ఈ జగత్తులోని ప్రతి మనిషి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయాలన్నా, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవాలన్నా ఉపయోగించుకునే మాధ్యమమే నుడి. భాషకు లిపి, భాషా సూత్రాలు, వ్యాకరణం, సాహిత్యం ముఖ్యమైన అంశాలు. భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తి గాదు. అయితే మనదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాష హిందీ. ఈ భాష పలకడానికి సులభంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది.
భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు నాడు హిందీ భాష దోహదపడింది. అందుకే గాంధీజీ స్ఫూర్తితో రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్డ్లోని హిందీని 1949 సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించింది. అప్పటినుంచి ఏటా సెప్టెంబర్ 14న ‘హిందీ భాషా దినోత్సవం’ను జరుపుకొంటున్నారు. హిందీని అధికార భాష చేయాలని బీహార్ రాజేంద్ర సింహాతో పాటు హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కలేల్కర్, మైథిలి శరణ్ గుప్త్, సేథ్ గోవింద్ దాస్లాంటి సాహితీ వేత్తలు ర్యాలీలు చేశారు. ఫలితంగా 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం హిందీని అధికార భాషగా ఆమోదించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం, దేవనాగరి లిపిలో రాసిన హిందీని అధికారిక భాషగా స్వీకరించారు. భారతదేశంలో 22 షెడ్యూల్డ్ భాషలున్నాయి. వాటిలో రెండు అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయి. అవి: హిందీ, ఇంగ్లీష్ భాషలు. ఆధునిక హిందీని నేడు 350 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారు. మన దేశంలో కోట్లాది ప్రజల హృదయ స్పందనగా వినిపించే భాష హిందీ. హిందీ జాతీయ భాషగా, రాజభాషగా, అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 200 విశ్వవిద్యాలయాల్లో హిందీకి సంబంధించి అధ్యయనం, పరిశోధనలు జరుగుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్, ఫిజీ, జపాన్, గయానా, సురినామ్, ట్రినిడాడ్, హాలెండ్, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, జాంబియా, హుడాంగా, కెనడా, హోలాం డ్, స్విట్జర్లాండ్, హంగేరి, రష్యా, చైనా, ఖతార్, అమెరికా వంటి మొదలైన దేశాల్లో హిందీ గుర్తింపు పొందింది. నేడు అన్ని సామాజిక వర్గాల్లో హిందీ ప్రాముఖ్యం పెరుగుతున్నది. ఇందులో బాలీవుడ్ పాత్ర విశేషంగా కనిపిస్తున్నది.
నేడు అమెరికాలో, కెనడా, స్విట్జర్లాండ్ మొదలైన దేశాల్లో హిందీ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిద్వారా ఎంతోమంది ప్రజలు హిందీ భాషను నేర్చుకుంటున్నారు. హిందీని శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన శబ్దకోశాలచే సన్నద్ధం చేస్తూ మరోవైపు ప్రసార, ప్రచార రంగాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. సాంకేతిక విజ్ఞానంలో వచ్చిన మార్పులతో ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో శ్రవ్య, దృశ్య సాధనాల ద్వారా హిందీ ప్రచారంలోనూ, ప్రగతిలోనూ విశేషమైన ప్రగతి కనిపిస్తున్నది.
వార్తలు ప్రసారం చేసే ఛానళ్ళు ఎక్కువగా హిందీలో ఉన్నాయి. సీరియళ్లు కూడా హిందీ భాషలో ప్రసారమవుతున్నాయి. హిందీ ఒక సమృద్ధమైన, సంపన్నమైన భాష. దీనికి శబ్ద సంపద ఉన్నది. జనాభా దృష్ట్యా చూస్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య ఇంగ్లీష్, చైనీస్ తర్వాత మూడోస్థానంలో ఉన్నది. ప్రసార మాధ్యమంలో కూడా హిందీ తన సుస్థిరమైన స్థానాన్ని సాధించింది. ఇంటర్నెట్, కంప్యూటర్ నిపుణులు దేవనాగరి లిపిని అత్యధికంగా సమర్థించి స్వీకరించారు. ఒక లక్షా 95 వేల హిందీ శబ్దాలు ఇంటర్నెట్లో నిక్షిప్తం చేశారు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలకు హిందీ సుపరిచితం. ఇన్ని విశిష్టతలు కలిగిన హిందీ భాషను మాట్లాడుదాం, గౌరవించుకుందాం. ఆ భాష గొప్పతనాన్ని చాటుదాం.
-కామిడి సతీష్రెడ్డి , 98484 45134