హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత భారీగా చేరికలుంటాయన్నారు. ఆ తర్వాత అమిత్ షా తుక్కుగూడ బహిరంగ సభలో ఉంటాయన్నారు. టీఆర్ఎస్లో చాలామంది కట్టప్పలున్నారు, త్వరలో వారంతా బయటికి వస్తారని పార్ట్టీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ హింట్ ఇచ్చారు. ఒక్క మునుగోడుకే కాదు, 14 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సమక్షంలో భారీగా చేరికలుంటాయన్నారు. ఏడాదికాలంగా అదిగో వచ్చేస్తున్నారు.. ఇదిగో వచ్చేస్తున్నారంటూ కమలనాథుల హడావుడే తప్ప పాలకపక్షం టీఆర్ఎస్ నుంచి ఏ ఒక్క నాయకుడు కమలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటివరకు బీజేపీలో చేరింది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మరొకరు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి. వీరిద్దరూ కాంగ్రెస్సే. ‘వస్తాడు నా రాజు ఈ రోజు..’ అంటూ గంపెడాశతో కళ్లు కాయలు కాసేలా కమలనాథులు ఎదురు చూడటమే తప్ప ఏ మాత్రం వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత భారీగా చేరికలుంటాయని డాక్టర్ లక్ష్మణ్ మరోసారి ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నేతల వాలకం చూస్తుంటే ‘ఓ స్త్రీ రేపు రా’ నినాదం గుర్తుకు వస్తున్నది.
పోస్టులు ఊరికే రావు !
ఎన్నికలు ఏవైనా టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు కాంగ్రెస్లో సర్వ సాధారణం. ఎన్నికల్లో పోటీచేసి చేతి చమురు వదిలించుకునే కంటే ఏ రాష్ర్టానికైనా పరిశీలకునిగా వెళ్లి నాలుగు డబ్బులు వెనుకేసుకోవడం బెటర్ అని అంటుంటారు సీనియర్లు. అయితే ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోయినా పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు గాంధీభవన్లో గుప్పుమన్నాయి. ఏఐసీసీ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా పీసీసీ డెలిగేట్స్, కో-ఆప్షన్ మెంబర్స్ ఎంపికకు రాష్ర్టానికి ఏఐసీసీ నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వచ్చారు. నియోజకవర్గానికి (119) ఇద్దరి చొప్పున 238 మందిని పీసీసీ డెలిగేట్స్గా, 36 మందిని కో-ఆప్షన్ మెంబర్లను ఎన్నుకోవాలి. కానీ పార్టీ ‘బై లా’కు విరుద్ధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తాను దిగిన హోటల్లో కౌంటర్ తెరిచి ఎన్నుకోవాల్సిన సంఖ్య కంటే 112 మందిని అదనంగా జాబితాలో చేర్చడంపై లిఖితపూర్వకంగా అధిష్ఠానానికి టీపీసీసీ ఫిర్యాదు చేసింది. దీనిపై సదరు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమాధానం ఏమంటే ‘పోస్టులు ఊరికే రావు..’