ఇది స్వాతంత్య్ర సంబురాల వజ్రోత్సవ సందర్భం. జగద్గురుగా పేరుగాంచిన భరతమాత రాష్ట్ర ధర్మం నిలబెట్టుట కోసం రాజధర్మాన్ని వెతుక్కుంటుంది, ప్రపంచ రాజకీయ చరిత్రలో.. పెద్ద దేశాలకు చిన్న నాయకులు- చిన్న దేశాలకు పెద్ద నాయకులు, అనే నానుడిని తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. ఇలాంటి తరుణంలో.. భారతదేశ రాజకీయ పరిణామంలో ఒక సరికొత్త కిరణజన్య సంయోగ క్రియ మొదలైంది.
దేశానికి కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడు అవసరం. ఆయన చేపట్టబోయే మార్గంలో మనమందరం తోడైతే… దేశాభివృద్ధికి భాగస్వామ్యులైన చరిత్ర మనందరికి దక్కుతుంది. దేశ వాసులందరికీ ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమవుతుందో గణాంకాల ద్వారా విడమర్చి చెప్పిన కేసీఆర్ మాటలకు యావత్ దేశం నివ్వెరపోయింది. సముద్రగర్భంలో వృథాగా కలిసిపోతున్న నీటి జలాలతో దేశాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయగలమో ఇప్పటికే కేసీఆర్ విడమర్చి చెప్పారు. అందుకే తరచుగా గుణాత్మకమైన మార్పు కోసం ఒకటవుదామని కేసీఆర్ అంటున్నారు. దీనికోసం రాజకీయ సంకల్పం కావాలి. సంకల్ప సాధన కోసం చిత్తశుద్ధితో కూడిన శక్తియుక్తులు ప్రదర్శించాలి.
దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలే సాక్ష్యం! దేశాన్ని నడపడంలో జాతీయ రాజకీయ పక్షాలు విఫలమవుతున్నాయి. బీజేపీ బిజినెస్ జనతా పార్టీగా మారిపోయింది. బీజేపీ చేపట్టిన డిమానిటైజేషన్ (నోట్ల రద్దు)దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద కుంభకోణం. పార్లమెంట్లో జరిగిన చర్చలో మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్సింగ్ వెలిబుచ్చిన మూడు మాటలు ఇప్పటికీ గుర్తుంచుకోదగినవి, ఆలోచింపదగినవి. ఈయన నోట్ల రద్దుపై మాట్లాడుతూ – ఆర్గనైజ్డ్ లూట్ (సంస్థాగతమైన కొల్లగొట్టడం), లీగలైజ్డ్ ప్లండర్ (చట్టబద్ధమైన దోపిడీ), మాన్యుమెంట్ మిస్మేనేజ్మెంట్ (అతి ఘోర వైఫల్యం) ఆని చెప్పిన మాటలు బీజేపీ పనితీరుకు అద్దం పడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ, రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇతర పార్టీలను నిర్మూలించాలని చూస్తున్నది.
ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కనుమరుగయ్యే దశలో ఉన్నది. ఆ పార్టీ నేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఎన్నో వైఫల్యాలను ఒప్పుకున్నట్టయింది. దేశాన్ని అతి ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, భారతజాతి నిర్మాణంలో బలహీన పునాదులున్నాయన్న కఠోర సత్యాన్ని అంగీకరిస్తున్నది. ఇది ఆ పార్టీ నేత రాహుల్ చేపట్టిన పాదయాత్రకు చేసిన నామకరణం ద్వారా అవగతమవుతుంది. ఏ సామాజిక ఆర్థిక నినాదం ఇవ్వకుండా బీజేపీని విమర్శించడంలో ఒకింత అభాసుపాలైనట్లేనని అనుకోవచ్చు. దేశానికి దిశా నిర్దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలమయ్యాయనేది స్పష్టం. జాతీయ రాజకీయ పక్షాల వైఫల్యాల నేపథ్యంలోనే కేసీఆర్ బీఆర్ఎస్ ఆలోచన చేయవలసి వచ్చింది.
తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకుడు కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రక్షాళనకు మనమందరం చేయూతనిద్దాం! రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు లాంటి తెలంగాణ మాడల్ అభివృద్ధితో అర్ధ సత్యాలతో నిర్మాణమైన గుజరాత్ అభివృద్ధి నమూనా డొల్లతనాన్ని ఢీకొట్టి భారతీయ అభివృద్ధి నమూనా తయారుచేద్దాం! ఆశావాహ దృక్పథంతో ముందుకువెళితే… రేపటి భవిష్యత్తుకు ఏదో ఒక దారి లభిస్తుంది. తెలంగాణ ప్రజల తండ్రిగా! అన్నగా! తమ్ముడిగా! కుటుంబంలోని సభ్యుడిగా కేసీఆర్ చేస్తున్న ఆలోచనలు, దేశ హితం కోసం చేస్తున్న కాయకల్ప చికిత్సగా భావిద్దాం! ఈ తెలంగాణ యుగపురుషుడిని భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం!
జై తెలంగాణ !!
జై భారత్!!
(వ్యాసకర్త: ఢిల్లీ వసంత్ , 81424 44345 , రైతు నాయకుడు, సామాజికవేత్త)