలోని వ్రింటగెపురంలో ప్రసన్న చెన్నకేశవదేవుని సకల జనులను రక్షించేవిధంగా ప్రతిష్టించాడు. ఆ దేవుని అంగరంగ భోగాలకు రుద్రసముద్రం మీద మల్వకుంటలో 1 మర్తురు, తూపు కింది కాల్వ కింద 1 మర్తురు, రెడ్డి చెర్వు ఉత్తరపు దిక్కు, దక్షిణపు దిక్కున 1 మర్తురు, కంన్న చెర్వు వెనక పమ్మల కుంటలో బ్రాహ్మణ వృత్తులు, జనార్ధనుని వారి వ్రిత్తి, దొమ్మెన కూచివారి వ్రిత్తి, గంగన పెద్దివారి వ్రిత్తి, లక్ష్మీధర పెద్దవారి వ్రిత్తి, పోత అప్పన వ్రిత్తి, వీరందరు 1 మర్తురు, కాచి పింన్ని వ్రిత్తి, మోదలయారి వ్రిత్త్తి, కంచి నారాయణదాసులు వ్రిత్తి, బండమీంది మల్లినాథ దేవర వ్రిత్తి ఇవన్నీ దేవుని కార్తిక మాసంలో జరిగే సేవలకు రెండు కాలాలలో పండే భూమిని సర్వ మాన్యంగా సమర్పించారు. అదేవిధంగా వెలిపొలాన్ని కూడా ఆయా ప్రదేశాలలో సమర్పించారు. 18 సమయాలకు చెందినవారు సుంకంగా దేవునికి అఖండ దీపానికి గద్యానమునకు వీసము సమర్పించారు.
అదేవిధంగా అమృతపడికి (నైవేద్యానికి) రెండు కాలాలలో పండే వెలిపొలము, విడెము (తాంబూలము), శ్రీగంధం, వస్ర్తా లు, గుగ్గిలం వంటివి చెన్నకేశవస్వామి శ్రీజయంతి పవిత్రారోపాలుకు రెడ్డి చెరువు కండికాల్వలో భూమిని సమర్పించారు. శాసనం చివరలో చెన్నకేశవస్వామి భక్తులందరినీ రక్షించమని వేడుకున్న పద్యాలున్నాయి.
ఈ శాసనాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కాకతీయుల కాలంలో వారు వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యం, నీటిపారుదల వసతులు, ఒక గ్రామంలో ఎన్ని చెరువులు, కుంటలు ఉన్నాయో, వాటిద్వారా రెండు కాలాల పంటలు పండుతాయన్న అంశం స్పష్టంగా మనకు తెలుస్తున్నది.
– బిన్నూరి మనోహరి