టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ఎప్పుడు ప్రకటిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. విజయ దశమి నాడు కేసీఆర్ జాతీయ పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు కేసీఆర్ ప్రకటనను తేలిగ్గా తీసుకున్న జాతీయ పార్టీల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. బీఆర్ఎస్ ప్రవేశంతో దేశ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభం కానుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, చాణక్యం ఉన్న కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ల కు గట్టి సవాల్ విసురుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతకీ కేసీఆర్ ఏ వ్యూహంతో, ఏ ధైర్యంతో జాతీయపార్టీని ఆవిర్భవించారనే విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు టీఆర్ఎస్ పార్టీ 34.15 శాతం ఓట్లతో 63 శాసనసభ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ముఖ్య మంత్రి కేసీఆర్ తన పదవిని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజా సేవే పరమావధిగా పాలన సాగించారు. పేదలు, మధ్యతరగతి వారి ఉన్నతికి తోడ్పడే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. దీనివల్ల 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం ఓట్లతో 83 స్థానాల్లో విజయఢంకా మోగించారు. ఈ ఎనిమి దేండ్లలో కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశమంతటా ప్రశంసలు అందుకుంటున్నది.
భారతదేశంలో అనేక పార్టీలున్నాయి. అందులో జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. జాతీయ పార్టీ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. దానితో పాటు లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు సాధించాలి. లేదా 3 రాష్ర్టాల నుంచి కనీసం 2 శాతం లోక్సభ సీట్లను సాధించాలి. ఈ గణాంకాలను పరిశీలించినప్పుడు టీఆర్ఎస్కు ఇది పెద్ద సవాలేనని ప్రజలు అనుకోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీకి, పోరాటయోధుడిగా, పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్కు ఇది కష్టం కాదు. తన విధానాలు, పథకాలతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పొరుగున ఉన్న రాష్ర్టాల్లో సీట్లు, ఓట్లు పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనుసరించిన పోరాట శైలి ని బట్టి ఈ అంచనాకు రావచ్చు.
గతంలో తెలంగాణ రాజకీయ పెద్దలు పదవులకు బానిసలై తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండేవారు. 1969లో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని వారు నీరుగార్చారు. అయితే ఈ అన్యాయాన్ని సహించని కేసీఆర్, ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు 2001లో శ్రీకారం చుట్టారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను, అభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకతను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. మేధావులతో నెలల తరబడి చర్చించారు. అన్నివర్గాల ప్రజలను తెలంగాణ పోరాటంలో పాల్గొనేలా చేశారు. శాంతియుత పద్ధతిలో సాగిన ఈ పోరాటంలో ఆటపాటలు కీలక భూమిక పోషించాయి. రాజకీయపార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పోరాటం లో భాగస్వామ్యం అయ్యే పరిస్థితి వచ్చింది. పట్టు వదలని విక్రమార్కుడిలాగా కేసీఆర్ ఎలా పోరాటం చేయగలరో జాతీయపార్టీ నేతలకు తెలిసివచ్చింది. కేసీఆర్ దీక్షకు, తెలంగాణ ప్రజల పోరాటానికి ఢిల్లీ పెద్దలు తల వంచక తప్పలేదు. ఇప్పుడు కూడా అదే పోరాట స్ఫూర్తితో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తాడని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
కేసీఆర్ తన ఎనిమిదేండ్ల పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పరిపాలనపై పట్టు సాధించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల పట్ల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులవుతున్నారు. తమ ప్రాంతాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ వివిధ రాష్ర్టాల్లో పోటీచేసి మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉన్నది.
తాము బీజేపీని నమ్మి మోసపోయామని దేశ ప్రజానీకం తెలుసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టడాన్ని వారు నిరసిస్తున్నారు. ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణ ఎండ మావేనని అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, రైతులు దేశాన్ని నిజాయతీపరుడు, సమర్థుడైన నాయకుడు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నారు. ఈ బాధ్యతను స్వీకరించడానికి ఇతర జాతీయపార్టీలు, ప్రాంతీయపార్టీల నేతలు ఎవరూ ముందుకు రావడంలేదు. అయితే దేశ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ ఆ బాధ్యత తీసుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయుల పక్షాన పోరాడేందుకు సిద్ధమయ్యారు. తనకు ఉన్న రాజకీయ పరిణతితో కేసీఆర్ ఈ బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తారని ఆశిద్దాం. కేసీఆర్ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)
-మర్రి యాదవ రెడ్డి
73372 22461