ప్రపంచ చరిత్రలో ఇద్దరు మాత్రమే మహా మేధావులుగా కీర్తించబడ్డారు. ఒకరు కారల్ మార్క్స్ అయితే, మరొకరు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. ఈ మహనీయులు పీడిత, తాడిత అణగారిన వర్గాల పక్షాన చివరిశ్వాస వరకు సర్వం త్యజించి, గుణాత్మక మార్పు కోసం అహర్నిశలు శ్రమించారు. తాత్విక చింతనతో క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలను సృష్టించి, వారందరినీ ఏకతాటిపై నడిపి వ్యవస్థ సమూల మార్పుల కోసం కృషిచేశారు. భారత సమాజంలో హింస, వివక్షకు గురవుతున్న అట్టడుగు వర్గంలో జన్మించి అందనంత ఎత్తుకు ఎదిగిన మహామేధావి అంబేద్కర్.
అంబేద్కర్ గొప్పతనానికి గుర్తుగా తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అలాగే తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ఆయన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న అమితమైన గౌరవం అర్థమవుతున్నది. ఇంతటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ను తెలంగాణ సమాజమే కాదు, యావత్ భారతజాతి అభినందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే అంబేద్కర్ ఆలోచనల ఫలితంగా. ‘బోధించు- సమీకరించు-పోరాడు’ అనే నినాదంతోనే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించడం ద్వారా ప్రజా పోరాటం మొదలైంది. ఆ పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. చిన్న రాష్ర్టాల ద్వారానే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి సాధ్యపడుతుందని అంబేద్కర్ అభిలషించారు. రా జ్యాంగంలోని ఆర్టికల్-3లో ఆయన పొందుపరిచిన అంశాలు రాష్ట్ర ఏర్పాటుకు దిక్సూచిలా పనిచేశాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేసీఆర్ అనేకసార్లు పునరుద్ఘాటించారు.
సమాఖ్య స్ఫూర్తి రాజ్యంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు కీలకమైనవి. రాష్ట్ర శ్రేయస్సు కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసిపనిచేయాలి. కానీ కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నది. లౌకికత్వానికి భిన్నంగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ తన ఉనికిని కాపాడుకుంటున్నది. గత ఎనిమిదేండ్లలో 50 వేల మంది దళితులపై దాడులు జరగగా అందులో బీజేపీ పాలిత యూపీ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉండటం గమనార్హం.
‘పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన అభివృ ద్ధి’ అని అంబేద్కర్ అన్న మాటలను కేసీఆర్ బలంగా విశ్వసించారు. అందుకే రాష్ట్ర ఆవిర్భావం మొదలు నేటివరకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించారు. దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటుచేశారు. దళితుల జీవితాల్లో మార్పులు తెచ్చేలా, ఆర్థిక స్వావలంబన, సుస్థిరాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా, యావత్ దేశం అబ్బురపడే రీతిలో దళితబం ధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలతో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 40 వేల కుటుంబాలకు ఈ పథకం అమలు జరిగింది. దీనివల్ల పారిశ్రామికరంగంలో ఒకప్పుడు కూలీలుగా పనిచేసిన వర్గాలు నేడు యజమానులుగా మారుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం దళితుల కోసమే కాకుండా బలహీనవర్గాలు, మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇవాళ తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శం. కుటీర పరిశ్రమల బలోపేతం కోసం నేతన్నకు చేయూతనందిస్తున్నారు. గొర్రెలు పంపిణీ, చేపల పంపిణీ వంటి విభిన్న పథకాలకు కేసీఆర్ రూపకల్పన చేసి కులవృత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఉత్పత్తి, ఉపాధి పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. తలసరి ఆదాయం పెరిగింది. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. కానీ కేంద్రం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి నల్ల చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేసి విఫలమైంది.
‘నాడు సాహు మహారాజ్ అందించిన ఉపకార వేతనం ఈ దేశానికి అంబేద్కర్ రూపంలో ఒక గొప్ప మేధావిని అందించింది. ఈనాడు కేసీఆర్ విదేశీ విద్య కోసం అందిస్తున్న ఉపకార వేతనం ఈ దేశానికి మరెందరో అంబేద్కర్లను అందించనుంది’. ‘ఒక జాతి అభివృద్ధిని ఆ జాతిలోని మహిళల అభివృద్ధితో కొలుస్తారు’ అని అంబేద్కర్ అన్నారు. కానీ ఇవాళ దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. మహిళల రక్షణలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందింది. ఉపాధి రంగంలోనూ మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళల భాగస్వామ్యం దేశంలో 25.1 శాతం మాత్రమే అని ‘ఆక్స్ఫామ్ ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్టు-2022’ వెల్లడించింది. కానీ కేసీఆర్ మహిళలకు ఉన్నతవిద్యను మెరుగుపరిచేలా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక పాలనలో మహిళల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచారు. దీనివల్ల అత్యధికంగా లబ్ధి పొందుతున్నది అట్టడుగు వర్గాల్లోని మహిళలే. రాష్ట్ర ప్రభుత్వం ‘వీ-హబ్’ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. స్వయంసేవక సంఘాల ద్వారా రాయితీలు, మహిళా రక్షణ కోసం ‘షీ’ టీంలను ఏర్పాటుచేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళల జీవన ప్రమాణాలు మరింతగా మెరుగయ్యాయి. ఇది కాదనలేని సత్యం.
కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అం బేద్కర్ ఆలోచనల అమలులో చూపిన చొర వ, దళిత బహుజనుల అభివృద్ధి పట్ల నిబద్ధత చూపుతున్నది. ఆయన ఆలోచనలను పూర్తిగా ఆకళింపు చేసుకొని, ఆయన తొవ్వలో ఆచరణలో నడిచిన తర్వాతే కేసీఆర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును సచివాలయానికి సూచించారు. కేంద్రప్రభుత్వం నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం, పెట్టకపోవడం వారి విచక్షణకే వదిలిపెట్టాలి. అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తేనే ప్రజాస్వామిక వ్యవస్థకు మనుగడ.
(వ్యాసకర్త: ప్రొఫెసర్ తాటికొండ రమేష్ , 97016 82924, వైస్ ఛాన్స్లర్, కేయూ)