‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకం రైతులకేమో గానీ బీమా కంపెనీలకు మాత్రం ఆదాయ వనరుగా మారింది. ప్రధాని మోదీ దేశ రైతాంగం మేలు కోసం ఈ పథకాన్ని 2016, ఫిబ్రవరి 18న ప్రారంభించారు. రైతులు ఆరుగాలం చెమటోడ్చి తమ రెక్కల కష్టంతో సాగు చేస్తే, తీరా పంట చేతికందే సమయానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతుండటం ఏటా ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటుంది. ఆ రైతాంగానికి
మేలు జరిగేలా ఈ పథకం ప్రారంభమైంది. కానీ, ఈ పథకం వల్ల రైతుల కన్నా బీమా కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నారు.
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఈ పథకం అమలు చేయడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారంటే ఈ పథకంలో ఎంత పస ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, హర్యానాతో పాటు తెలంగాణ రైతులు కూడా ఈ పథకం పట్ల విముఖంగా ఉన్నారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి బీమా ప్రీమియంగా రూ.లక్షన్నర కోట్లు చెల్లిస్తే రైతులకు క్లెయిమ్స్ పోగా బీమా కంపెనీలకు రూ.40 వేల కోట్ల లాభాలు వచ్చాయి.
బీమా కంపెనీలకు కాసుల వర్షం: ఈ పథకం అమలు కోసం 13 బీమా కంపెనీలకు గతేడాది వరకు రూ.1,59,132 కోట్లు ప్రీమి యం చెల్లించిగా, రైతులకు క్లెయిమ్స్ సకాలంలో చేయకుండా సవాలక్ష నిబంధనలు పెట్టారు. గ్రామ యూనిట్ కాకుండా ఏరియా డివిజన్ యూనిట్స్ పెట్టడం, పంట నష్టం అం చనాకు నాలుగేండ్లు ప్రామాణికంగా లెక్కలు వేయడం, చివరికి ఆ నిబంధన ఈ నిబంధన అని పంట సీజన్లు మారినా రైతులకు నష్ట పరిహారం అందడం లేదు. దీంతో ఆ పథకం తో రైతులకు ఏం ప్రయోజనం ఒనగూడటం లేదు.
రైతుల మేలే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకం గాడితప్పి బీమా కంపెనీలకు మేలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం కింద ఏటా రూ.989 కోట్లు చెల్లిస్తే క్లెయిమ్స్ కింద బీమా కంపెనీలు చెల్లించింది రూ.817 కోట్లు. ఒక సీజన్లోనే బీమా కంపెనీలకు రూ.172 కోట్లు లాభాలు వచ్చాయి. ఐదేండ్లలో బీమా కంపెనీలకు రూ.40 వేల కోట్ల లాభాలు వచ్చాయి. అవే రూ.40 వేల కోట్లు ప్రభుత్వమే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు ఎంత ప్రయోజనం చేకూరుతుందో ఆలోచించాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి మేలుచేసేలా సాగు నీరు, ఉచిత విద్యుత్తో పాటు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు పేర అం దిస్తున్నారు. పథకాలు ప్రవేశపెడితే రైతులకు మేలు చేసేలా ఉండాలీ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ తెచ్చిన ‘ప్రధా న మంత్రి ఫసల్ బీమా యోజన’ పథకంలా ఉండకూడదు.
సాధారణంగా బీమా కం పెనీలకు రూ.40 వేల కోట్లు లాభాలు వచ్చాయంటే ఇక్కడ ఏదైనా క్విడ్ ప్రో కో ఉందా అనే అనుమానాలు రైతులకు వస్తున్నాయి. ప్రధానమంత్రి బేషరతుగా ఈ బీమా పథకాన్ని రద్దు చేయాలి. ఏటా ప్రీమియం కింద చెల్లించే వేల కోట్ల రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందించాలి. అప్పుడే దేశ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గుప్పెడు బీమా కంపెనీల యాజమాన్యాలకు లాభాలను చేకూర్చేందుకు కోట్లా ది మంది రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అమానవీయం.
(వ్యాసకర్త: మందడపు సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్, మంచుకొండ, ఖమ్మం)