కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘మైండ్ గేమ్’ ఆడుతున్నది. మోదీ-షా కేంద్రంగా ఈ ఆటలు సాగుతున్నాయి. మత విద్వేషాలను సమాజంపై వదిలి బీజేపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాల్లో మతం పేర అల్లర్లు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అధికారమే పరమావధిగా బీజేపీ అరాచక శక్తులు యావత్ జాతిని ఛిద్రం చేస్తున్నాయి. ఈ కోణంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణలో మతచిచ్చు రేపడానికి ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తెలంగాణ పల్లెల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే యాత్రలు చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి ఉక్కుపాదం మోపడంతో వారి ఆటలకు అడ్డుకట్ట పడ్డట్టయ్యింది.
మునుగోడు అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికలో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది. అందుకే నేరుగా కేంద్ర పెద్దల కనుసైగలతో మతం కార్డులను విసురుతున్నది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ఆమెను సుప్రీంకోర్టు మందలించిన విషయం తెలిసిందే. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ దేశంలోని అట్టడుగు, మైనారిటీ వర్గాల గుండెలను విచ్ఛిన్నం చేస్తున్నది. గోద్రా సజీవ దహనం ఘటన అనంతరం జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన 11 మంది యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించి విడుదల చేయడం వంటి ఘటనలు చూస్తుంటే బీజేపీ మతోన్మాద హింస ఎంత పేట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఖరి యావత్ దేశ ప్రజలను తలదించకునేలా ఉన్నది. ఆ పార్టీ నాయకుల చేష్టలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి.
తెలంగాణలో అధికారం మాదేనంటూ బీజేపీ పగటి కలలు గంటున్నది. అందుకోసం రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కుట్రలు పన్నుతున్నది. కుటుంబపాలన, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అంటూ ఒక వర్గంలో విద్వేషాన్ని సృష్టిస్తున్నది. ఇదంతా బీజేపీ ఆడుతున్న ‘మైండ్గేమ్’. కానీ బీజేపీ ఆటలు ఎక్కడ సాగినా తెలంగాణలో మాత్రం సాగవనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలె ‘గంగా జమునీ తహ్జీబ్’లా వర్ధిల్లుతున్నది. అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ ముందుకు సాగుతున్నది. భద్రత విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటున్నది.
గత ఎనిమిదేండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో చీమకు కూడా హని జరగలేదంటే అతిశయోక్తి కాదు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ‘మతం’ భూతాన్ని బండి సంజయ్ రూపంలో పంపిస్తున్నది. మతోన్మాద శక్తులను ఆదిలో ఉక్కుపాదంతో అణచివేసే ధైర్యం తెలంగాణ ప్రజల్లో మెండుగా ఉన్నదన్న విషయం మోదీ ప్రభుత్వం మరిచిపోకూడదు.
రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నది. తెలంగాణపై ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ కేంద్ర నాయకత్వం వివక్ష చూపుతున్నది. ఎన్ని కుట్రలు జేసినా తెలంగాణ ఉద్యమ సమాజం ముందు మోకరిలిల్లాసిందే అన్న విషయం కేంద్ర నాయకులు తెలుసుకోవాలి. బీజేపీ ప్రమాద రాజకీయాలు ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తాయో ముందే పసిగట్టిన కేసీఆర్ దేశ ప్రజలకు గట్టి సంకేతాలను, సందేశాన్ని పంపిస్తున్నారు. బీజేపీని ఇంతటితో నిలువరించుకుంటే దేశం అధోగతి పాలవుతుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆడే మైండ్ గేమ్లను, కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉన్నది. ఈ దిశగా మేధావులు, విద్యావంతులు ఆలోచన చేయాలి. యావత్ జాతిని జాగృతం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై కుట్రల కోణం అల్లుతున్నది బీజేపీ. వాళ్లేం చేసినా కేసీఆర్ ఒక్కడుగు కూడా వెనుకడుగు వేయబోరనేది జగమెరిగిన సత్యం. దేశం కోసం చివరిదాకా పోరాడే సిపాయి తత్వం కలిగిన ఉద్యమ యోధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
చైతన్యవంతులైన యువతీ యువకులు ఉన్న ప్రజా ఉద్యమ నేల తెలంగాణ. మతం పేరుతో చిచ్చు పెడదామనుకునేవారి ఆటలు ఇక్కడ సాగవు. సాగబోవు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభు త్వం కూడా ఇటువంటి కుట్రలను ఎంతమాత్రమూ సహించకుండా ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోప టం ముదావహం.
-చిటుకుల మైసారెడ్డి
94905 24724
-(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)