కేంద్రం స్వయంగా చట్టబద్ధ పరిమితిని మించి అప్పులు చేస్తున్నది. మరోవైపు ఈ పరిమితికి లోబడి ఉన్న రాష్ర్టాలను అప్పులు అధికంగా చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అనైతిక ధోరణిని ఈ వ్యాస రచయిత గణాంకాలతో సహా వివరించారు. మత విద్వేషాలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా దక్షిణాది, తూర్పు రాష్ర్టాలలో అధికారంలోకి రాలేమని గ్రహించిన బీజేపీ పెద్దలు ఈ ప్రాంతాలలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ‘ఉచితాలు’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రచయిత వెల్లడించారు.
యూనియన్ గవర్నమెంట్ తాను చేసిన ఎఫ్ఆర్బీఎం చట్టాలను తానే స్వయంగా పాటించకపోగా, ఆ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించినప్పటికీ, పాటించడం లేదని గగ్గోలు పెట్టడం ఎఫ్ఆర్బీఎం చట్టాల స్ఫూర్తికే కాకుండా భారత రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. 2003లో అటల్ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టానికి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు సవరణలు జరిగాయి. మోదీ ప్రభుత్వం 2015లో ఒకసారి, 2018లో మరోసారి సవరణలు జరిపింది.
ఎఫ్ఆర్బీఎం చట్టంలోని సెక్షన్ 4 (1) ప్రకారం కేంద్రం..
2021 మార్చి 31 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 3 శాతానికి పరిమితం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు జీడీపీలో 40 శాతానికి మించకుండా చూసుకోవాలి.
2019-20 సంవత్సరానికి 2003 నాటి ఎఫ్ఆర్బీఎం చట్టానికి ఎంతవరకు కేంద్రం కట్టుబడి ఉందనే కాగ్ నివేదికను 2022 ఆగస్టు 8వ తేదీ నాడు పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ నివేదిక ప్రకారం- కరోనా కంటే ముందే 2019-20 నాటికి ద్రవ్యలోటు 5.14 శాతంగా నమోదు అయ్యింది. అదే సమయంలో అప్పు జీడీపీలో 52.3 శాతంగా ఉంది.
ఇక కేంద్ర ప్రభుత్వ 2022-23 బడ్జెట్ గణాంకాలను పరిశీలిద్దాం. ఈ గణాంకాల ప్రకారం కేంద్రప్రభుత్వ వ్యయం రూ.39,44,909 కోట్లు. అందులో రెవెన్యూ రాబడి రూ.22,83,713 కోట్లు కాగా అప్పు రూ.16,61,196 కోట్లు. అప్పుపై చెల్లించే వడ్డీ ఈ సంవత్సరానికి రూ.9,40,651 కోట్లు. ఇది కేంద్ర రెవెన్యూ రాబడిలో 43 శాతం కాగా కేంద్రం మొత్తం వ్యయంలో 25 శాతంగా ఉండడం గమనార్హం. ఈ విధంగా 2022-23 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు జీడీపీలో 60.2 శాతానికి చేరుకోనుంది. మోదీ ప్రభుత్వం తన 8 ఏళ్ల కాలంలో సుమారు రూ.100 లక్షల కోట్లు అప్పు చేసింది అని బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు కేంద్ర ప్రభుత్వం చాలా దూరంగా ఉందని అర్థం.
కేంద్రం తన రెవెన్యూ రాబడిలో రాష్ర్టాలకు రాజ్యంగబద్దంగా 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 42 శాతం, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 41 శాతం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, సెస్ల పేరుతో కేంద్రం దీనికి గండి కొడుతున్నది. రాష్ర్టాలకు 29.6 శాతానికి మించి రెవెన్యూ బదలాయింపు జరగటం లేదని కేంద్రప్రభుత్వ సంస్థలే తెలియ చేస్తున్నాయి. జీఎస్టీ పేరిట కేంద్రం తన ఆర్థిక వనరులను అమాంతంగా పెంచుకున్నది. సెస్ రూపేణ, జీఎస్టీ రూపేణ వసూలు చేసిన మొత్తాన్ని కార్పొరేట్ టాక్స్ తగ్గింపులో వచ్చే లోటును పూడ్చుకోవడానికి, కార్పొరేట్ ఉద్దీపనలకు కేంద్రం అత్యధికంగా వినియోగిస్తూ ఉన్నదని అర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 32 ప్రకారం దేశంలోని పౌరులకు ఆహారహక్కు అనేది రాజ్యాంగబద్ధమైనది. 2013-జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం.. ఆహార భద్రత కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. 1965లో ఎఫ్సీఐ ఎర్పాటైనప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రతకు కృషి చేస్తున్నాయి. మనదేశంలో ఆహార భద్రత మోదీకి ముందు ఉంది, మోదీ తర్వాత కూడా ఉంటుంది. అయితే రేషన్ షాపులో మోదీ ఫొటో లేదంటూ చిల్లర రాద్ధాంతం చేయటం వారి ప్రచార అర్భాట ఆకాంక్షను తెలియజేస్తుంది.
రాష్ర్టాలు అమలు చేస్తున్న పేదల సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం ‘ఉచితాలు’ అంటూ తప్పుడు ప్రచారం చేయడానికి రాజకీయ కారణం ఉన్నది.
ఇటీవలి ఒక పరిశోధన దీనిని ధ్రువపరుస్తున్నది.
రుచిర్ శర్మ అనే ప్రముఖ ఆర్థికవేత్త పరిశోధన ప్రకారం- 1977-2001 మధ్యకాలంలో ప్రభుత్వ అనుకూలత వల్ల 33 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే మళ్ళీ ఎన్నిక అయ్యేవి. కానీ, గడిచిన ఐదేండ్లలో 56-60 శాతం ప్రభుత్వాలు మళ్ళీ ఎన్నిక అవుతున్నాయి. దీనికి కారణం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమేనని రుచిర్ శర్మ తెలిపారు. దక్షిణ, తూర్పు భారత దేశంలో ఉన్న ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మనసు చూరగొంటున్నాయని ఈ విశ్లేషణ ద్వారా వెల్లడైంది. ఈ రాష్ర్టాలలో మత ఘర్షణలు సృష్టించడం ద్వారా అధికారం చేపట్టలేమని గుర్తించిన బీజేపీ నాయకులు సంక్షేమ కార్యక్రమాలను ‘ఉచితాలు’ అనే పేరుతో అపహాస్యం చేసే వ్యూహానికి కొత్తగా తెర లేపినట్లు అర్థమవుతున్నది. మధ్యతరగతికి, దిగువ తరగతికి మధ్య ఘర్షణ సృష్టించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంగా దీనిని మేధావులు చూస్తున్నారు.
– పెండ్యాల మంగళాదేవి