ఆర్థిక సమానత్వం సాధించిననాడే దళితులు స్వేచ్ఛగా, శక్తివంతులుగా ఎదుగుతారని.. ఆర్థికాభివృద్ధి లేకుండా దళితుల అభివృద్ధి అసాధ్యమన్న మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. దళితులకు పలురంగాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ.. ఆర్థిక ఎదుగుదలకు, గుణాత్మక మార్పునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వారి జీవితాల్లో ఆత్మగౌరవ ఆర్థిక అభివృద్ధి వెలుగుబాటలు పరుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన అనేకమంది దళిత విద్యార్థి ఉద్యమకారులను చట్టసభలకు పంపిన ఘనత కేసీఆర్ది. ఆర్థిక స్థితిగతులను చూడకుండా నిబద్ధత కలిగిన నిరుపేద దళిత వర్గాలకు చెందినవారికి కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్యే, ఎంపీలుగా రాజకీయ అవకాశాలు కల్పించారు.
వ్యాపార రంగాల్లోనూ దళితులను భాగస్వాములను చేస్తే ఆ రంగంలోనూ ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ, ఈ 75 ఏండ్ల స్వాతం త్య్ర భారతదేశంలో ఏ ప్రభుత్వమూ వారిని వ్యాపారరంగంలో ప్రోత్సహించలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో దృష్టిసారించిన కేసీఆర్ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా గత బడ్జెట్లో నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితబంధుకు 7 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. విడతల వారీగా ఈ సంఖ్యను పెంచడానికి కృషిచేసే అవకాశం ఉన్నది. అలాగే ఎస్సీల అభివృద్ధి కోసం దాదాపు రూ.20 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించిన తెలంగాణ సర్కారు దళితులను సమాజంలో అగ్రభాగాన నిలిపే చర్యలకు శ్రీకారం చుట్టడం నిజంగా గర్వించదగిన విషయం.
తెలంగాణ ప్రభుత్వం దళితులకు అవకాశాలను సృష్టించడం గొప్ప విషయం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో వివిధ సరఫరాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో దళితులకు 16 శాతం కేటాయించడం మరో చారిత్రాత్మక నిర్ణయం. పారిశుధ్యం, సెక్యూరిటీ, పోషకాహారానికి సంబంధించిన వాటిని సరఫరా చేయడంలో అవకాశాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం దళితజాతి గర్వించదగిన విషయం. కాంట్రాక్టు ఉద్యోగమైతే చాలనుకునే దళితునికి కాంట్రాక్టర్గా అవకాశాలు కల్పించడం.. ట్రాక్టర్లు, కారు డ్రైవర్లుగా జీతానికి పనిచేసుకునే వారిని నేడు వాటికి యజమానులుగా.. బడికి, ఉన్నతవిద్యకు దూరంగా ఉన్న దళితులకు విదేశీ విద్యా నిధి పథకం కింద రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేసి నేడు ఎంతోమంది దళిత బిడ్డలు విదేశాల్లో చదువడానికి గొప్ప అవకాశాలు అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అంబేద్కర్ మహాశయుడు కలలుగన్న ఆర్థిక స్వేచ్ఛ, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయరంగాల్లో దళితులకు సముచిత స్థానం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రమే కల్పిస్తున్నది. చీకటి బతుకుల్లో వెలుగులు పూయిస్తున్నది. కాళ్లను చక్రాలుగా మలుసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి కేసీఆర్.
ప్రతి గుండె చప్పుడు.. ఆ గుండెల వెనుక ఉన్న ఆవేదన అంతరంగాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ కారణజన్ముడు కేసీఆర్. అందుకే నేడు దళితుల ఆర్థిక ఎదుగుదలకు, ఆత్మగౌరవ జీవితాలకు భరోసా ఇస్తున్నారు. తాత్కాలిక పథకాలు కాకుండా ఆలస్యమైనా, శాశ్వతంగా దళితుల జీవితాల్లో గొప్ప మార్పు వచ్చే చర్యలు చేపడుతూ ముందుకు సాగడం నిజంగా కేసీఆర్ దళితుల పాలిట దైవమై నిలుస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో తొలగని చీకట్లు.. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో తొలగి అనేకరంగాల్లో నేడు దళితులు రాణించడానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు కళ్లముందు కన్పించే సాక్ష్యాలైతే.. భవిష్యత్తు తరాలు చదువుకునే చరిత్రగా మిగలడం ఖాయం. అటువంటి మహానేత పక్షాన దళితజాతి యావత్తు నిలిచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి.. భవిష్యత్తు లో దేశానికి నాయకత్వం వహించేలా చూడాలి. తద్వారా భారతదేశంలో ఉన్న దళితులందరి జీవితాలు బాగుపడే అవకాశాలున్నాయి. అందుకే మనమంతా కేసీఆర్ అడుగులో పయనించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
(వ్యాసకర్త: సంపత్ గడ్డం , 8933 03516, దళిత విద్యార్థి నాయకుడు)